ETV Bharat / city

ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు ఇవ్వండి : కేటీఆర్​

author img

By

Published : Dec 23, 2020, 8:38 PM IST

ktr
ktr

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2021-22 బడ్జెట్‌లో ప్రాజెక్టు వ్యయంలో కనీసం సగం మొత్తం కేటాయించాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఫార్మా పార్క్ అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, నేషనల్ డిజైన్ సెంటర్లతో పాటు తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కోసం రానున్న కేంద్ర బడ్జెట్​లో నిధులు కేటాయించాలని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్​ కోరారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్​కు కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ - వరంగల్, హైదరాబాద్ - నాగపూర్ పారిశ్రామిక కారిడార్లకు సుముఖతతో పాటు హైదరాబాద్ ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్​కు నిధులు ఇచ్చేందుకు సానుకూలత తెలిపినందుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

సమీకృత ఫార్మా పార్కుగా

రెండు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ఐదువేల కోట్ల వరకు వ్యయం అవుతుందని కేటీఆర్ చెప్పారు. ఈ రెండింటిని ఫాస్ట్ ట్రాక్ విధానంలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రాజెక్టు వ్యయంలో కనీసం సగం మొత్తాన్ని 2021-22 కేంద్ర బడ్జెట్​లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఫార్మారంగంలో దేశ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసేలా మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ తరహాలో ప్రపంచంలోనే పెద్దదైన సమీకృత ఫార్మా పార్కుగా హైదరాబాద్ ఫార్మాసిటీని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అత్యున్నత ప్రమాణాలు, సీఈటీపీ, సమీకృత వ్యర్థాల నిర్వహణ, ఫార్మా వర్సిటీ, ప్రయోగశాలలు, అంకురాలు, ఎస్ఎంఈ హబ్​లు కూడిన మొదటి ఫార్మాసిటీగా నిలుస్తుందని అన్నారు.

అంతర్జాతీయ కంపెనీల ఆసక్తి

ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటికే నిమ్జ్ హోదా ఇచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పలు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఫార్మాసిటీ ద్వారా రూ.64వేల కోట్ల పెట్టుబడులు, 5.5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉందని వివరించారు. జాతీయ ప్రాధాన్యత ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీకి ఈ బడ్జెట్​లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. ప్రాజెక్టుకు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.4,922 కోట్లు ఇవ్వాలని, రానున్న బడ్జెట్​లో కనీసం రూ.870 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్ నిమ్జ్​కు 2016లో తుదిఅనుమతులు వచ్చాయని... ప్రాజెక్టుకు సుమారు రూ.9,500 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బడ్జెట్​లో కొంత ఆర్థిక సాయం అందించాలని కోరారు.

డీపీఆర్ తయారీపై కసరత్తు

మొదటి దశలో రూ.500 కోట్లు కేటాయించాలని గతంలోనే కోరినట్లు గుర్తు కేటీఆర్​ చేశారు. హైదరాబాద్​లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు కోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ తయారీపై కేంద్రప్రభుత్వంతో అధికారులు కసరత్తు చేస్తున్నారని... గచ్చిబౌలిలో 30 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. డిజైన్ సెంటర్ ఏర్పాటు కోసం సుమారు రూ.200 కోట్లు ప్రాథమిక మూలధనాన్ని బడ్జెట్​లో కేటాయించాలని కేంద్ర మంత్రిని కేటీఆర్​ కోరారు.

ఇదీ చదవండి : వర్సిటీలకు జనవరిలోగా వీసీల నియామకం: వినోద్​ కుమార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.