ఉవ్వెత్తున వరద.. కడెం జలాశయం ఆనకట్ట పైనుంచి పొర్లుతున్న నీరు

author img

By

Published : Jul 14, 2022, 3:28 AM IST

కడెం జలాశయం ఆనకట్ట పైనుంచి పొర్లుతున్న నీరు
కడెం జలాశయం ఆనకట్ట పైనుంచి పొర్లుతున్న నీరు ()

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. భారీ వరదలతో ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. కడెం జలాశయం ఆనకట్ట పైనుంచి నీరు పొంగి పొర్లుతోంది. ప్రాజెక్టు దిగువన 12 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. కడెం పట్టణాన్ని వరద నీరు ముంచెత్తింది. అప్రమత్తమైన అధికారులు ప్రజలను ఖాళీ చేయించారు. దేవాదుల మూడో దశ పనుల్లోనూ వరద విలయం సృష్టిస్తోంది.

కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఆనకట్టపై నుంచి వరద నీరు పొంగిపొర్లింది. భారీ వరద వస్తుండటంతో 17 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తారు. దిగువన ఉన్న 12 లోతట్టు గ్రామాలకు వరద చేరింది. నిర్మల్‌ జిల్లాలో కడెం జలాశయం పరిస్థితి గంటగంటకూ ఉత్కంఠగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టుల ప్రాంతాల్లోనూ అలజడి నెలకొంది. పోచంపాడు, శ్రీపాద ఎల్లంపల్లి జలాశయాల కింద కూడా ముంపు ఏర్పడుతోంది. దేవాదుల ప్రాజెక్టు మూడోదశలోని సొరంగం, పంప్‌హౌస్‌, సర్జిపూల్‌ను కూడా వరద తాకింది. మరో రెండు రోజులు భారీ వర్షసూచన ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

కడెం వద్ద ఉత్కంఠ: కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. దీని నీటి మట్టం బుధవారం ఉదయం సమయానికి 699.70 అడుగులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 7.26 టీఎంసీలు కాగా వందశాతం నిండింది. ఎగువ నుంచి వరద పెరుగుతూనే ఉంది. ప్రాజెక్టుకున్న 18 గేట్ల నీటి విడుదల సామర్థ్యం మూడు లక్షల క్యూసెక్కులు. అయితే, ఒక గేటు పూర్తిగా తెరుచుకోలేదు. విడుదల సామర్థ్యం కన్నా వరద ఎక్కువగా ఉండటంతో డ్యాం కట్ట పైనుంచి నీరు పొర్లిపోతోంది. కాల్వలకు కూడా రెండు చోట్ల గండ్లు పడ్డాయి. ఆనకట్ట వద్ద ప్రవాహ గేజ్‌ను కొలిచే గది నుంచి ఇంజినీర్లు కూడా బయటికి వచ్చేశారు. డ్యాం ప్రాంతం వద్ద ఉన్న భారీ సైరన్‌ మోగించి దిగువ గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. సాయంత్రానికి వరద కొంత తగ్గుముఖం పట్టినా పొద్దుపోయే సమయం నుంచి మళ్లీ పెరిగింది. దిగువన మొత్తం 12 గ్రామాల్లో వరద నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సీఎం కేసీఆర్‌ కడెం ప్రాజెక్టు పరిస్థితులపై ఎప్పటికప్పుడు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్‌ చేసి సమీక్షించారు. మంత్రి ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మూడు రోజులుగా కడెం పరీవాహక ప్రాంతంలో కొన్ని చోట్ల దాదాపు యాభై సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది.

.
.

దేవాదుల పంపుహౌస్‌లోకి వరద: దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశలోని ప్యాకేజ్‌ -3లో పంపుహౌస్‌, సర్జిపూల్‌లోకి వరద నీరు చేరింది. ములుగు జిల్లా రామప్ప చెరువు నుంచి హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ వరకు ఈ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆసియాలోనే అతి పొడవైన సొరంగాన్ని జాకారం నుంచి దేవన్నపేట వరకు నిర్మించారు. దేవన్నపేట సమీపంలో నిర్మించిన పంపుహౌస్‌లో 31 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు మోటార్లు ఏర్పాటు చేశారు. మోటార్లకు ముప్పు తప్పినప్పటికీ 49 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగంలోకి వరద నీరు చొచ్చుకొచ్చి.. సర్జిపూల్‌, పంపుహౌస్‌లోకి ప్రవహించింది. యంత్రాలు, పరికరాలు నీట మునిగాయి.

.
.

మంచిర్యాలను ముంచెత్తిన రాళ్లవాగు: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తెరవడంతో ఆ నీటి ఉద్ధృతి అడ్డుపడి.. రాళ్లవాగు ప్రవాహం వెనక్కు పోటెత్తింది. దీంతో మంచిర్యాలలోని ఆరు కాలనీలు నీట మునిగాయి. దాదాపు మూడు వేల మంది నిరాశ్రయులయ్యారు. ఎన్టీఆర్‌ నగర్‌, ఎల్‌ఐసీ కాలనీల్లో ముంపు ఎక్కువగా ఉంది. భవనాల స్లాబ్‌ స్థాయి వరకు వరద ముంచెత్తింది. 1995-96, 2000, 2021లోనూ ముంపు ఏర్పడింది.

శ్రీరామసాగర్‌ దిగువన ముప్పు: శ్రీరామసాగర్‌ ఎగువన నిజామాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో నీటిమట్టం పెరుగుతోంది. భైంసా, బాల్కొండ, ఆర్మూరు, బాన్సువాడతోపాటు పరీవాహక ప్రాంతాల్లోని మండలాల్లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుద్దవాగు, స్వర్ణ గేట్లు ఇప్పటికే తెరుచుకున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో గుమ్మిరియాల, దోంచందా, తడపాకల్‌, సావెల్‌, కొడిచెర్ల, చాకిరియాల్‌, పోచంపాడు, నిర్మల్‌ జిల్లాలో చింతల్‌ చందా, మునిపల్లి, మాచాపూర్‌, పర్పల్లె, పుట్టపల్లి, ధర్మారం గ్రామాల ప్రజలు ముంపు విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

.
.

వృద్ధుడి మృతి... ఇద్దరి గల్లంతు

  • నిర్మల్‌ జిల్లా లక్ష్మణచంద మండలం వడ్యాల్‌ గ్రామంలో ఇల్లు కూలి ఏదుల చిన్నయ్య (65) అనే వృద్ధుడు మృతిచెందారు. ఆయన అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇల్లు కూలడంతో ప్రాణాలు కోల్పోయారు.
  • కుమురం భీం జిల్లా దహెగాం మండలంలో సహాయక చర్యల్లో పాల్గొన్న మంచిర్యాల జిల్లాకు చెందిన రెస్క్యూ టీం సభ్యులు తెలిక సతీష్‌, అంబాల రాములు ఓ గర్భిణిని కాపాడే క్రమంలో గల్లంతయ్యారు.

వాహనం చెట్టుకు ఢీకొని ముగ్గురి మృతి: ఆసిఫాబాద్‌లోని కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్న తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్దామని టాటా మ్యాజిక్‌ వాహనంలో ఎనిమిది మంది నిర్మల్‌ జిల్లావాసులు బయలుదేరారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం గోదరిగూడ వద్ద వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో సవిత (31), నాగమణి (45), అమృత్‌రావు (55) ప్రాణాలొదిలారు.

యాదాద్రి మాడ వీధుల్లో కుంగిన ఫ్లోరింగ్‌: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు యాదాద్రి ప్రధానాలయం దక్షిణ మాడవీధిలో ఫ్లోరింగ్‌ బండలు కుంగాయి. కృష్ణశిలతో నిర్మించిన ఫ్లోరింగ్‌ వర్షం కురిసిన ప్రతిసారీ కుంగిపోతోందనే ఆరోపణలున్నాయి. హడావుడిగా పనులు చేయడం వల్లే లోపాలు వెలుగుచూస్తున్నాయని స్థానికులు, భక్తులు విమర్శిస్తున్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.