నీవు లేని ఈ బతుకేల.. భార్య మరణాన్ని తట్టుకోలేక..!

author img

By

Published : Sep 11, 2022, 10:47 AM IST

wife and husband died

WIFE AND HUSBAND DIED: ఆ దంపతులిద్దరూ వివాహం అయినప్పటి నుంచి అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఒక పాప జన్మించింది. కానీ, ఇంతలో వారి దాంపత్య జీవితాన్ని విధి వెక్కిరించింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన భార్య.. చికిత్స పొందుతూ మృతి చెందింది. బ్రహ్మ వేసిన ముడి తెగిందని కలత చెందిన భర్త.. భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తుది శ్వాస వరకూ వెన్నంటి ఉంటానని ప్రమాణం చేసిన భర్త.. అర్ధాంగి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

WIFE AND HUSBAND DIED: జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలని ఒక్కటైన ఆ దంపతులను విధి చిన్నచూపు చూసింది. భార్య అనారోగ్యంతో మరణించడాన్ని తట్టుకోలేని భర్త.. రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకున్నాడు. ఇద్దరి మృతితో 9 నెలల చిన్నారి అనాథగా మారింది. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుఫ్రాఖుర్దు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..

గ్రామానికి చెందిన కసబ్‌ మమత(25) బాలకృష్ణ(27)దంపతులు. వీరికి 9 నెలల పాప ఉంది. ఇటీవల మమత అనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. మృతదేహాన్ని బంధువులు కారులో తీసుకొస్తుండగా ముందుగా ఇంటికి వెళ్లి అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేయిస్తానని బాలకృష్ణ బైక్‌పై గ్రామానికి బయల్దేరాడు. కానీ ఇంటికి వెళ్లకుండానే శంషాబాద్‌ మండలం తొండుపల్లి వద్ద రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.