ETV Bharat / city

Education Fee: విద్యార్థులకు షాక్.. భారీగా పెరిగిన ప్రభుత్వ బీటెక్‌ రుసుములు

author img

By

Published : Sep 12, 2021, 4:56 AM IST

జేఎన్‌టీయూహెచ్‌(JNTUH), ఉస్మానియా విశ్వవిద్యాలయాలు(Osmania University) బీటెక్‌(BTech), బీఫార్మసీ(B pharmacy) చదవబోయే విద్యార్థులకు షాక్‌ ఇచ్చాయి. రెగ్యులర్‌తో పాటు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల ఫీజులను ఏకంగా రెట్టింపు చేశాయి. బీటెక్‌ రెగ్యులర్‌ ఫీజును రూ.18 వేల నుంచి రూ.35 వేలకు, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు రూ.35 వేల నుంచి రూ.70 వేలకు పెంచారు.

Education Fee
Education Fee

బీటెక్‌, బీఫార్మసీ చదవబోయే విద్యార్థులకు జేఎన్‌టీయూహెచ్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు షాక్‌ ఇచ్చాయి. రెగ్యులర్‌తో పాటు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల ఫీజులను ఏకంగా రెట్టింపు చేశాయి. ఫలితంగా ప్రైవేట్‌లోనే కాదు... ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఇంజినీరింగ్‌ చదవడం భారంగా మారనుంది. పెరిగిన ఫీజులు జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ప్రాంగణంతో పాటు మంథని, సుల్తానాపూర్‌, జగిత్యాల, ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభమవుతున్న సిరిసిల్ల కళాశాలల్లో అమలవుతాయి. ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాలలో కూడా పెంపు ఉంటుంది. కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు మాత్రం పెంచలేదు. రుసుములను పెంచుతున్నట్లు కనీసం ప్రకటన కూడా ఇవ్వకుండా వర్సిటీలు గుట్టుగా వ్యవహరించడం గమనార్హం. బీటెక్‌ రెగ్యులర్‌ ఫీజును రూ.18 వేల నుంచి రూ.35 వేలకు, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు రూ.35 వేల నుంచి రూ.70 వేలకు పెంచారు. ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం(2021-22) నుంచి ప్రారంభిస్తున్న కృత్రిమ మేధ కోర్సుకు ఏకంగా రూ.1.20 లక్షలు రుసుంగా నిర్ణయించడం గమనార్హం.

మూడేళ్లలోనే భారీగా పెంపు

వర్సిటీల్లోని రెగ్యులర్‌ బీటెక్‌ ఫీజును 2019లో రూ.10 వేల నుంచి రూ.18 వేలకు పెంచారు. తాజాగా రూ.35 వేలు చేయడం గమనార్హం. ఇక సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల ఫీజులు ఏకంగా రూ.70 వేలకు చేరుకున్నాయి. ఈ కోర్సుల్లో బోధించే కాంట్రాక్టు, తాత్కాలిక అధ్యాపకుల జీతాలను నిర్దేశించడంలో భాగంగా ఫీజులను పెంచుకోవచ్చని జులైలో విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. కనీస రుసుంను రూ.45 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా వర్సిటీలు పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయిం తీసుకోవాలంది. విద్యాశాఖ కనీస ఫీజు బీటెక్‌కు రూ.45 వేలుగా నిర్ణయించగా...వాటిని జేఎన్‌టీయూహెచ్‌ ఏకంగా రూ.70 వేలకు పెంచడం గమనార్హం.

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ సందర్భంగా ఆయా కళాశాలల జాబితా, కోర్సులు, ఫీజులు తదితర వివరాలను సాంకేతిక విద్యాశాఖ పొందుపరిచింది. దాంతో ఫీజుల పెంపు విషయం వెలుగులోకి వచ్చింది.

బాబోయ్‌...ఓయూ ఫీజు

ఈ విద్యా సంవత్సరం(2021-22) ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కింద రెండు కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. అందులో సీఎస్‌ఈ ఏఐ అండ్‌ ఎంఎల్‌( ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లాంగ్వేజ్‌)కు ఏకంగా రూ.1.20 లక్షలు నిర్ణయించింది. బీటెక్‌ మైనింగ్‌ ఇంజినీరింగ్‌కు రూ.లక్షగా నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అత్యధిక ఫీజు ఏడాదికి రూ.1.34 లక్షలు. రూ.లక్ష రుసుం దాటిన కళాశాలలు 20 మాత్రమే ఉన్నాయి. వాటి సరసన ఇప్పుడు ఓయూ కళాశాల చేరింది.

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ పీజీ కోర్సులకూ

వృత్తి విద్యా కోర్సులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 128 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుండగా దాదాపు అన్ని చోట్లా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ పీజీ కోర్సులే నడుస్తున్నాయి. ఆ కోర్సుల్లో చేరే వారికీ ఈసారి ఫీజుల భారం తప్పదు.

ప్రస్తుతం బీటెక్‌లో ఫీజు పెంపును అమలు చేసినందున త్వరలో అన్ని రకాల కోర్సులకు కూడా భారీగా రుసుం పెరగనుంది. ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఫార్మసీతో పాటు బీఈడీ, ఎల్‌ఎల్‌ఎం తదితర అన్ని రకాల కోర్సుల ఫీజులు ఈ ఏడాది పెరగనున్నాయి.

ఇవీ చూడండి: NEET EXAM: నేడే నీట్​ 2021 పరీక్ష.. ఫాలో కావాల్సిన రూల్స్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.