ఎస్‌బీఐ బ్రాంచిలో కోట్ల నగదు సహా ఆభరణాలు మాయం.. తీరాచూస్తే..!

author img

By

Published : Sep 5, 2022, 7:23 PM IST

Bank Fraud

Bank Fraud in Medak: బ్యాంకులో ఆయన బాధ్యతగల అధికారి. కోట్ల రూపాయలు... నగలు వంటి విలువైన వస్తువులను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారి కంచె చేను మేసినట్లు... బ్యాంకుకే కన్నం వేశాడు. కోట్లు దోచుకొని ఉడాయించాడు. మెదక్ జిల్లాలో జరిగిన ఆ ఘటన సీబీఐ కేసు నమోదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Bank Fraud in Medak: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచిలో నాగేందర్... నగదు ఇన్‌ఛార్జీగా విధులు నిర్వర్తించేవాడు. గత జూన్ 21 నుంచి ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజర్యయాడు. బ్యాంకు ఉన్నతాధికారులు అతడిని ఫోన్‌లో సంప్రదించగా.. సమీప బంధువు చనిపోయాడని.. కాస్త ఆలస్యంగా వస్తానని బదులిచ్చాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి.. ఓ ఖాతాదారుడి ద్వారా స్ట్రాంగ్ రూం తాళాలను బ్యాంకుకు పంపాడు. బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి స్ట్రాంగ్ రూం లాకర్లు తెరిచి పరిశీలించగా అసలు విషయం బయటపడింది.

స్టాంగ్‌రూంలో పరిస్థితి చూసి అధికారులు కంగుతిన్నారు. 2 కోట్ల 32లక్షల నగదు, సుమారు 72 లక్షల విలువైన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. బ్యాంకు పరిధిలోని 3 ఏటీఎంలలోనూ 2 కోట్ల 19లక్షలు తక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. వారి ఆదేశాలతో స్ట్రాంగ్ రూం, ఏటీఎంలలోని... సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. స్ట్రాంగ్‌రూంను ఒక్కడే తెరిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనిపించాయి. గత ఫిబ్రవరి 25న నాగేందర్... ఖాతాదారుల సొత్తు దోచుకెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిర్థారణకు వచ్చారు.

ఎవరూ గమనించని సమయంలో నాగేందర్ లాకర్ తెరిచి ఖాతాదారులకు చెందిన నగదు, ఆభరణాలు దోచుకెళ్లాడు. అంతటితో ఆగకుండా ఏటీఎంలలోని డబ్బునూ కాజేశాడు. ఆ తర్వాత నాలుగు నెలల పాటు బ్యాంకుకు వచ్చివిధులు నిర్వహించాడు. జూన్ 21 నుంచి విధులకు గైర్హాజరుకాగా విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారులు అంతర్గతవిచారణ, తనిఖీచేసిన అధికారులు..... నాగేందర్‌ఐదు కోట్లకుపైగా అవకతవకలకు పాల్పడ్డట్టు నిర్థారణకు వచ్చారు. ఆ విషయంపై సీబీఐకి ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టడంతో ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నాగేందర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. బ్యాంకులోని... నగదు, నగలు మాయం చేసిన ఘటనలో నాగేందర్‌తోపాటు జాయింట్ కస్టోడియన్ల పాత్రపైనా... అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్‌బీఐ బ్రాంచిలో కోట్ల నగదు సహా ఆభరణాలు మాయం.. తీరాచూస్తే..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.