ఉక్రెయిన్‌ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇండియాకు వచ్చిన వారికి..

author img

By

Published : Jul 30, 2022, 9:52 AM IST

ukraine medical students

ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల భారత్‌కు తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఈ ఏడాది జూన్​ 30లోపు ఆయా సంస్థల నుంచి డిగ్రీ పట్టా పొందిన విద్యార్థులకు.. ఎఫ్ఎంజీఈ రాసేందుకు అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు.. రెండేళ్లపాటు కంపల్సరీ రొటేటింగ్‌ మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఉక్రెయిన్‌లో ఈ ఏడాది జూన్‌ 30 లోపు వైద్య విద్య(ఎంబీబీఎస్‌)ను పూర్తి చేసుకున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ధ్రువపత్రాలను జారీ చేసింది. వీరందరూ ‘ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ పరీక్ష’(ఎఫ్‌ఎంజీఈ) రాయడానికి అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ విద్యార్థులు ఉక్రెయిన్‌లో వ్యక్తిగతంగా తరగతులకు హాజరు కాలేకపోయినందున.. ఎఫ్‌ఎంజీఈలో అర్హత సాధించిన తర్వాత రెండేళ్లపాటు ‘కంపల్సరీ రొటేటింగ్‌ మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌(సీఆర్‌ఎంఐ)’ చేయాల్సి ఉంటుందనే షరతు విధించింది.

యుద్ధం కారణంగా చివరి సంవత్సరంలో విద్యాభ్యాసం ఆగిపోయిన విద్యార్థులకు కేంద్రం తాజా నిర్ణయంతో మేలు జరుగుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. ఇక్కడ రెండేళ్ల ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన అనంతరం రాష్ట్ర వైద్య మండలిలో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ప్రాక్టీసు కూడా చేయవచ్చు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా దాదాపు 20 వేల మందికిపైగా వైద్య విద్యార్థులు భారత్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సుమారు 4 వేల మంది ఉంటారని అంచనా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.