ETV Bharat / city

Electricity: ఈ 'కరెంట్​' కష్టాలకు కారణమేంటి..? విద్యుత్తు లేదా.. కొనడానికి డబ్బుల్లేవా..?

author img

By

Published : Apr 10, 2022, 9:18 AM IST

విద్యుత్తు లేదా.. కొనడానికి డబ్బుల్లేవా..?
విద్యుత్తు లేదా.. కొనడానికి డబ్బుల్లేవా..?

Electricity: ఏపీలో విద్యుత్​ కష్టాలు రోజురోజుకూ ఎక్కువయిపోతున్నాయి. ఎక్స్ఛేంజీలలో కొందామన్నా విద్యుత్తు దొరకట్లేదని.. అందుకే కోతలు విధిస్తున్నామని అధికారులు అంటున్నారు. కానీ పొరుగు రాష్ట్రాలు రోజూ 90 ఎంయూలు కొంటున్నాయి. మరి ఏపీకే ఎందుకీ పరిస్థితి..?

Electricity: ఎక్స్ఛేంజీలలో కొందామన్నా విద్యుత్తు దొరకట్లేదని.. అందుకే ఆంధ్రప్రదేశ్​లో కోతలు విధిస్తున్నామని అధికారులు అంటున్నారు. కానీ.. పొరుగునే ఉన్న తమిళనాడు, తెలంగాణ రోజూ 90 ఎంయూలు కొంటున్నాయి. మరి ఏపీకి 55 ఎంయూలు కూడా ఎందుకు దొరకట్లేదు? డిస్కంలు చెబుతున్నది వాస్తవమేనా? చేతిలో డబ్బులు లేక విద్యుత్తు కొనడం లేదా?

మార్కెట్‌లో నిజంగానే దొరకట్లేదా?:

దేశంలో 3.80 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మొత్తం డిమాండు 2 లక్షల మెగావాట్లకు మించదు. అంటే, డిమాండుకు దాదాపు రెట్టింపు ఉత్పత్తి చేయగలవు. మరి అదంతా ఎటు పోతుంది? ప్రైవేటు థర్మల్‌ కేంద్రాలు, పీపీఏలు లేని ప్లాంట్లు కచ్చితంగా ఎక్స్ఛేంజీల ద్వారా విద్యుత్తు విక్రయించాల్సిందే. తెలంగాణ పీక్‌ డిమాండ్‌ 265 ఎంయూలకు చేరింది. ఇందులో 90 ఎంయూలను ఎక్స్ఛేంజీల నుంచి కొంటోంది. అంటే మార్కెట్‌లో విద్యుత్తు ఉన్నట్లే కదా? ఇలా కొన్న విద్యుత్తుకు తెలంగాణ విద్యుత్తు సంస్థలు రోజుకు రూ.70-100 కోట్లు చెల్లిస్తున్నాయి. ఆ లెక్కన డబ్బులుంటే విద్యుత్తు దొరక్కపోవటం అనే సమస్య ఉత్పన్నం కాదు.

కొనడానికి డబ్బుల్లేక.... బిడ్‌ వేసినా దొరకలేదని సాకు:

బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు లభ్యత తగ్గి.. ధర పెరిగిందని అధికారులే చెబుతున్నారు. విద్యుత్తు ఎక్స్ఛేంజీ అంటేనే పోటీ మార్కెట్‌. ప్రతి గంటకూ బిడ్‌లు దాఖలు చేసి.. ఎక్కువ ధర కోట్‌ చేసిన వారికే విద్యుత్తు దక్కుతుంది. ఉదయం పీక్‌ (6-10 గంటలు), సాయంత్రం పీక్‌ (6-10 గంటలు) మధ్య డిమాండ్‌ ఎక్కువ. ఈ సమయంలో యూనిట్‌ ధర రూ.12-20 వరకు ఉంటోంది. కానీ, మన డిస్కంలు విద్యుత్తు కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవాలన్న ఆలోచనతో పీక్‌ సమయంలోనూ యూనిట్‌ రూ.8-9 వంతున కోట్‌ చేస్తున్నాయని ఆ శాఖ వర్గాల సమాచారం. అందుకే ఆ సమయంలో విద్యుత్తు దొరకటం లేదు. దీంతో గ్రిడ్‌ భద్రత కోసం ఎడాపెడా కోతలు పెట్టాయి. పీక్‌ డిమాండ్‌ కాకుండా మిగిలిన టైం బ్లాక్‌లలో యూనిట్‌ రూ.5-6 మధ్య బిడ్‌లు వేసి డిస్కంలు కొంటున్నాయి.

* ఈ నెల 1, 2 తేదీల్లో మార్కెట్‌లో విద్యుత్తును కొనుగోలు చేయడంతో కోతలు లేకుండా సరఫరా చేశాయి. తర్వాత నుంచి కొనుగోళ్లను తగ్గించాయి. దీనివల్లే భారీగా కోతలు అమలవుతున్నాయి.

రోజూ రూ.50 కోట్లు కావాలి:

బిడ్‌ దాఖలుకు ముందే కొనే విద్యుత్తుకు సరిపడా మొత్తాన్ని డిస్కంలు ఎక్స్ఛేంజీలలో డిపాజిట్‌ చేయాలి. రోజూ 55 ఎంయూలను మార్కెట్‌ నుంచి కొనాలి. దీనికి సుమారు రూ.50 కోట్లు అవసరం. రోజూ డిపాజిట్‌ చేయడానికి నిధులు సర్దుబాటు కాకపోవడం వల్లే పీక్‌ డిమాండ్‌ సమయంలోని కొన్ని బ్లాక్‌లలో యూనిట్‌ ధరను తగ్గించి డిస్కంలు బిడ్‌లు వేస్తున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. విద్యుత్తు కొనుగోలుకు రోజుకు రూ.30-35 కోట్లకు మించి వెచ్చించే పరిస్థితి లేదు. సిబ్బంది జీతాలను ఆలస్యంగా చెల్లించి.. విద్యుత్తు కొనుగోలుకు సర్దుబాటు చేశాయి. మిగిలిన సమయాల్లో ఎలాగోలా కొంటున్నా.. పీక్‌ డిమాండ్‌ సమయంలో కోతల్లేకుండా సరఫరా చేయటంలో చేతులెత్తేశాయి. మార్చిలో మొత్తం 1,551 ఎంయూలను ఎక్స్ఛేంజీల నుంచి కొనుగోలు చేసి రూ.1,058 కోట్లను చెల్లించినట్లు డిస్కంలు తెలిపాయి.

మార్కెట్‌లో దొరక్కే సమస్య:

బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు దొరకని సమయంలో గ్రిడ్‌ భద్రత కోసం కోతలు విధించాల్సి వస్తోందని ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌ పేర్కొన్నారు. కొన్ని టైం బ్లాక్‌లలో కొన్ని విద్యుత్తుకు అన్ని రాష్ట్రాల నుంచి పోటీ ఉండటం వల్ల మనకు విద్యుత్తు దొరకటం లేదన్నారు. ప్రభుత్వం ఒకట్రెండు రోజుల కిందట విద్యుత్తు సంస్థలకు రూ.780 కోట్లను ఇచ్చిందని.. ఈ మొత్తంతో బొగ్గు సంస్థల బకాయిలు, సిబ్బంది జీతాలు పోను మిగిలిన మొత్తాన్ని విద్యుత్తు కొనుగోలుకు ఖర్చు చేస్తామని తెలిపారు.

.

ఇదీ చదవండి: జంటనగరాల్లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలు మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.