ETV Bharat / city

Gowtham Reddy Funeral: ముగిసిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు

author img

By

Published : Feb 23, 2022, 1:20 PM IST

Updated : Feb 23, 2022, 2:36 PM IST

Gautam Reddy Funeral : గుండెపోటుతో హఠాన్మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఏపీలోని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి.. తండ్రి చితికి నిప్పంటించారు.

Gowtham Reddy Funeral
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు

Gautam Reddy Funeral : ఏపీలోని నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో మంత్రి గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల మధ్య ముగిశాయి. మేకపాటి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. పార్థివదేహానికి ముఖ్యమంత్రి జగన్ పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కడసారి తమ ఆత్మీయుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. చివరి పూజా కార్యక్రమాల తర్వాత గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి.. తండ్రి చితికి నిప్పంటించారు. అశేషంగా తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో అంత్యక్రియల ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

ముగిసిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు

అంతిమ యాత్ర సాగిందిలా..

నెల్లూరు జిల్లాలోని డైకాస్ రోడ్​లోని నివాసం నుంచి ఈరోజు ఉదయం 6 గంటలకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా అంతిమయాత్ర సాగింది. తమ అభిమాన నాయకుడిని కడసారి చూసేందుంకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. దారిపొడవునా అశ్రునయనాలతో నివాళి అర్పించారు. జోహార్ మంత్రి మేకపాటి, మెట్ట ప్రాంత ముద్దు బిడ్డ అమర్ రహే, అన్నా గౌతమన్నా అంటూ నినాదాలు చేస్తూ... బాధాతప్త హృదయంతో... తడారని కళ్లతో ఆయనకు వీడ్కోలు పలికారు.

మంత్రి హఠాన్మరణం

ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (50) సోమవారం హఠాన్మరణం చెందారు. ఆ రోజు ఉదయం 7 గంటల సమయంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు కారులో ఆయన్ను జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యవసర విభాగంలో చేర్చిన వైద్యులు కార్డియో పల్మనరీ రిససటేషన్‌ (సీపీఆర్‌) చేశారు. ఎంత ప్రయత్నించినా గౌతమ్‌రెడ్డిలో చలనం లేకపోవడంతో ఉదయం 9.16 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. ‘మంత్రి గౌతమ్‌రెడ్డి ఉదయం ఇంట్లోనే గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయనలో ఎలాంటి స్పందనా లేదు. శ్వాస కూడా తీసుకోవడం లేదు. గుండె వైద్యనిపుణులు, అత్యవసర వైద్య సిబ్బంది మంత్రిని రక్షించేందుకు ప్రయత్నించారు. దాదాపు 90 నిమిషాలపాటు సీపీఆర్‌ చేశారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది’ అని అపోలో ఆసుపత్రి వైద్య వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

ఇదీ చదవండి : TRS Deeksha for Bayyaram Steel plant : 'బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు..'

Last Updated : Feb 23, 2022, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.