ETV Bharat / city

కొల్హాపూర్‌ వెళ్తే... కాశీకి వెళ్లినట్లేనట!

author img

By

Published : Jan 31, 2021, 11:22 AM IST

కాశీ క్షేత్రానికి ప్రత్యామ్నాయంగా గుర్తింపు పొందిన ఆ ఆలయంలో మహాలక్ష్మి... భక్తుల కోర్కెలు తీర్చే శక్తిస్వరూపిణిగా పూజలు అందుకుంటోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఈ ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉంది. కర్‌వీర్‌ మహాలక్ష్మిగా వెలసి భక్తుల కోర్కెలు తీర్చే ఈ అమ్మవారికి భవాని అని కూడా పేరు. కొల్హాపూర్​ మహాలక్ష్మి ఆలయ ప్రాశస్త్యాన్ని మీరూ తెలుసుకుని తరించండి.

kolhapur mahalaxmi temple story
kolhapur mahalaxmi temple story

అడుగడుగునా ఆధ్యాత్మికత శోభిల్లే ఆలయం మహరాష్ట్రలోని కొల్హాపూర్‌ మహాలక్ష్మి సన్నిధి. మన దేశంలో ఉన్న అన్ని మహాలక్ష్మి ఆలయాలతో పోలిస్తే... ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉందని అంటారు. సతీదేవి నయనాలు ఇక్కడ పడ్డాయనీ... అందుకే ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటనీ చెబతారు. సుమారు ఆరువేల ఏళ్ల క్రితం నుంచీ ఈ ఆలయం ఉన్నా దీన్ని ఎప్పుడు ఎవరు కట్టారనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. పంచగంగ నదీ ఒడ్డున ఉన్న ఈ అమ్మవారిని జగద్గురువు ఆదిశంకరాచార్యులూ, ఛత్రపతి శివాజీతోపాటూ ఎందరో రాజులు దర్శించుకున్నట్లుగా చరిత్ర చెబుతోంది. ఇక్కడ కొలువైన మహాలక్ష్మిని కర్‌వీర్‌ మహాలక్ష్మి, లక్ష్మీభవాని, అంబాబాయిగా కొలుస్తారు భక్తులు.

స్థలపురాణం

ప్రళయకాలం సంభవించినప్పుడు పరమశివుడు కాశీక్షేత్రాన్ని కాపాడినట్లుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితం లక్ష్మీదేవి కూడా తన చేతులతో ఈ ప్రాంతాన్ని ఎత్తి కాపాడిందని అంటారు. అందుకే ఇక్కడ అమ్మవారిని కరవీర మహాలక్ష్మిగానూ పిలుస్తారు భక్తులు. ఓసారి భృగు మహర్షి విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు వచ్చాడట. విష్ణుమూర్తి మహర్షి రాకను గమనించలేదట. దాంతో ఆగ్రహించిన ఆ రుషి విష్ణుమూర్తి వక్షస్థలంపైన తన్నడంతో... తాను కొలువై ఉండే వక్షస్థల భాగాన్ని ఓ ముని తన కాలితో తాకడాన్ని సహించలేని లక్ష్మీదేవి కోపంతో వైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసిందనీ... ఆ తరువాత ఇక్కడే ఉండిపోయిందనీ అంటారు. అలాగే సతీదేవి దేహాన్ని చేతబట్టి శివుడు ప్రళయ తాండవం చేసినప్పుడు ఖండితమైన ఆమె శరీర భాగాలలో నయనాలు ఇక్కడ పడ్డాయనీ... అలా అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలిసిందనీ మరో కథా ప్రాచుర్యంలో ఉంది. అయితే ఒకప్పుడు ఇక్కడ చాలా చిన్న ఆలయం ఉండేదట. ఓసారి కర్ణ్‌దేవ్‌ అనే రాజు కొంకణ్‌ ప్రాంతం నుంచి కొల్హాపూర్‌ వచ్చినప్పుడు ఈ అడవిలో ఉన్న ఆలయాన్ని చూసి... చుట్టూ ఉన్న చెట్లను నరికించి... ఈ గుడిని వెలుగులోకి తెచ్చాడని చెబుతారు. ఆ తరువాత కాలక్రమంలో ఎందరో రాజులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఓసారి అగస్త్య ముని... కాశీకి ప్రత్యామ్నాయంగా మరో పుణ్యక్షేత్రాన్ని చూపించమని పరమశివుడిని అడిగాడట. దాంతో శివుడు కొల్హాపూర్‌ని చూపించాడనీ... ఈ ఆలయానికి వెళ్తే కాశీని దర్శించుకున్న పుణ్యం లభిస్తుందనీ దేవీ భాగవతంతోపాటూ పద్మ, స్కంద, తదితర పద్దెనిమిది పురాణాల్లో ప్రస్తావించబడిందనీ చెబుతారు.

సూర్యకిరణాలు పడతాయి

ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని విలువైన రాయితో చేశారనీ, దాదాపు నలభైకేజీల బరువుంటుందనీ అంటారు. పద్మం, కలశం, పాత్ర, పుష్పం పట్టుకుని నాలుగు చేతులతో, సింహవాహినిగా అమ్మ దర్శనమివ్వడం విశేషం. ఇక్కడ ప్రతిరోజూ అయిదు పూటలా ఇచ్చే హారతులు చూసేందుకు రెండుకళ్లూ చాలవంటారు. ప్రతిరోజూ మధ్యాహ్నం దత్తాత్రేయుడు ఈ ఆలయానికి వచ్చి భిక్ష స్వీకరిస్తాడనీ పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ దత్తాత్రేయుడికీ ఓ ఆలయం ఉంటుంది. అదేవిధంగా ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని దర్శించి శ్రీచక్రాన్ని స్థాపించినట్లు చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా రథసప్తమి సమయంలో మూడు రోజుల పాటు అమ్మవారిపైన సూర్యకిరణాలు పడతాయనీ.. మొదటిరోజు పాదాలపైన, తరువాత మధ్యభాగంపైన, చివరి రోజున ముఖంపైన కనిపిస్తాయనీ.. దీన్ని చూసేందుకే భక్తులు వివిధ ప్రాంతాలనుంచి వస్తారనీ అంటారు ఆలయ నిర్వాహకులు. ప్రత్యేక సందర్భాల్లో చేసే పూజలతోపాటూ దీపావళి నుంచి కార్తిక పౌర్ణమి వరకూ విశేష పూజాదికాలు నిర్వహిస్తారిక్కడ. నాలుగు ద్వారాలు ఉండే ఈ క్షేత్రంలో అమ్మవారు తూర్పు దిక్కున కొలువై ఉంటుంది. ఇక్కడ మహాలక్ష్మి గుడితోపాటూ... వేంకటేశ్వరుడు, తుల్జాభవానీ, వినాయకుడు, శివుడు... వంటి ఇతర ఉపాలయాలూ ఉన్నాయి.

ఎలా చేరుకోవచ్చు...

విమానంలో వెళ్లాలనుకునేవారు... ముంబయివరకూ వచ్చి అక్కడి నుంచి బస్సులూ, ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఒకవేళ రైల్లో వెళ్లాలనుకుంటే కొల్హాపూర్‌లోని రైల్వేస్టేషన్‌లో దిగితే... అక్కడి నుంచి ఏ వాహనంలోనైనా చేరుకోవచ్చు.

ఇదీ చూడండి: ప్రకృతివనం... పల్లె ప్రజల ఆరోగ్య నందనవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.