Tagore Scene repeats in Hyderabad Hospital : ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు చేసిన శస్త్రచికిత్స వికటించి గర్భిణి మృతిచెందగా.. ఆమె పరిస్థితి విషమించిందంటూ మెరుగైన వైద్యం అందించాలని మృతదేహాన్ని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని కుటుంబ సభ్యుల్ని నమ్మించారు. ఈ ఘటన ఆమనగల్లు పట్టణంలో ఆదివారం రాత్రి చోటుచేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ ప్రసవం కోసం ఆమనగల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
ఆదివారం సాయంత్రం వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. ఈ విషయం చెప్పకుండా మెరుగైన చికిత్స అందించాలని అదే రోజు రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యం అందుతోందని.. కోలుకుంటోందని చెప్పారు. కొద్దిసేపటి తరువాత తమ ప్రయత్నం ఫలించలేదని మృతి చెందిందని తెలిపారు. అనుమానం వచ్చి మృతురాలి కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఆమనగల్లు ఆసుపత్రి వైద్యులు ఆమె కుటుంబానికి రూ.8 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందపత్రం కూడా రాసిచ్చారు.