ETV Bharat / city

డీలాపడ్డ పూల మార్కెట్​.. ఆవేదన చెందుతున్న రైతులు

author img

By

Published : Aug 21, 2020, 6:18 PM IST

flower market down in vinayaka chavithi season at hyderabad
డీలాపడ్డ పూల మార్కెట్​.. ఆవేదన చెందుతున్న రైతులు

వినాయక చవితి పండుగ కళతప్పింది. కరోనా నేపథ్యంలో భారీ గణనాథుల విగ్రహాలు ప్రతిష్టించవద్దని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ తరుణంలో ప్రజానీకం ఎవరి ఇంట్లో వారు వినాయక చవితి జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో మార్కెట్‌లో పూల డిమాండ్ పడిపోయింది. ఆరుగాలం శ్రమించి పండించిన బంతి, చేమంతి, గులాబీ, మల్లెపూలు, ఇతర పూజా సామగ్రి ధరలు పతనయ్యాయి. రైతులకు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది కరోనా కారణంగా పండుగ ఉత్సాహం ఆవిరైనట్లు కనిపిస్తోంది.

డీలాపడ్డ పూల మార్కెట్​.. ఆవేదన చెందుతున్న రైతులు

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేళ.. పూల మార్కెట్‌ కళతప్పింది. కొవిడ్-19 నేపథ్యంలో తాజాగా కురుస్తోన్న వర్షాలకు మార్కెట్‌ సందడి లేకుండా పోయింది. కరోనా భయంతో పూలు, ఇతర పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో హైదరాబాద్ జంట నగరాల్లో జనం ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు. కరోనా వైరస్ పట్ల భయం, స్పృహ ఉన్నప్పటికీ.. రైతు బజార్లు, పూల విపణి కూడళల్లో ఏర్పాటు చేసిన మార్కెట్లలో.. వినియోగదారులు భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఎక్కడ చూసినా బాధ్యతారాహిత్యమే కనిపిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇది దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు కూడా కొనుగోలు కోసం వెనుకంజ వేస్తున్నారు. కొందరు ధైర్యం చేసి వర్షంలో సైతం మార్కెట్‌కు వచ్చి పూలు, పూజాసామగ్రి కొంటున్నారు. ఈసారి ధరలు సాధారణంగానే ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు.

ముంబయి తర్వాత

కోటి జనాభా గల విశ్వనగరం హైదరాబాద్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరగడం సంప్రదాయంగా వస్తుంది. దేశంలో ముంబయి తర్వాత ఆ స్థాయిలో ఇక్కడ సాగుతుంది. కొవిడ్ నేపథ్యంలో... తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో మంటపాలు, భారీ వినాయక విగ్రహాలు ప్రతిష్టించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో జంట నగరాల్లో పోలీసు శాఖ, జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ఎవరి ఇళ్లల్లో వారే చిన్ని మట్టి గణనాథుల పెట్టి పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్దదైన గుడిమల్కాపూర్‌ మార్కెట్‌లో జనం రద్దీ గణనీయంగా తగ్గిపోవడం చూస్తే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. గత ఏడాది వినాయక చవితితో పోల్చుకుంటే ఈ సారి ధరలు బాగా తగ్గడం వల్ల రైతుల్లో నిరుత్సాహం వ్యక్తమవుతోంది. వ్యాపారులు, మధ్య దళారులు, చిరు వ్యాపారులు కాస్త ధరలు పెంచేసి అమ్ముతున్నప్పటికీ.. మొత్తంగా ఫర్వాలేదని వినియోగదారులు చెబుతున్నారు. తొలిసారి వినాయక చవితి వేళ తమ పూల ఉత్పత్తులకు సరైన ధరలు లభించకపోవడం వల్ల ఏ మాత్రం సాగు గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు.

రైతులకు ఆటంకాలు

కరోనా ఆరంభంలో మార్చి చివరి నుంచి ఆంక్షల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో పూల పంటలు సాగు చేసే రైతులకు ఆటంకాలు ఎదురయ్యాయి. కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపారు. ఆన్‌లాక్‌ మొదలైన తర్వాత కొందరు మళ్లీ పూల నారు మొక్కలు నాటి సాగుకు శ్రీకారం చుట్టారు. కూలీల కొరత తీవ్రత వల్ల పెట్టబడి మరింత పెరగడం సహా సాగు తగ్గి తెలంగాణ నుంచి ఇప్పుడు సరకు కొద్దిగా మార్కెట్‌కు వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు నుంచి బంతి, చేమంతి, గులాబీ, మల్లె, సన్నజాజి, ఇతర పూలు వస్తున్నప్పటికీ ధరల్లేక రైతులు డీలాపడ్డారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి 3 టన్నులు బంతిపూలు తీసుకొస్తే కిలో 20 నుంచి 30 రూపాయలే అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పూల రైతులకు కొత్త కష్టాలు

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షలు విధించినప్పటి నుంచీ పూల రైతులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. వేలాది రూపాయలు వెచ్చించి పూల పంటలు సాగు చేసినా కొవిడ్ మార్గర్శకాలు, ప్రకృతి సహాయ నిరాకరణ చేశాయి. పంట వేసినా మంచి ధరలు వస్తాయన్న భరోసా లేకపోవడం వల్ల.. తెలంగాణలో చాలా మంది రైతులు సాగు చేయలేదు. ఇప్పుడు 10 శాతం క్షేత్రాల్లో పంట లేదు. ఫలితంగా పూలు మార్కెట్‌కు రాకపోవడం వల్ల వర్తకుల వ్యాపారాలు పడిపోయాయి. హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో కొందరు రైతులు సాగు చేసిన పంటల ఉత్పత్తులు దసరాకు మార్కెట్‌కు వస్తాయి. ఇప్పుడు మార్కెట్‌కు వస్తున్న 70 శాతం సరకు ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నాయని వర్తక సంఘాలు తెలిపాయి.

శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, రాఖీ, కృష్ణాష్టమి వంటి పర్వదినాలు పూర్తిగా నిరుత్సాహపరిచినప్పటికీ.. వినాయక చవితి ఆదుకుంటుందంటే అదీ కూడా రైతులను తీవ్రంగా నష్టపరిచింది. ఇక దసరా పర్వదినంపై పూలు రైతులే కాకుండా వ్యాపారులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. వినాయక చవితితో కరోనా మహమ్మారి దేశం విడిచివెళ్లిపోవాలని రైతులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

ఇదీ చూడండి : భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.