కృష్ణా, గోదావరి బోర్డుల భేటీకి హాజరుకాలేం.. ప్రభుత్వం మరో లేఖ

author img

By

Published : Aug 8, 2021, 3:14 PM IST

Updated : Aug 8, 2021, 5:09 PM IST

krishna-and-godavari-

15:11 August 08

కృష్ణా, గోదావరి బోర్డుల భేటీకి హాజరుకాలేం.. ప్రభుత్వం మరో లేఖ

 బోర్డు సమావేశానికి రాష్ట్ర సభ్యులు హాజరై అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా మరో తేదీని ఖరారు చేయాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రెండు బోర్డులకు మరోసారి విడివిడిగా లేఖలు రాసింది. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్​లో కేసుల విచారణ ఉన్నందున సోమవారం నాడు తలపెట్టిన బోర్డు భేటీకి హాజరు కాలేమని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ గతంలోనే లేఖలు రాశారు. అయితే కార్యాచరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల నేపథ్యంలో సమయాభావం వల్ల సమావేశాన్ని నిర్వహిస్తామని, హాజరుకావాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ లేఖ రాశాయి. 

సంబంధిత వార్తలు: 'కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరుకావడం కుదరదు'

మరో తేదీని సూచించాలి

నిన్న అర్ధరాత్రి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా, గోదావరి బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు లేఖలు రాసింది. రెండు బోర్డుల ఛైర్మన్లకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ విడివిడిగా లేఖలు రాశారు. కేసుల విచారణ కారణంగా సోమవారం నిర్వహించే సమావేశానికి హాజరుకాలేమని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సభ్యులు బోర్డు భేటీకి హాజరై అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా మరో తేదీని సూచించాలని రెండు బోర్డులను కోరారు. లేఖ ప్రతులను కేంద్ర జలశక్తి శాఖా మంత్రి కార్యాలయం, జలవనరుల విభాగం సంచాలకులకు కూడా పంపారు.

రాష్ట్ర వైఖరిని గట్టిగా వినిపించాలి

గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై కృష్ణా, గోదావరి బోర్డులు కసరత్తు చేస్తున్న వేళ నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండు రోజులు సమీక్షించారు. అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం... రాష్ట్ర వైఖరిని గట్టిగా వెల్లడించాలని సూచించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును నిలువరించాలని కోరుతూ సమీక్ష కొనసాగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్​కు లేఖ పంపారు. రేపు జరగనున్న బోర్డుల ఉమ్మడి సమావేశానికి హాజరు కావాల్సిందేనని రెండు బోర్డులు స్పష్టం చేసిన నేపథ్యంలో సంబంధిత అంశాలపై చర్చించారు.  

సంబంధిత వార్తలు: రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని అంశాలపై బలమైన వాణి వినిపించాలి: కేసీఆర్

అందుకే హాజరుకాలేం

ఒకవేళ బోర్డు సమావేశాలకు విధిగా హాజరు కావాల్సి వస్తే అక్కడ రాష్ట్రం తరపున ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని అంశాలపై బలమైన వాణి వినిపించాలని అధికారులు, ఇంజినీర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందనేది భావించారు. సుప్రీంకోర్టులో, జాతీయ హరిత ట్రైబ్యునల్​లో ముఖ్యమైన కేసుల విచారణ ఉన్నందున భేటీకి హాజరు కాలేమని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. సమావేశాలకు మరో తేదీ ఖరారు చేయాలని కోరుతూ బోర్డు ఛైర్మన్లకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు.  

సంబంధిత వార్తలు: ఈనెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం

అప్పుడు గైర్హజరు

బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కృష్ణా, గోదావరి బోర్డులు సమన్వయ కమిటీల సమావేశాన్ని ఈ నెల 3న నిర్వహించాయి. ఈ భేటీకి తెలంగాణ హాజరుకాలేదు. సమన్వయ కమిటీ సమావేశం కంటే ముందు పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరగా, సమన్వయ కమిటీ సమావేశం తర్వాత నిర్వహిస్తామని బోర్డు సమాధానం ఇచ్చింది. అయినప్పటికీ తెలంగాణ నుంచి ఎవరూ హాజరుకాలేదు. చివరికి రెండు బోర్డులు ఆంధ్రప్రదేశ్‌ అధికారులతోనే చర్చించాయి. 

సంబంధిత వార్తలు: గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై కృష్ణా, గోదావరి బోర్డుల కీలక నిర్ణయం

Last Updated :Aug 8, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.