తెరాస (TRS) సంస్థాగత కమిటీల్లో చురుకైన క్రియాశీలక కార్యకర్తలకు చోటు కల్పించాలని పార్టీ ప్రధాన కార్యదర్శులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) దిశా నిర్దేశం చేశారు. మహిళ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సంస్థాగత కమిటీల నిర్మాణంపై పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. గ్రామ కమిటీల నిర్మాణం సుమారు 80 శాతం పూర్తయిందని.. ఒకట్రెండు రోజల్లో మిగతావి పూర్తవుతాయని ప్రధాన కార్యదర్శులు వివరించారు.
ఈనెల 15 నాటికి గ్రామ, వార్డు స్థాయి కమిటీల నిర్మాణం పూర్తి కావాలని కేటీఆర్ (KTR) తెలిపారు. ఈనెల 20 నాటికి మండల కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. మండల కమిటీలు పూర్తయిన తర్వాత జిల్లా అధ్యక్షులను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటిస్తారన్నారు. జిల్లా అధ్యక్షుడు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులతో చర్చించి జిల్లా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ వివరించారు. సంస్థాగత కార్యక్రమాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని.. ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు కూడా క్రియాశీలకంగా పాల్గొంటున్నారని ప్రధాన కార్యదర్శులు కేటీఆర్కు వివరించారు. కమిటీల వివరాలన్నీ రాష్ట్ర కార్యాలయానికి పంపించాలన్నారు. వారం రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి : GHMC: హైదరాబాద్ రోడ్లపై భవన వ్యర్థాలు వేస్తున్నారా.. అయితే జాగ్రత్త!