ETV Bharat / city

BSP RSP: 'రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే బీఎస్పీ పోటీ'

author img

By

Published : Jun 11, 2022, 5:45 AM IST

Updated : Jun 11, 2022, 6:32 AM IST

BSP RSP
BSP RSP

BSP State Chief RSP: రానున్న ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమన్నారు. పార్టీలోకి త్వరలో భారీ చేరికలు ఉంటాయన్నారు. రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షునిగా భాధ్యతలు చేపట్టిన సందర్భంగా హైదరాబాద్​లోని నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్​లో ఆర్​ఎస్​పీ అభినందన సభను ఏర్పాటు చేశారు. సభకు పలు జిల్లాల నుంచి బీఎస్పీ నాయకులు భారీగా తరలివచ్చారు.

RSP: ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. పీకేలాంటి మాంత్రికుల్ని తీసుకొచ్చినా.. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపించి ప్రగతి భవన్‌పై నీలి జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. తమ పార్టీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తుందని, ఎవరితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రకటించారు. ‘సొంత బలంపై ఏనుగు ప్రగతి భవన్‌కు వెళ్తుంది. అప్పుడే బహుజనుల బతుకులు మారతాయి’ అని అన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా శుక్రవారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అభినందన సభను నిర్వహించారు. ఈ సభలోను, విలేకరుల సమావేశంలోను ఆయన మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో భాజపా, తెరాస ప్రభుత్వాల్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

బీఎస్పీని చూసి భయపడుతున్న తెరాస, భాజపా, కాంగ్రెస్‌: రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ప్రజల ఆస్తుల్ని, కష్టార్జితాన్ని దోచుకుని ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా విందులు, విలాసాలకు ఖర్చు పెడుతున్నారని ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ప్రజలు, ఉద్యోగస్తులు, పేదలందరి జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సిన దుస్థితిని తెరాస ప్రభుత్వం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ‘‘బీఎస్పీని చూసి తెరాస, కాంగ్రెస్‌, భాజపాలు భయపడుతున్నాయి. అందుకే సమాజంలో చీలికలు తీసుకొచ్చేందుకు అనేక రకాలుగా కుట్రలు పన్నుతున్నాయి. అలాగే తెలంగాణలో ప్రజలపై డబ్బులు వెదజల్లి.. మత్తులో ముంచి ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేసీఆర్‌ పన్నాగం పన్నారు. వాటిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బీఎస్పీ కార్యకర్తలు కూడా గుర్తుంచుకోవాలి. కేంద్రంలోని భాజపా.. రాజ్యాంగాన్ని ప్రణాళికబద్ధంగా నిర్మూలించే కుట్ర చేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోంది.

సినిమా ప్రమోషన్ల పేరిట కేటీఆర్‌, పవన్‌ల రాజకీయం : సంపద అంతా రెండు, మూడు కులాల చేతుల్లోనే ఉండాలా? బీఎస్పీలో అన్ని కులాల వారున్నారు. ఇది అందరి పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలు కలిసి నిర్మించారు. భాజపా నాయకులు ప్రతిరోజూ మతకల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మసీదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం రాజ్యాంగాన్ని మారుస్తామంటారు. తెలంగాణలో ఓట్లు చీల్చేందుకు సినిమా ప్రమోషన్ల పేరిట కేటీఆర్‌, పవన్‌ చేస్తున్న రాజకీయాల్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరికి.. ఎక్కడ కర్రుకాల్చి వాతపెట్టాలో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. షర్మిల తెలంగాణకు ఎందుకు వచ్చారో ఎవరు వదిలిన బాణమో ఆమెనే అడగాలి.

జెండాలు మోసి, మోసపోయిన వారు రండి: 'మాతో చాలా మంది టచ్‌లో ఉన్నారు. ఎవర్నైతే ప్రజలు ప్రేమిస్తారో వారిని ఆహ్వానిస్తాం. తెరాస, కాంగ్రెస్‌, భాజపాల్లో పార్టీ జెండాలు మోసి, మోసపోయిన వారంతా తిరిగి రావాలి'' అని ప్రవీణ్‌కుమార్‌ కోరారు. రాజ్యాంగంపై దాడి జరుగుతోందని.. సీఎం కేసీఆర్‌ రాజ్యాంగాన్ని మారుస్తానని చెబుతున్నారని బీఎస్పీ ముఖ్య సమన్వయకర్త, రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్‌ గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త మంద ప్రభాకర్‌, బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, చంద్రశేఖర్‌ ముదిరాజ్‌, దయానంద్‌రావు, మేడి ప్రియదర్శిని, గంగాధర్‌, నారాయణ, గుడ్ల శ్రీనివాస్‌ మహరాజ్‌ పాల్గొన్నారు. ప్రవీణ్‌కుమార్‌ అభినందన సభ అట్టహాసంగా జరిగింది.

ఇదీ చదవండి:

Last Updated :Jun 11, 2022, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.