ETV Bharat / city

మౌలిక లక్ష్య సాధనకు ఆమడ దూరంలో నిలిచిన ఐసీడీఎస్‌

author img

By

Published : Apr 9, 2021, 4:19 AM IST

నివేదికలన్నీ..పోషకాహారం లోపం సమస్య భారత్‌లో అధికంగా ఉందని చెబుతున్నాయి. ప్రభుత్వాలు వీటిపై నిధులు తక్కువ కేటాయిస్తున్నాయని స్పష్టం చేస్తున్నాయి. అసలే అరకొర నిధులు...అందులోనూ పూర్తిగా ఖర్చు చేయడం లేదని కాగ్‌ సైతం ప్రభుత్వాల తప్పుల్ని ఎత్తి చూపుతోంది. ఇన్ని చేసినా...క్షేత్రస్థాయిలో మార్పులు ఎందుకు రావట్లేదు...? ఐసీడీఎస్‌ అమలులో జరగుతున్న నిర్లక్ష్యం ఏంటి..? నీతి ఆయోగ్‌ చెబుతున్నట్లుగా 2022 నాటికి పోషణ్‌ అభియాన్‌ లక్ష్యాల్ని అందుకుంటుందా...?

ICDS SCHEME ARE GOING TO NEGLIGENCE IN ENTIRE COUNTRY
మౌలిక లక్ష్య సాధనకు ఆమడ దూరంలో నిలిచిన ఐసీడీఎస్‌

మౌలిక లక్ష్య సాధనకు ఆమడ దూరంలో నిలిచిన ఐసీడీఎస్‌

ఐక్యరాజ్య సమితి నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో... 2030 వరకు ఆకలి బాధలకు తావన్నదే లేని ప్రపంచంగా మారాలి. అయితే, మన దేశంలో ఆ పరిస్థితులు వస్తాయా..? అంటే ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా కనిపిస్తోంది. పోషకాహారం అంటే కనీస అవగాహన లేక 70శాతం భారతీయుల్లో కండ పుష్టి కొరవడుతోంది. ఇది ఇలా ఉంటే... కొవిడ్‌ మహా సంక్షోభం దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్లమంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని దూరం చేసింది. ఫలితంగా, కాలే కడుపులతో మలమల మాడిపోతూ గత్యంతరం లేక బాలకార్మికులుగా మారుతున్న పిల్లలు ఎందరో. తల్లిపాల పోషణ సక్రమంగా సమకూరితే 60శాతం దాకా పిల్లల ఎదుగుదల లోపాల్ని తేలిగ్గా చక్కదిద్దగల వీలుందని నీతి ఆయోగ్‌ చెబుతోంది. కానీ, ఆ తల్లులే రక్తహీనతతో అలమటిస్తుంటే, వారి పిల్లలకు సహజ పోషకాహారం అందేదెలా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

నిరుపేద కుటుంబాల్లో పౌష్టికాహార సమస్యలకు విరుగుడుగా 1975లోనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన దేశం మనది. ఆరేళ్లలోపు పిల్లల పుష్టికర ఎదుగుదలను, రాష్ట్రాలవారీగా లక్షలాది బాలింతలు , కౌమార బాలికల బాగోగుల కోసం ప్రారంభించిన విశిష్ట పథకం...పిల్లల సమీకృత సేవల పథకం. అప్పట్లో 5 వేల అంగన్‌వాడీ కేంద్రాలతో మొదలై అంచెలవారీగా ఏడువేల బ్లాకుల్లో 14 లక్షలదాకా విస్తరించిన ఐసీడీఎస్‌ నేటికీ మౌలిక లక్ష్య సాధనకు ఆమడ దూరంలో నిలిచిపోయింది.

ఐసీడీఎస్ లక్ష్యాల్ని అందుకోలేకపోవడానికి ప్రధాన కారణం... పోషకాహార లేమిపై పోరాటానికి ఉద్దేశించిన కేటాయింపుల్లో సగందాకా ఖర్చు చేయకపోవడం. ఈ విషయంలో చాలా సార్లు కాగ్‌ కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వశాఖను తప్పుపట్టింది. అలాగే, కొన్నేళ్లుగా ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ కేటాయింపులు తగ్గిపోతున్నాయి. దేశంలో పోషకాహారం లేమి తీవ్రంగా ఉందన్న హెచ్చరికల నేపథ్యంలోనూ 2021 బడ్జెట్‌లో సైతం నిధులు అంతంతమాత్రంగానే కేటాయించారని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇటు రాష్ట్రాలూ తమవంతు బాధ్యత నిర్వహించడంలో భాగంగా ఏటా వేలకోట్ల రూపాయల మేర ఖర్చు చూపుతున్నా... క్షేత్రస్థాయిలో ఫలితాలో మరో విధంగా ఉంటున్నాయి. అసలే అరకొర కేటాయింపులు..అవీ పూర్తిగా వ్యయం కాకపోవడంతో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పటికే కళ్లకు కడుతున్నాయి.

దేశంలో ఎనిమిదిన్నర కోట్లవరకు ఆరేళ్లలోపు పిల్లలు, కోటీ 90లక్షల మందికిపైగా బాలింతలూ చూలింతల పోషకాహార అవసరాలు తీర్చడంలో అంగన్‌వాడీ కేంద్రాలు నిమగ్నమైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. నిజానికి- వ్యాధి నిరోధక టీకాల సరఫరా, పౌష్టికాహార పంపిణీల నిమిత్తం దేశంలో 17 లక్షల అంగన్‌వాడీలు నెలకొల్పాల్సిందిగా 19 సంవత్సరాల క్రితమే సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది. కొత్త అంగన్‌వాడీల సంగతి దేవుడెరుగు... ఉన్నవాటి పరిస్థితే అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్రాలవారీగా మంజూరై ఇప్పటికీ పని ఆరంభించని కేంద్రాల సంఖ్య వేలల్లో ఉండగా- కరోనా విజృంభణ అసంఖ్యాక అంగన్‌వాడీలను అచేతనం చేసింది. అన్నార్తులైన మహిళలు, పసికందులు ఆకలిమంటల్లో కమిలిపోరాదంటే అవన్నీ తిరిగి తెరుచుకోవాల్సిందేనన్నది నిపుణుల వాదన.

పోషకాహార లోపాన్ని అధిగమించాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పోషణ్‌ అభియాన్‌ ప్రారంభించింది. 2022 నాటికి 6శాతం మేర ఎదుగుదల లోపాలను, బాలలు కౌమార బాలికలు బాలింతలు చూలింతల్లో తొమ్మిది శాతం వరకు రక్తహీనతను నియంత్రించాలన్నది దీని ముఖ్య ఉద్దేశం. పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసం, సహజంగా పండించే ఆహారపదార్థాలతో భారతదేశాన్ని కుపోషణ్ ముక్త్ భారత్ గా మార్చాలి. బ‌యో- ఫోర్టిఫైడ్ పంట ర‌కాల ఉత్పత్తుల్ని మధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం, అంగ‌న్‌వాడీ కేంద్రాలకు అందించాలి. అయితే, ఈ పథకం ఏ మేరకు సత్ఫాలితాలు అందిస్తుందో ... కాలమే సమాధానం చెప్పాలి.

ఎన్నో ఉన్నత లక్ష్యాలతో పథకాలు ప్రవేశపెట్టడమే కాదు. వాటి అమలులోనూ అంతే చొరవ చూపాలి. అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకం కాకుండా... నాణ్యమైన సరుకులు అందేటట్లుగా చర్యలు తీసుకోవాలి. అలాగే, పోషకాహారం లోపంపై స్వామినాథన్‌ సిఫార్సులను ఆచరణలో పెచ్చాలి. చివరి స్థాయిలో ఉన్న ప్రతి గర్భీణికి, తల్లికి, పిల్లలకు ఐసీడీఎస్‌ ఫలాలు అందేలా క్షేత్రస్థాయిలో కావాల్సిన మార్పులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దేశంలో 6 ఏళ్లలోపు పిల్లలు దాదాపు 22కోట్ల మంది ఉన్నారు. రాబోయే కాలంలో వివిధ రంగాల్లో సేవలు అందించే ఈ తరం ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజ పురోభివృద్ధి ఆధారపడి ఉంది. పౌష్టికాహార లోపాల వల్ల ఏర్పడే భౌతిక, ఆర్థిక, విజ్ఞానపరమైన నష్టం దేశ స్థూల దేశీయోత్పత్తిలో 3శాతం వరకూ ఉంటుందని అంచనా. కాబట్టి... ఐరాస సూచించిన విధంగా 2030 నాటికి పోషకాహార లోపం లేని దేశంగా నిలిచేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరముంది.

ఇవీ చూడండి: ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.