ETV Bharat / city

బైబై గణేశా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనాలు

author img

By

Published : Sep 10, 2022, 8:00 PM IST

Updated : Sep 10, 2022, 10:11 PM IST

Ganesh immersion
వినాయక నిమజ్జనం

ganesh immersion in telangana 2022: రాష్ట్రవ్యాప్తంగా గణపతి బప్ప మోరియా అనే నినాదాలు మార్మోగిపోయాయి. వినాయక నవరాత్రులు పూర్తవడంతో గణపయ్యను భక్తులు గంగమ్మ ఒడిలో చేర్చారు. రాష్ట్రం మొత్తం కోలాహల వాతావరణం మధ్య వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మళ్లీ రావయ్యా విఘ్నేశ్వర అంటూ బైబై చెప్పారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఈ ఏడాది ఎంతో ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి.

బైబై గణేశా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనాలు

ganesh immersion in telangana 2022: రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయి. భక్తుల కోలాహలాల మధ్య వినాయక విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. శోభాయాత్ర మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు అంతటా సందడి వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల వర్షాలు కురిసినప్పటికీ.. భక్తులు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

హైదరాబాద్‌లో గణేశుని శోభయాత్ర వైభవం: హైదరాబాద్‌లో గణేష్‌ శోభాయాత్ర వైభవంగా ముగిసింది. ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం కోసం వేలాది వినాయక విగ్రహాలు తరలివచ్చాయి. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చిన లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఎప్పటికప్పుడు యాత్ర సాగుతున్న తీరును పరిశీస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.

వరంగల్‌లో వినాయక నిమజ్జనాలు: వరంగల్‌లో వినాయక నిమజ్జనం కొలాహలంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా చెరువుల వద్ద నిమజ్జనోత్సవ సందడి నెలకొంది. డప్పుల వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు చోట్ల వర్షంలోనే గణనాథులను నిమజ్జనం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో గోదావరిలో నిమజ్జనాలు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గణేశుని శోభయాత్ర కనుల పండుగగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం గోదావరికి తరలివచ్చాయి. గణేష్‌ విగ్రహాలను క్రేన్ల సహాయంతో లాంఛీలో ఎక్కించి గోదావరి లోపలికి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

ఆదిలాబాద్‌లో గణనాథుల ఊరేగింపు: ఆదిలాబాద్‌లో గణనాథుల శోభయాత్ర సందర్భంగా పెన్‌గంగా వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వందలాది విగ్రహాలు ప్రశాంతంగా గంగమ్మ ఒడికి చేరుకున్నాయి.

7,334 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించిన జీహెచ్ఎంసీ: హైదరాబాద్‌లో ఇవాళ ఒక్కరోజే 7,334 మెట్రిక్‌ టన్నుల చెత్తను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. 40 జేసీబీలు, 330 వాహనాలతో చెత్త తరలింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో 330 వాహనాలకు అదనంగా మరో 97 వాహనాలు, 27 అదనపు జేసీబీలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది వినియోగించారు. నగరంలోని 74 బేబీ పాండ్స్‌లో 89వేల విగ్రహాలు నిమజ్జనం చేశారని అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 10, 2022, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.