ETV Bharat / city

JNTU: ఇంజినీరింగ్‌ అధ్యాపకుల భర్తీకి ఉమ్మడి పరీక్ష

author img

By

Published : Jun 1, 2022, 11:21 AM IST

jntu
జేఎన్‌టీయూ

JNTU: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అధ్యాపకుల భర్తీకి కొత్త విధానం తీసుకురావాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. ఇక నుంచి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

JNTU: తెలంగాణలో ఉన్న ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అధ్యాపకుల భర్తీ కోసం జేఎన్‌టీయూ కొత్త విధానం తీసుకురావాలని నిర్ణయించింది. ఇక నుంచి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జేఎన్‌టీయూ పరిధిలో దాదాపు 220 గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. వీటిలో అధ్యాపకుల నియామకం ఆయా కళాశాలలే చూసుకుంటున్నాయి. బోధన పరంగా అర్హత ఉన్నా.. లేకున్నా.. పట్టించుకోకుండా తమకు నచ్చిన వ్యక్తులను అధ్యాపకులుగా నియమించుకుంటున్నాయి. తర్వాత జేఎన్‌టీయూ నిర్వహించే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ సమావేశాల్లో అధ్యాపకులను ర్యాటిఫై(ఆమోదం) చేయించుకుంటున్నాయి. దీంతో కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులు అధ్యాపకులుగా నియమితులు కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇది రానురాను అక్రమాలకు తావిచ్చింది. వర్సిటీ నుంచి ఆచార్యులు వెళ్లడం.. ప్రైవేటు కళాశాలలనుంచి అందిన కాడికి దండుకుని అధ్యాపకులకు ఆమోదం తెలుపుతున్నారన్న ఆరోపణలున్నాయి.

టెట్‌ తరహాలో జీవితకాలం ఉండేలా... కరోనా సమయంలో పెద్దఎత్తున అధ్యాపకులను ప్రైవేటు కళాశాలలు తొలగించాయి. జవాబుదారీతనం లేకపోవడంతో ఇష్టారాజ్యంగా అధ్యాపకులను నియమించడం.. తొలగించడం చేస్తున్నాయి. అదే వర్సిటీ తరఫున రిక్రూట్‌మెంట్‌ జరిగితే ఈ తరహా చర్యలకు అడ్డుకట్ట పడుతుందని జేఎన్‌టీయూ భావిస్తోంది. ఈ పరిణామాల దృష్ట్యా త్వరలోనే కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ ప్రకటన విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఎవరైనా అర్హత ఉన్న అభ్యర్థులు పరీక్ష రాయొచ్చు. టెట్‌ తరహాలో పరీక్షలో స్కోర్‌ సాధిస్తే జీవితకాలం చెల్లుబాటు అవుతుంది.

సరైన స్పష్టత ఇవ్వాలి..

'అధ్యాపకుల ఎంపికకు అర్హత పరీక్ష నిర్వహించడం ఆహ్వానించదగిన పరిణామం. దీనిపై వర్సిటీ తరఫున సరైన స్పష్టత ఇవ్వాలి. ఇప్పటికే ర్యాటిఫై అయిన అధ్యాపకులు మళ్లీ పరీక్ష రాయాలా..? అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు పీహెచ్‌డీ ఉంటే పరీక్ష రాయాలా..? ఇలాంటి సందేహాలను నివృత్తి చేశాకే పరీక్ష నిర్వహిస్తే మంచిది.'- వి.బాలకృష్ణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

కసరత్తు జరుగుతోంది..

'అధ్యాపకుల ఎంపికకు సంబంధించి అర్హత పరీక్ష నిర్వహించడంపై కసరత్తు జరుగుతోంది. దీనిపై మరోసారి చర్చించి విధి విధానాలు ఖరారు చేయాలి. పరీక్ష విధానం, మార్కులు, నిర్వహణపై చర్చించాల్సి ఉంది. వాటిపై స్పష్టత వచ్చాక నోటిఫికేషన్‌ జారీ చేస్తాం.'- మంజూర్‌ హుస్సేన్‌, రిజిస్ట్రార్‌, జేఎన్‌టీయూ

ఇవీ చదవండి:సిగరెట్ తాగడంలో 'తగ్గేదేలే' అంటున్న అమ్మాయిలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.