ETV Bharat / city

Heavy rains in andhra pradesh: ఎడతెరిపి లేని వాన.. పంటలకు అపార నష్టం

author img

By

Published : Nov 30, 2021, 9:59 AM IST

Heavy rains in andhra pradesh, Heavy rains in nellore district
ఎడతెరిపి లేని వాన.. పంటలకు అపార నష్టం

ఇటీవల కురిసిన వర్షాల నుంచి తేరుకోకముందే రాయలసీమ జిల్లాల్లో మళ్లీ వానలు(Rains in Andhra pradesh) ఆందోళన కలిగిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు ఒకరు మృతి చెందారు. అనంతపురం జిల్లాలో అపార పంటనష్టం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కంటిమీద(Heavy rains in nellore district) కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ వానలకు సంగం మండలం చెర్లోవంగల్లు వద్ద కలుజు వాగులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. నెల్లూరు నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా వాగు ఉద్ధృతి పెరిగి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. భారీ వర్షాలు నెల్లూరులోని పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమశిల జలాశయం నుంచి భారీగా వరద రావడం వల్ల పలుచోట్ల పెన్నానది పోర్లుకట్ట కోతకు గురైంది.

ఎడతెరిపి లేని వాన.. పంటలకు అపార నష్టం

గంగాదేవికి ప్రత్యేక పూజలు...

ఇందుకూరుపేట, ముదివర్తిపాళెం వద్ద కట్టకు గండిపడి వరద జలాలు రాజీవ్ కాలనీలోకి ప్రవేశించాయి. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భగత్‌సింగ్‌ కాలనీ, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరులోనూ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నాయుడుపేట, చిట్టమూరు మండలాల్లో 2వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రెండ్రోజులుగా(heavy rains in srikalahasti) ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. వానలకు ముత్యాలమ్మ గుడి వీధిలో టీ దుకాణం కూలిపోయింది. వడమాలపేట మండలం గూళ్లూరులో చెరువు నిండుకుండను తలపిస్తోంది. నగరి ఎమ్మెల్యే రోజా చెరువును పరిశీలించారు. గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. జలహారతి పట్టారు.

నీటమునిగిన పొలాలు...

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలకు(Rains in anantapur district) జలాశయాల్లో ప్రమాదకర స్థాయికి నీరు చేరింది. జీడిపల్లి జలాశయం కింద నీటి ఊటలతో కట్ట తెగుతుందని ప్రజలు భయపడుతున్నారు. యోగివేమన జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. చిత్రావతికి భారీ వరదతో యల్లనూరు - తాడిపత్రి మధ్యలో రహదారి తెగి రాకపోకలు నిలిచిపోయాయి. పేరూరు జలాశయం నుంచి 3వేల 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పీఏబీఆర్, ఎంపీఆర్, చాగల్లు రిజర్వాయర్ల గేట్లు తెరిచారు. చిత్రావతికి ఎపుడూ లేనంత వరద వచ్చింది. ధర్మవరంలో కుండపోతకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ కూడలిలో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలో మిరప, వేరుసెనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పరిశీలనా బృందాలను పంపి పంట నష్టాలను అంచనా వేయించాలని వేడుకుంటున్నారు.

ఇవీచదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.