జాతీయ పార్టీకి ముహూర్తం ఖరారు చేసిన గులాబీ దళపతి.. అప్పుడే ప్రకటన..

author img

By

Published : Sep 11, 2022, 9:56 AM IST

Updated : Sep 12, 2022, 7:38 AM IST

కేసీఆర్‌

దసరాకు కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ రాబోతోంది. కొంతకాలంగా కసరత్తు చేస్తున్న గులాబీ దళపతి త్వరలోనే విధి విధానాల వెల్లడికి సన్నద్ధమవుతున్నారు. రాజకీయ కూటములతో ప్రజల్లో విశ్వాసం కలగదని భావిస్తున్న చంద్రశేఖర్ రావు... కొత్త పార్టీ ఏర్పాటుకే సిద్ధమయ్యారు. భాజపా, కాంగ్రెస్‌కు సమదూరం పాటించేలా.. దళితులు, రైతులు, కార్మికులు, యువత అంశాలనే ప్రధాన ఎజెండాగా తొలి అడుగులు వేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ వెంటనే జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని... ఇటీవల తెరాస జిల్లాల అధ్యక్షులందరూ ముక్తకంఠంతో కోరారు. త్వరలో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో భాజపాకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్, కుమారస్వామి

ప్రత్యక్ష జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సుదీర్ఘ కసరత్తు చేస్తున్న గులాబీ దళపతి.. కొత్త పార్టీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దసరా నాటికి జాతీయ రాజకీయ పార్టీ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. విజయదశమి నాటికి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు కేసీఆర్ చెప్పారని కర్ణాటక మాజీ సీఎం, జేడీయూ నేత కుమారస్వామి వెల్లడించారు. ఈనెల 9న తెరాస జిల్లాల అధ్యక్షులందరూ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి.. కేసీఆర్ వెంటనే జాతీయ రాజకీయాల్లోకి రావాలని ముక్తకంఠంతో కోరారు. త్వరలో తెరాస రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది.

జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేసీఆర్... దానికి అనుగుణంగా కొంత కాలంగా వివిధ అంశాలపై విస్తృత సమాలోచనలు జరుపుతున్నారు. భాజపా, కాంగ్రెస్ రెండింటికీ సమదూరం పాటిస్తూ... స్పష్టమైన అజెండాతో ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రజల్లో ఓ వైపు భాజపాపై తీవ్ర అసంతృప్తి ఉందని... మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంపై విశ్వాసం లేదని ..కాబట్టి జాతీయ పార్టీ ఏర్పాటుకు ఇదే సరైన సమయమని తెరాస అధినేత గట్టిగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ పట్ల ఎక్కువగా స్పందించకుండా.. భాజపాపై ధ్వజమెత్తి దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించాలనేది కేసీఆర్ ప్రస్తుత వ్యూహం. భాజపా వైఫల్యాలు, మతతత్వ రాజకీయాలు అనే అంశాలపై దేశవ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రణాళికలు చేస్తున్నారు.

తొలిదశలో ఆ అంశాలపై..: తొలి దశలో రైతులు, కార్మికులు, దళితులు, యువతకు సంబంధించిన అంశాలపై ఉద్యమాలను రూపొందించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. దేశంలో సాగునీరు, విద్యుత్ తగినంత అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో భాజపా, కాంగ్రెస్ విఫలమైనందునే రైతులకు కష్టాలు తప్పడం లేదన్న ప్రచారం చేయనున్నారు. త్వరలో హైదరాబాద్‌లో జాతీయ స్థాయి దళిత సదస్సు నిర్వహించాలని భావిస్తున్నారు. దళితబంధు దేశవ్యాప్తంగా అమలు చేయాలని దళితులు డిమాండ్ చేసేలా ఉద్యమాలు చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు తగిన అంశాలపై కేసీఆర్ బృందం అధ్యయనం చేస్తోంది. యువత అసంతృప్తిగా ఉన్న అంశాలపై నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో నెట్ వర్క్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అంశాలతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో స్థానికుల ప్రత్యేక డిమాండ్లు, బలమైన ఆకాంక్షలేమిటి.. వాటిపై భాజపాతో పాటు అక్కడి పార్టీల వైఖరి ఏమిటనే అంశాలను గులాబీ పార్టీ పరిశీలిస్తోంది. వాటిపై స్థానిక ప్రజాభాగస్వామ్యంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ సంకేతం మాత్రం స్పష్టంగా ఉండేలా..: వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడబెట్టుకునేందుకు కేసీఆర్ కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను కలవడంతో పాటు.. మరికొందరిని హైదరాబాద్‌కు ఆహ్వానించి చర్చించారు. ముఖ్యంగా భాజపాను వ్యతిరేకించే దాదాపు అన్ని పార్టీలతోనూ చర్చించారు. భాజపా, కాంగ్రెస్‌లకు సమదూరం అనే సంకేతం మాత్రం స్పష్టంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. కొన్ని పార్టీలు భాజపాను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. కాంగ్రెస్‌కు అనుకూల వైఖరితో ఉన్నందున.. ప్రస్తుతానికి వాటికి దూరంగానే ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కాకపోయినా... జేడీఎస్, ఆర్జేడీ, మరో రెండు, మూడు పార్టీలు మాత్రం కచ్చితంగా తమ వెంట కలిసి వస్తాయని గులాబీ బృందం విశ్వసిస్తోంది.

అప్పుడే పార్టీ ప్రకటన..: కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నిన్న జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మరోవైపు భాజపా, కాంగ్రెస్ రెండింటికీ దూరంగా ఉన్న వివిధ పార్టీల నేతలతో పాటు మేధావులు, ప్రముఖులు, విశ్రాంత అధికారులతో కేసీర్ నిరంతరం చర్చిస్తున్నారు. అజెండా, ప్రయాణం, ప్రచారంపై ఏకాభిప్రాయానికొచ్చిన కేసీఆర్.. విజయదశమి నాటికి పార్టీ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీకి భారత రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్ పేరు పెట్టాలా.. మరో పేరు ఖరారు చేయాలా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

  • Met Telangana Chief Minister Sri K. Chandrashekhar Rao at Pragati Bhavan @TelanganaCMO. We had an important and cordial discussion on Karnataka & Telangana State issues besides present political situation in Karnataka. 1/3 pic.twitter.com/r3xb8S6ZzF

    — H D Kumaraswamy (@hd_kumaraswamy) September 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Last Updated :Sep 12, 2022, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.