తెరాస వచ్చాకే.. సిరిసిల్ల సెంటిమెంట్​ బ్రేక్​: కేటీఆర్‌

author img

By

Published : Sep 27, 2022, 4:24 PM IST

KTR

KTR Sircilla Tour: సిరిసిల్లలో గెలిచిన పార్టీ అధికారంలో ఉండదని సెంటిమెంట్‌ ఉండేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ట్రెండ్‌ మారిందని తెలిపారు. గెలుపు కంటే గెలిచాక పనిచేశామా లేదా అనేదే ముఖ్యమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. నిధులన్నీ సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేటకేనా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

KTR Sircilla Tour: సిరిసిల్ల చాలా అభివృద్ధి చెందింది... ఇంకా చేయాల్సింది ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడ గెలిచిన పార్టీ అధికారంలో ఉండదని సెంటిమెంట్ ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ట్రెండ్ మారిందన్నారు. నేడు సిరిసిల్లలో పర్యటనకు వెళ్లిన కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెంకంపేట రోడ్డు, జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

సిరిసిల్లలోనూ వీవర్స్ పార్కు.. 'సిరిసిల్లలో చాలా మంది మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి. పోరాటాలు చేసిన ఉద్యమనేతల విగ్రహాలు ఏర్పాటు చేద్దాం. విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్‌ నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ కూడా వీవర్స్‌ పార్కు నిర్మిస్తున్నాం. 2004లో కేసీఆర్‌ ఇక్కడ నుంచి పార్లమెంట్‌ సభ్యులుగా ఉన్నారు. రైతన్న చావకు అనే మాటలు గోడల మీద కలెక్టర్‌ రాయించారు. మీరు చావకండీ తెలంగాణ వస్తుంది అని ఆరోజు కేసీఆర్‌ అన్నారు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ప్రారిశ్రామికులుగా తిరిగి వచ్చారు... గెలుపు మఖ్యం కాదు గెలిచాక తృప్తిగా పనిచేశామా లేదా అనేదే ముఖ్యమని కేటీఆర్‌ పేర్కొన్నారు. తాను ఇక్కడే గెలిచి మంత్రినయ్యానన్నారు. శ్రామికులుగా వలస వెళ్లారు.. పారిశ్రామికులుగా తిరిగి వచ్చారని కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. నిధులన్నీ సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటకు ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని తెలిపారు. సిరిసిల్లలో 3వేల మంది ఇళ్లు లేని వాళ్లు ఉంటే సుమారు 2వేల మందికి కట్టించామని వెల్లడించారు. మిగతావారికి రెండో విడతలో ఇస్తామని చెప్పినా వినట్లేదని పేర్కొన్నారు.

ఆ తప్పుడు నిర్ణయం.. చేనేతకు మరణశాసనం.. 'అభివృద్ధిలో పోటీ పడదాం.. నాకు ఎలాంటి రాజకీయ వైరుధ్యాలు లేవు. ఇంకా 14 నెలల సమయం ఉంది. అప్పుడు ఎవరికీ అదృష్టం ఉంటే వాళ్లు గెలుస్తారు. రాజకీయాలు, మతాలకు అతీతంగా అభివృద్ధి చేద్దాం. కొన్ని రోజుల క్రితం మోదీ ప్రభుత్వం చేనేత మీద 5 శాతం పన్ను విధించింది. ఈ తప్పుడు నిర్ణయం చేనేతకు మరణశాసనం అవుతుందని మొత్తుకుంటున్నాం' అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.