ప్రతిపక్షాల వినూత్న నిరసన.. భోగి మంటల్లో ఆస్తి పన్ను జీవో ప్రతులు

author img

By

Published : Jan 14, 2022, 11:31 AM IST

POLITICAL BHOGI CELEBRATIONS

భోగి పండుగను ఏపీ విపక్షాలు వినూత్నంగా జరుపుకున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వివిధ రూపాల్లో భోగి మంటలు వేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని పండుగ వేళ రాజకీయ ప్రముఖులు ఆకాంక్షించారు.

విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏపీ తెలుగుదేశం నాయకులు సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ సహా స్థానిక నాయకులు గంగిరెద్దుకు పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వంలో.. అరాచకాలు పెచ్చుమీరాయన్న పల్లా శ్రీనివాస్‌ వచ్చే ఎన్నికల్లో ప్రజలే పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

POLITICAL PARTIES BHOGI CELEBRATIONS
భోగి మంటల్లో ఆస్తి పన్ను జీవో ప్రతులు

ప్రభుత్వం దిగిపోవాలి..

విజయవాడలోని తెదేపా జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా భోగి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. చెత్త పన్ను ప్లకార్డులను మంటల్లో వేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేశారు.

వైకాపాకు కనువిప్పు కలిగించాలి..

వైకాపా ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా భోగి మంటలు నిర్వహించాలని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భోగి మంటలతో వైకాపా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ పాలన విధానాలను నిరసిస్తూ విశాఖ కళాభారతి వద్ద సీపీఎం నాయకులు భోగి మంటలు నిర్వహించారు. ప్రభుత్వం విధించిన చెత్త, ఆస్తి పన్నుల జీవోల ప్రతులను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. పన్నుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఏపీలో ప్రతిపక్షాల వినూత్న నిరసన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.