కంప్యూటర్ ముందు కూర్చోండి లేదా మొబైల్ తీసుకోండి... ఈ యాప్లో పేరు నమోదు చేసుకోండి. రాష్ట్రవ్యాప్తంగా 350కి పైగా ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగఖాళీలు మీ కళ్లముందుంటాయి. నచ్చిన పోస్టుకు దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ పద్ధతిలోనే ఇంటర్వ్యూల షెడ్యూలు వస్తుంది. కొన్ని ఇంటర్వ్యూలకు ఆయా కార్యాలయాలకు వెళ్లాలి. ఎంపికైతే వెంటనే నియామకపు ఉత్తర్వులు అందుతాయి. తెలంగాణ ప్రభుత్వ మొబైల్ యాప్... (డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజి ఆఫ్ తెలంగాణ- టీఎస్డీఈఈటీ) కల్పించిన సౌకర్యమిది. తెలంగాణ పరిశ్రమలు, కార్మికశాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న డీఈఈటీకి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగాలు పొందారు.
నవీన సాంకేతికతతో..
రాష్ట్ర ప్రభుత్వం నవీన సాంకేతికతను పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. కరోనా సమయంలో లాక్డౌన్ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగార్థుల కోసం డిజిటల్ ఉపాధి కార్యాలయాన్ని రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్)తో పనిచేసే డీఈఈటీ మొబైల్యాప్ను ప్రారంభించింది. ఇందులో రాష్ట్రంలోని ఐటీ, ఔషధ, పారిశ్రామిక, వాణిజ్య, టెలికాం, బీమా, బ్యాంకింగ్, స్థిరాస్తి, రిటైల్ కంపెనీలను నమోదు చేయించింది. జీఎంఆర్, అపోలో, ఏసియన్ పెయింట్స్, స్టోరిటెక్, ఏజీసీ, జెనెసిస్ వంటి ప్రముఖ సంస్థలు ఇందులో ఉన్నాయి. నిరుద్యోగులు తమ వివరాలను ఇందులో నమోదు చేసుకోమని ఆహ్వానించింది. యాప్ ద్వారా అటు సంస్థలకు, ఇటు ఉద్యోగార్థులకు సమన్వయం కుదురుతోంది. ఉద్యోగాలకు అవసరమైన సాంకేతిక, నైపుణ్యశిక్షణను కూడా ప్రభుత్వం అందిస్తోంది. https://www.tsdeet.com పోర్టల్ ద్వారా గానీ, గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని గానీ నిరుద్యోగులు ఉపయోగించుకోవచ్చు.
వేగంగా సమాచారం...
ఆరోగ్య సంరక్షణ, ఇ-కామర్స్, సేవ, మానవ వనరుల విభాగం, పంపిణీ ఎగ్జిక్యూటివ్లు, అసోసియేట్లు, టెలికాలర్లు... తదితర ఉద్యోగ ఖాళీల సమాచారం టీఎస్డీఈఈటీ యాప్లో ఉంటుంది. నమోదైన వెంటనే అభ్యర్థికి ఆయా ఖాళీల సమాచారం అందుతుంది. ఇలా యాప్ ద్వారా ప్రతి రోజు పది లక్షలకు పైగా సందేశాలు పంపిణీ అవుతున్నాయి. ప్రతి ఉద్యోగానికి పని వాతావరణం, కంపెనీ చరిత్ర ఇతర వివరాలుంటాయి. ఉద్యోగార్థుల కోసం వెబినార్లు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగానికి అర్హత, అనుభవం, ఎంపికకు కావాల్సిన సమాచారం కూడా అందిస్తారు. 2020-21లో 2.67 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు.. 2021-22లో 2.73 లక్షల ఉద్యోగాలు ఈ యాప్ ద్వారా భర్తీ అయ్యాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కాగా, ఇప్పటికే 62,203 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ ఏడాది డీఈఈటీపై ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పించింది. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు యాప్కి సంబంధించిన అవగాహన కల్పించింది. 60కి పైగా విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించింది. ప్రస్తుతం ఆంగ్లం, తెలుగు, హిందీ భాషల్లో ఈ యాప్ నడుస్తుండగా త్వరలోనే ఉర్దూ యాప్ కూడా అందుబాటులోకి రానుంది.
ఇదీ చదవండి: Jubilee hills case: తీవ్రమైన నేరాల్లో మేజర్లుగా పరిగణించాలంటున్న పోలీసులు.. కేటీఆర్ మద్దతు