అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు... ప్రభుత్వమే ఆదుకోవాలంటూ రైతుల విజ్ఞప్తి

author img

By

Published : Oct 9, 2022, 4:50 PM IST

Crops Damaged

Crops Damaged by Rain in Mahabubnagar: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కురిసిన అధిక వర్షాలు అన్నదాతకు నష్టాన్ని మిగిల్చాయి. చెరువులు, కుంటలు నిండి పంటలు నీటమునిగాయి. విస్తారంగా సాగై చేతికొచ్చే సమయానికి పత్తి, వరి, మిర్చి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Crops Damaged by Rain in Mahabubnagar: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గత మూడు రోజులుగా కురిసిన అధిక వర్షాలు పంటలపై ప్రతికుల ప్రభావాన్ని చూపాయి. సాధారణ వర్షపాతంతో పోలిస్తే మహబూబ్‌నగర్‌లో 68 శాతం, నారాయణపేటలో 77 శాతం, జోగులాంబ గద్వాలలో 45 శాతం, నాగకర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో 50 శాతం అధికంగా నమోదైంది.చాలాచోట్ల వరద పంట పొలాల్ని ముంచెత్తింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగైన పత్తి పంట చాలా ప్రాంతాల్లో దెబ్బతింది. రైతులు పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మోటార్లతో నీటిని ఎత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. 15 రోజుల్లో చేతికచ్చే పంట కళ్లముందే పనికిరాకుండా పోతుందని కన్నీటిపర్యంతమవుతున్నారు.

'పంట చేతికొచ్చే ముందు ఇలా వర్షాలు పడి ఖరాబు అయిపోయాయి. అకాల వర్షాలతో చెరువు నిండి వేసిన పంట మొత్తం దెబ్బతిన్నది. గత నాలుగు సంవత్సరాల నుంచి ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటున్నాం. పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదు. చివరికీ మందు డబ్బా తప్పా ఏం మిగిలే పరిస్థితి లేదు. చేతికొచ్చే పంటలను నష్టపోయాం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి '-బాధిత రైతులు

చెరువులు అలుగు పారిన చోట వాగులు ఉప్పొంగిన ప్రాంతాల్లో వరి పొలాలు జలమయమయ్యాయి. మిర్చి సాగుచేసిన రైతులది అదే పరిస్థితి. ఎకరాకు 50 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు పెట్టిబడి పెట్టినప్పటికీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముందుస్తు యాసంగి పంటగా వేరుశనగ సాగుచేసిన రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు.

వానల ప్రభావం పత్తి, వరి, మిరప సహా ఇతర పంటలపై కూడా ఉందని... క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పొలాల్లో నీరు నిలిచిన వారు తక్షణం నీటిని బయటకు పంపితే తప్ప పంటను రక్షించుకోలేమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయామని... ప్రభుత్వం తమకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు... ప్రభుత్వమే ఆదుకోవాలంటూ రైతుల విజ్ఞప్తి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.