ETV Bharat / city

Chandrababu on PRC : 'పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం మోసం చేసింది'

author img

By

Published : Jan 22, 2022, 10:03 AM IST

Chandrababu on PRC : పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం చేతిలో మోసపోయి పోరాటాలు చేస్తున్న ఉద్యోగులకు మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. 'మనకు ఓటు వేశారా లేదా అనేది చర్చ కాదని.. బాధిత వర్గం ఎక్కడ ఉన్నా తెదేపా వారికి అండగా ఉంటుందని' అన్నారు. పార్టీ సంస్థాగత అంశాలపై మండల, నియోజకవర్గ నేతలతో శుక్రవారం నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జీతాలు పెంచమంటే.. తగ్గించిన ప్రభుత్వం వైకాపా మాత్రమే. ఉద్యోగులను ప్రభుత్వం తీవ్రంగా మోసగించింది..’ అని చంద్రబాబు మండిపడ్డారు.

Chandrababu on PRC
Chandrababu on PRC

Chandrababu on PRC : ‘రహదారులపై గుంతలు పూడ్చలేని జగన్‌... జిల్లాకో విమానాశ్రయం కడతానని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వ విధానాలు, పన్నులు, అధికారిక దోపిడీలతో ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభుత్వం దారుణంగా ప్రభావితం చేసింది. ఇప్పటికే కొన్ని వర్గాలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నాయి. రానున్న రోజుల్లో ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడే పరిస్థితి వస్తుంది. వైకాపా నేతలు, ఎమ్మెల్యేల దోపిడీ తీవ్రంగా ఉంది. వాటిపై మండల, నియోజకవర్గ స్థాయి తెదేపా నేతలు పోరాటాలు చేయాలి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కొన్ని చోట్ల అనుకున్నంత ధాటిగా పోరాటాలు జరగడం లేదు. అలాంటి చోట్ల నేతలు తమ పని తీరు మార్చుకోవాలి. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై పూర్తి సమాచారం ఉంది. తెదేపా మరింత దూకుడుగా వెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారు..’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

తెదేపా ప్రభుత్వం రావాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు

‘ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైకాపాకు దారుణ ఓటమి తప్పదు. ఈ విషయంలో ఆ పార్టీ వర్గాల్లోనే క్లారిటీ వచ్చింది. తమ కష్టాలు పోవాలంటే తెదేపా ప్రభుత్వం రావాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు.’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘వాలంటీర్ల వ్యవస్థ ద్వారా దొంగ ఓట్లు చేర్పించడం, ఒకే కుటుంబం ఓట్లను వేర్వేరు డివిజన్లకు మార్చడం వంటి చర్యలపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. ఒక రాజకీయపార్టీగా నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉండాలి. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి కొవిడ్‌ రోగులకు మళ్లీ ఉచితంగా సేవలు ప్రారంభించాం. రోజూ అందిస్తున్న టెలి మెడిసిన్‌ సేవలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలి. ప్రభుత్వం సాయం చేయకున్నా.. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి ఉచిత వైద్య సాయంతో పాటు మందులు పంపిణీ చేస్తున్నాం.’ అని వివరించారు. గతంలో ట్రస్ట్‌ నుంచి కొవిడ్‌ రోగులకు అందిన సేవలను ఈ సందర్భంగా పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మేనేజింగ్‌ ట్రస్టీ భువనేశ్వరికి ధన్యవాదాలు తెలిపారు.

కొవిడ్‌ నుంచి కోలుకున్నా..

కొవిడ్‌ నుంచి కోలుకొని ప్రస్తుతం బాగా ఉన్నానని చంద్రబాబు వెల్లడించారు. ఇటీవల ఆయన కొవిడ్‌ బారిన పడిన విషయం విదితమే. సమావేశంలో ఆయన ఆరోగ్యంపై పలువురు నేతలు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. రెండో రోజు నుంచే యథావిధిగా ఆన్‌లైన్‌లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.