గంజాయి రూపు మార్చుకుంది.. యువత భవిష్యత్తు అంధకారం అవుతోంది!

author img

By

Published : Sep 14, 2021, 12:05 PM IST

gangs-crossing-the-states-to-change-liquids-form-wet-ganja
సునయాసంగా ఎల్లలు దాటీస్తున్న అక్రమార్కులు ()

గంజాయి ముఠాలు.. గంజాయి అక్రమ రవాణాలో తమ పద్దతి మార్చుకున్నాయి. పొడి గంజాయిని యంత్రాలను వినియోగించి ద్రవంగా మార్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అధికంగా సంపాధించాలన్న అశతో కొందరూ ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా అయితే యువత భవిష్యత్​కు పెను ప్రమాదం పొంచి ఉంది.

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో మత్తు పదార్థమైన గంజాయిని విక్రయించే ముఠాలు ఎప్పటికప్పుడు తమ దందా పద్ధతిని మార్చుకున్నాయి. పొడి గంజాయిని ప్యాకెట్లలో తరలించడంకన్నా ద్రవంగా మారిస్తే రవాణా సులభంగా ఉండటంతోపాటు లాభాలూ అధికంగా ఉంటాయని గుర్తించిన ముఠాలు.. యంత్రాలను వినియోగించి గంజాయిని ద్రవంగా మార్చేస్తున్నాయి. దీన్ని ఏపీలోనే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నాయి. ఇటీవల కాలంలో ధ్రవ రూపంలో గంజాయిని తరలించి విక్రయించడం పెరిగింది.

ప్రమాదం ఎక్కువే..

పొడి గంజాయి కంటే ద్రవ రూపంలోకి మారిన తరువాత ఈ మత్తు పదార్థంతో ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది. ఎండిన గంజాయి ఆకులను ద్రవంగా మార్చేందుకు పెట్రోలుతో పాటు విషపూరిత రసాయనాలను వినియోగిస్తుంటారు. దీన్ని హెసిస్‌ ఆయిల్‌గా పిలుస్తుంటారని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు చెబుతున్నారు. హుక్కా పీల్చే అలవాటు చాలా రాష్ట్రాల్లో ఉంది. హుక్కాలో కొన్ని చుక్కలు ద్రవ గంజాయి వేస్తుంటారు. విశాఖ ధారకొండ ప్రాంతంలో ఈ ద్రవరూప గంజాయిని తయారు చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లాలో చిక్కిన నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. జి.మాడుగుల, సీలేరు, మరికొన్ని ప్రాంతాల్లో యంత్రాలను ఉపయోగించి ఈ మత్తు పదార్థానికి కొత్త రూపాన్ని ఇస్తున్నారు. 2015లో నర్సీపట్నం పరిధిలో టాస్క్‌ఫోర్స్ అధికారులు ఓ రోజు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఒకే రోజు 11 మంది నల్లమందు లాంటి ద్రవ పదార్థంతో దొరికారు. దీన్ని రసాయన విశ్లేషణకు పంపిస్తే గంజాయినే నల్లమందుగా తయారు చేసినట్లు వెల్లడైంది.

చిక్కితే పదేళ్ల వరకు జైలు..

గంజాయి మత్తుకు అలవాటు పడినవారిలో యువత ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. అదేవిధంగా జల్సాలకు అలవాటుపడి సులువుగా సొమ్ము సంపాదించొచ్చు అనే ఉద్దేశంతో మాఫియాతో చేతులు కలిపి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. గంజాయిని ఏ రూపంలో తరలించినా నేరమే. నిందితులపై నేరం రుజువైతే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. - బీవీజీ రాజు, ఏఈఎస్‌, ఎస్‌ఈబీ ఎన్‌ఫోర్స్మెంట్‌

ఇవీ కొన్ని ఉదంతాలు..

  • ఆగస్టు 25న విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా తూర్పుగోదావరి జిల్లాలోని చింతూరులో రెండు కేజీల ద్రవరూప గంజాయిని పట్టుకుని ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
  • ఇటీవల నర్సీపట్నంలో మోటారు సైకిల్‌పై తరలిస్తున్న 25 కేజీల ద్రవరూప గంజాయిని ఎస్‌ఈబీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు.
  • ఏజెన్సీలో కేజీ రూ.లక్ష చొప్పున ద్రవరూప గంజాయిని విక్రయిస్తున్నారు. ఇదే గంజాయిని రాష్ట్రం దాటిస్తే కేజీ రూ.2 లక్షల వరకు ధర పలుకుతుందని, ఇక దేశ సరిహద్దులు దాటిస్తే రూ.5 లక్షల వరకు డిమాండు ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: saidabad incident: రాజు ఎక్కడున్నాడు? తప్పించుకోవడానికి సహకరించింది ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.