ETV Bharat / city

లాక్​డౌన్​ వేళ.. డిజిటల్​ లావాదేవీల హవా

author img

By

Published : Apr 17, 2020, 11:10 AM IST

digital transactions hike in lock down time
లాక్​డౌన్​ వేళ.. డిజిటల్​ లావాదేవీల హవా

కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అమలవుతున్న లాక్‌డౌన్‌ వల్ల దేశవ్యాప్తంగా డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్నాయి. వైరస్‌ వ్యాప్తిని నిలువరించేందుకు భౌతిక దూరం పాటించడం తప్పనిసరైనందున... నగదు లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి. కిరాణా, వైద్యసామాగ్రి, మొబైల్ రీఛార్జిలు, యుటిలిటీ బిల్లులు చెల్లింపులకు క్రిడెట్‌, డెబిట్‌ కార్డుల వాడకం యాభైశాతం పెరిగింది.

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించి విజయవంతంగా అమలు చేస్తున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోన వైరస్‌ అత్యంత ప్రమాదకరమైనది కావడం వల్ల..ప్రజలు ఒకరినొకరు కలువడానికి కూడా భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తప్పనిసరి అంటేనే జనం బయటకు వెళ్తున్నారు...అవసరమైనవి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఏటీఎంలో నగదు తీసుకోడానికి, నగదు లావాదేవీలపై ఎక్కువ ఆసక్తి చూపడం లేదు.

చెల్లింపులన్నీ ఆన్​లైన్​లోనే..

ఇంటి అద్దె, కరెంటు బిల్లు, వాటర్‌ బిల్లు, మొబైల్‌ రీఛార్జిలు, గ్యాస్‌ బుకింగ్స్‌, డీటీహెచ్‌ బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు, ఆహారం, ఔషధాలు, పాలు, కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకుల కొనుగోలుకు నగదు బదులు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను, పే-టీఎం, గూగుల్‌పే లాంటి వ్యాలెట్లను కూడా వాడుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు వాడకంతో పోలిస్తే... క్రిడెట్‌, డెబిట్‌ కార్డుల వాడకం 50శాతం పెరిగాయి. స్థానిక దుకాణాలల్లో ఉపయోగించే పాయింట్-ఆఫ్-సేల్ మెషీన్లలో, ఆయా వ్యాపారికి చెందిన వ్యాలెట్ల ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపులు జరుగుతున్నాయి.

డిజిటల్​కే మొగ్గు

బ్యాంకులు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్​ఫేస్​ వంటివి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్​ను ప్రోత్సహిస్తున్నాయి. అమెజాన్, బిగ్‌బాస్కెట్, స్విగ్గీ, జొమాటో, గ్రోఫర్స్ లాంటివి నగదుతో కూడిన డెలివరీలను దాదాపుగా నిలుపేశాయి. లాక్​డౌన్​కు ముందు రోజువారీ లావాదేవీల్లో నగదు లావాదేవీలు 40శాతం ఉండేవని ఆయా సంస్థలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ అమలును దృష్టిలో ఉంచుకుని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 42శాతం భారతీయులు డిజిటల్‌ లావాదేవీల ద్వారా చేస్తున్నట్లు వెల్లడైంది.

పేమెంట్​ యాప్​ల హవా

గడిచిన మూడు వారాల్లో డిజిటల్ చెల్లింపునకు ఉపయోగించిన యాప్‌లను పరిశీలిస్తే... పే-టీఎం 33 శాతం, గూగుల్‌ పే 14 శాతం, పోన్‌ పే 4 శాతం, ఆమోజాన్‌ పే 10 శాతం, భీమ్‌ 6 శాతం... 33 శాతం ఇతర వ్యాలెట్లు వాడుతున్నారు. గడిచిన మూడు వారాల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం... వీసా కార్డులను 54 శాతం మంది, మాస్టర్‌ కార్డులు 30 శాతం, రూపే కార్డులు 12 శాతంగా ఉన్నాయి. రెండవ అతిపెద్ద లాభం ఆన్‌లైన్ షాపింగ్, ఇది మార్చి 22కి ముందు 10 శాతం ఉండగా... ఇప్పుడు 12 శాతానికి పెరిగింది.

నిత్యావసరాలు కూడా...

కిరాణా, నిత్యావసర వస్తువులు కొనుగోలు కూడా ఆన్​లైన్​లో పెద్ద ఎత్తున పెరిగింది. లాక్​డౌన్​కు ముందు ప్రయాణ లావాదేవీలు 3 శాతానికి పైగా ఉండగా... తర్వాత దాని వాటా 0.5 శాతానికి పడిపోయింది. విమానయాన సంస్థలు, రైళ్లు, బస్సులను పూర్తిగా నిలిపివేయడం వల్లనే తగ్గింది. లాక్​డౌన్​కు ముందు 10 శాతం వాటాను కలిగిన ఆన్‌లైన్ ఫుడ్ అండ్ పానీయాల విభాగం దెబ్బతిని 2.3 శాతానికి పడిపోయింది. ఇలా ప్రతి విభాగంలో నగదు లావాదేవీలకి స్వస్తి చెప్పి... డిజిటల్ లావాదేవీల వైపు ప్రజలు పరుగులు తీస్తున్నారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​ ముఖాముఖి: అమెరికా పరిస్థితికి ట్రంప్​ నిర్ణయాలే కారణమా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.