ETV Bharat / city

Tamilisai Meets Modi : 'నేను పర్యటనలకు వెళ్తే.. ఎస్పీ, కలెక్టర్ రావడం లేదు'

author img

By

Published : Apr 6, 2022, 2:04 PM IST

Updated : Apr 6, 2022, 2:56 PM IST

Tamilisai Meets Modi : రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ప్రొటోకాల్ పాటించాల్సిన బాధ్యత సీఎస్‌కు ఉందన్న గవర్నర్‌.. వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు తాను ప్రధానిని కలవలేదని గవర్నర్‌ స్పష్టం చేశారు.

Tamilisai Meets Modi
Tamilisai Meets Modi

నేను పర్యటనలకు వెళ్తే.. ఎస్పీ, కలెక్టర్ రావడం లేదు

Tamilisai Meets Modi : గత కొంత కాలంగా రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య అంతరం పెరిగిందన్న వార్తలతో గవర్నర్‌ దిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాల విషయంలో చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని ప్రధానిని కోరినట్లు తమిళిసై వివరించారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ నియామకంలో వివాదమేమీ లేదన్న ఆమె సేవారంగంలో ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తి సేవ చేయలేదని తాను భావించానని వెల్లడించారు. తన అభిప్రాయాన్ని మాత్రమే ప్రభుత్వానికి చెప్పానని అన్నారు.

అది నా పని కాదు : 'తమిళిసైకి గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ రాజ్‌భవన్‌కు గౌరవమివ్వాలి. గవర్నర్ పర్యటనలకు వెళ్తే వెంట ఎస్పీ, కలెక్టర్ రాకపోవడం అవమానించినట్టు కాదా? అధికారుల వైఖరిపై నేను ఏ సమస్యను సృష్టించాలనుకోవడం లేదు. నేనేం వివాదాస్పదం చేయలేదు. చర్చకు సిద్ధంగా ఉన్నాను. అధికారులను హాజరు కాకుండా ఆదేశాలు జారీ చేయడం, ప్రొటోకాల్ అమలు చేయకపోవడం సరైన చర్యేనా? ఈ తరహా ఉల్లంఘనలు సరైనవో కావో అన్నది తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధానికి రిపోర్ట్ కార్డు ఇవ్వడం నా పని కాదు. రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ విషయాలు ఎవరితో చర్చించాల్సిన పనిలేదు.' - తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్

అందుకే మోదీని కలిశా : ఒక డాక్టర్‌గా దేశంలో భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై మోదీకి ధన్యవాదాలు చెప్పినట్లు గవర్నర్ తెలిపారు. పుదుచ్చేరి తెలంగాణ మధ్య అన్ని రకాల పర్యాటక అవకాశాలను పరిశీలించామని చెప్పారు. వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నానని వెల్లడించారు. అందుకోసం రెండు ప్రాంతాల మధ్య విమాన సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణలో ట్రైబల్ టూర్‌పై చర్చించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 శాతం గిరిజనలు ఉన్నారని... వారి ప్రగతికి కూడా చర్యలు తీసుకుంటామని గవర్నర్​ తెలిపారు.

రాజ్‌భవన్‌కు ఎవరైనా రావొచ్చు, సమస్యలు తన దృష్టికి తీసుకురావొచ్చని గవర్నర్‌ చెప్పారు. ప్రొటోకాల్ పాటించాల్సిన బాధ్యత సీఎస్‌కు ఉందన్న గవర్నర్.. వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. తనను ఎవరూ అవమానించలేదని...తనకు ఎలాంటి ఈగోలు లేవని వెల్లడించారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదని.. వివాదాలు కోరుకోవట్లేదని తెలిపారు. తాను ఫ్రెండ్లీ గవర్నర్‌ను అని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు తాను ప్రధానిని కలవలేదని తమిళిసై సౌందరరాజన్‌ క్లారిటీ ఇచ్చారు.

Last Updated :Apr 6, 2022, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.