ETV Bharat / city

పన్ను ఆదాయంలో అంచనాలకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం

author img

By

Published : Mar 30, 2022, 5:54 AM IST

telangana budget expectations
telangana budget expectations

పన్ను ఆదాయంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు.. రాష్ట్ర ప్రభుత్వం 92 శాతం అంచనాలకు చేరుకొంది. ఇప్పటికే నిరుడు కంటే 30 వేల కోట్లు అదనంగా సమకూరగా.. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బడ్జెట్ అంచనాలు అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు. గత నెల వరకు లక్షా 48 వేల కోట్ల వ్యయం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకు ఆదాయ, వ్యయ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్​కు నివేదించింది. ఆదాయానికి సంబంధించి బడ్జెట్ అంచనా అయిన లక్షా 76 వేల కోట్లకు గాను 64 శాతం మేర అంటే లక్షా 11వేల కోట్లు సాధించింది. పన్ను ఆదాయం అంచనాలను మాత్రం 92 శాతం వరకు అందుకొంది. పన్నుల ద్వారా లక్షా ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని అంచనా వేయగా.. ఫిబ్రవరి నెలాఖరు వరకు 98వేల కోట్లు సమకూరాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 30 వేల కోట్ల రూపాయల అదనపు పన్నురాబడి వచ్చింది. ఫిబ్రవరి నెలలో ఖజానాకు గరిష్టంగా 12,820 కోట్ల రూపాయల పన్ను ఆదాయం సమకూరింది. నిరుడు ఫిబ్రవరిలో వచ్చిన ఆదాయం కేవలం 7,538 కోట్లు మాత్రమే. పన్ను ఆదాయం ఇప్పటికే 92 శాతం వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బడ్జెట్ అంచనాలను అధిగమించే అవకాశం ఉందని అంటున్నారు.

అమ్మకం పన్ను, ఎక్సైజ్ పన్ను ఆదాయం అంచనాలను 92 శాతం చేరుకోగా.. స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ద్వారా అంచనాల్లో 87 శాతం, జీఎస్టీ ద్వారా అంచనాల్లో 86 శాతం వచ్చింది. జీఎస్టీ ద్వారా 30 వేల కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 26 వేల కోట్లు.. ఎక్సైజ్ ద్వారా 15 వేల కోట్లు, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ద్వారా 10 వేల కోట్ల ఆదాయం సమకూరింది. పన్నేతర ఆదాయం మాత్రం 30 వేల కోట్ల అంచనాకు గాను... 6 వేల కోట్లు మాత్రమే వచ్చింది. 38 వేల కోట్ల గ్రాంట్ల అంచనాలో కేవలం 7,700 కోట్లు వచ్చాయి. అప్పులు అంచనాల్లో 95 శాతం చేరుకున్నాయి.

3,186 కోట్ల రుణం: బడ్జెట్​లో 45,509 కోట్ల అప్పులు ప్రతిపాదించగా.. ఫిబ్రవరి నెలాఖరు వరకు 43,186 కోట్లు రుణంగా తీసుకున్నారు. అన్ని రకాలుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు వరకు ఖజానాకు లక్షా 55 వేల కోట్లు జమ కాగా.. లక్షా 48 వేల కోట్ల రూపాయలు వ్యయం చేసింది. బడ్జెట్‌లో పేర్కొన్న వ్యయం మొత్తమైన లక్షా 98 వేల కోట్లలో ఇది 75శాతం. రెవెన్యూ వ్యయం లక్షా 22 వేల కోట్లు కాగా... మూలధన వ్యయం 25 వేల కోట్ల రూపాయలు. ఫిబ్రవరి నెలాఖరు వరకు జీతాల చెల్లింపులకు 27,483 వేల కోట్లు, పెన్షన్లకు రూ.12,390 వేల కోట్లు, రాయితీలకు రూ.9,435 కోట్లు ఖర్చు చేసింది. వడ్డీ చెల్లింపులకు రూ.16,581 కోట్ల వ్యయం చేశారు. సర్కారు చేసిన వ్యయంలో సామాజిక రంగంపై చేసిన ఖర్చు 52,769 కోట్లు కాగా.. ఆర్థిక రంగంపై 55,819 కోట్లు ఖర్చు చేసింది. రూ.39,615 కోట్లను సాధారణ రంగంపై వ్యయం చేసింది.

ఇదీచూడండి: 'కేసీఆర్ నిర్లక్ష్య పాలన వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.