ETV Bharat / city

huzurabad bypoll result: అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా.. ఎందుకు ఓడిపోయాం..?

author img

By

Published : Nov 3, 2021, 4:52 AM IST

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాష్ట్ర సమితిని నిరాశ పరిచింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ విజయాన్ని అందుకోలేకపోయింది. నాలుగు నెలలుగా ఎత్తులు, పైఎత్తులు.. వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెట్టినప్పటికీ... హుజూరాబాద్​పై గులాబీ జెండా ఎగరవేయలేకపోయింది. అయితే తెరాసకు ఓట్లేమీ తగ్గలేదని.. నైతిక విజయం తమదేనని తెరాస నేతలు పేర్కొంటున్నారు. భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని అధికార పార్టీ ఆరోపిస్తోంది. తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్​ హుజూరాబాద్ ఫలితంపై త్వరలో పూర్తిస్థాయి సమీక్ష జరిపే అవకాశం ఉంది.

huzurabad bypoll result
huzurabad bypoll result

huzurabad bypoll result: అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా.. ఎందుకు ఓడిపోయాం..?

ఏడున్నరేళ్లలో అనేక ఎన్నికల్లో విజయాలతో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికి.. దుబ్బాక ఉపఎన్నిక తర్వాత మరో ఎదురు దెబ్బతగిలింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ ఉపఎన్నికలో ఓటమి.. గులాబీ పార్టీని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈటల రాజేందర్‌ను ఓడించి హుజూరాబాద్‌లో మరోసారి గులాబీ జెండా ఎగరవేసేందుకు తెరాస... అనేక వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకెళ్లింది. అవినీతి ఆరోపణలతో ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన వెంటనే ఎన్నికలకు సిద్ధమైంది. ఈటల రాజేందర్ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని.. పార్టీకి, కేసీఆర్​కు నమ్మక ద్రోహం చేసేందుకు కుట్ర పన్నారని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఉపఎన్నికను ముందు నుంచీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెరాస.. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలందరినీ హుజూరాబాద్‌లో మోహరించింది.

దళితబంధుతో ముందుకొచ్చినా..

ఎప్పటిలాగే అభివృద్ధి, సంక్షేమం మంత్రాన్ని పటిస్తూనే.. బ్రహ్మాస్త్రంగా దళితబంధుతో ముందుకొచ్చినప్పటికీ... ఆశించిన ఫలితం దక్కలేదు. కొన్ని రోజులుగా కేటీఆర్​ మాత్రం.. హుజూరాబాద్ ఉపఎన్నిక చాలా చిన్నదని.. అంతగా ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానిస్తూ వచ్చారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఏ ఎన్నిక ఫలితాల రోజయినా... సంబురాలతో సందడిగా ఉండే తెలంగాణ భవన్ బోసిపోయి కనిపించింది.

ఎందుకు గెలవలేదు...

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల సరళిని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్షించారు. హరీశ్‌రావుతో పాటు ముఖ్య నేతలతో చర్చించారు. పార్టీ ఓటమిపై త్వరలో కేసీఆర్​ పూర్తిస్థాయిలో సమీక్షించనున్నారు. గతంలో దుబ్బాక ఉపఎన్నికల్లోనూ ఓడిపోయినప్పటికీ.. కొంత ఏమరుపాటు, అతివిశ్వాసమే ప్రధానంగా కొంప ముంచిందన్న అంచనాకు వచ్చారు. కానీ హుజూరాబాద్‌లో ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రతీ విషయాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని ఎత్తులు, పైఎత్తులు వేసినప్పటికీ... ఎందుకు విజయం సాధించలేకపోయామన్న అంతర్మథనం మొదలైంది.

'తెరాసకు ఓట్లు తగ్గలేదే'

ఈటల రాజేందర్‌పై నియోజకవర్గంలో ఏర్పడిన సానుభూతి ఓ కారణంగా తెరాస నేతలు భావిస్తున్నారు. ముందుగానే ఊహించి.. ఎన్నిక ఈటల రాజేందర్‌తో కాదు.. భాజపాతో అని ప్రచారం చేసినప్పటికీ.. ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేయలేకపోయినట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. భాజపా, కాంగ్రెస్ అంతర్గతంగా కలిసి పనిచేశాయని తెరాస ఆరోపిస్తోంది. పోలింగ్​కు కొన్ని రోజుల ముందు నుంచే తెరాస ఈ అంశాన్ని ప్రచారం చేసింది. ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి కలుసుకున్నారని.. భాజపా, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఫలితాల వెల్లడి తర్వాత హరీశ్‌రావు, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ధ్వజమెత్తారు. నైతిక విజయం తెరాసదేనని గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెరాసకు ఓట్లు మాత్రం తగ్గలేదని.. రెండు జాతీయ పార్టీలు కుమ్మక్కయ్యాయని హరీష్ రావు పేర్కొన్నారు.

తెరాస అప్రమత్తం..

హుజూరాబాద్​లో ఓటమి ప్రభావం పార్టీ శ్రేణులను నిరుత్సాహపరచకుండా తెరాస వెంటనే అప్రమత్తమైంది. హుజూరాబాద్ ఫలితం అంతగా ప్రాధాన్య అంశం కాదని... ఇరవై ఏళ్లలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొందని.. కేటీఆర్ ట్వీట్ చేశారు. భవిష్యత్ పోరాటాలకు కార్యకర్తలు మరింత ఉత్సాహంగా సన్నద్ధం కావాలన్నారు. ఈ ఒక్క ఓటమితో తెరాస కుంగిపోదని.. గెలిస్తే పొంగిపోయి.. ఓడితే కుంగిపోయే పార్టీ కాదని హరీశ్‌రావు ప్రకటన జారీ చేశారు. కేటీఆర్ ఫ్రాన్స్ నుంచి రాగానే పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచేలా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక చేస్తున్నారు.

విజయ గర్జన్​ సభపై పోకస్​..

ఈనెల 29న దీక్షా దివస్ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించనున్న విజయ గర్జన సభకు భారీగా జనసమీకరణ చేసి.. గులాబీ దళం సత్తాను మరోసారి చాటాలని తెరాస నాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీలు వెంటనే ఏర్పాటు చేసి... పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం, శిక్షణ కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం నింపేందుకు సిద్ధమవుతోంది.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.