ETV Bharat / city

విద్యా సంవత్సరం ప్రారంభమైనా.. కానరానీ హామీల అమలు..

author img

By

Published : Jun 22, 2022, 8:21 AM IST

విద్యా సంవత్సరం ప్రారంభమైనా విద్యాశాఖకు సంబంధించి పలు అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో నేటికీ కదలిక కనిపించట్లేదు. దీనివల్ల అంతిమంగా విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యాసంస్థల్లో అమ్మాయిలకు శానిటరీ కిట్ల సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల నియామకాల ఊసే లేదు. బడి ఫీజులపై నియంత్రణ చట్టం మాటలకే పరిమితమైంది. ఇలా సమస్యల విలయంలో విద్యాలయాలు కొట్టుమిట్టాడుతున్నాయి.

Educational guarantees
Educational guarantees

విద్యాశాఖకు సంబంధించి పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చినా.. నిర్ణయాలు తీసుకున్నా అమలులో తాత్సారం జరుగుతోంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తెరుచుకున్నాయి. అంతిమంగా విద్యార్థులు నష్టపోతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఏడో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే అమ్మాయిలకు శానిటరీ కిట్లను అందజేస్తామని మార్చిలో రాష్ట్ర బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది.

దానివల్ల ఏడు లక్షల మంది ప్రయోజనం పొందుతారని సర్కారు అంచనా వేసింది. కిట్‌లో స్నానపు సబ్బు, బట్టల సబ్బు, కొబ్బరి నూనె, దువ్వెన, షాంపూ, టూత్‌ బ్రష్‌, టూత్‌పేస్ట్‌, టంగ్‌ క్లీనర్‌, కాటుక, శానిటరీ నాప్కిన్లు, బొట్టు బిళ్లలు, రిబ్బన్లు, హెయిర్‌ బ్యాండ్లను సరఫరా చేయాలి. ఒక్కో కిట్‌లో 3 నెలలకు సరిపోయే వస్తువులు ఉంటాయి. ఒక ఏడాదిలో నాలుగు సార్లు ఇస్తారు. ఈ పథకానికి రూ.140 కోట్ల వరకు వ్యయం అవనుంది. విద్యా సంస్థలు ప్రారంభమై వారం గడిచినా కిట్లపై కదలిక లేదు. ఇప్పటికిప్పుడు వాటి కొనుగోలుకు టెండర్లు పిలిచి ఇవ్వాలన్నా కనీసం రెండు మూడు నెలలు పడుతుంది. విద్యా సంస్థలు నడిచేదే 10 నెలలు. కిట్లు అందేసరికి సగం విద్యా సంవత్సరం ముగిసిపోతుందేమో అన్న ఆందోళన విద్యార్థినుల్లో వ్యక్తమవుతోంది.

ఉమ్మడి బోర్డు ఏర్పాటు దస్త్రంపై సంతకం చేసిన సీఎం!.. రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల ఖాళీలను ఉమ్మడి బోర్డు ద్వారా భర్తీ చేయాలని ఏప్రిల్‌ 12న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. బోర్డు ఏర్పాటుకు సంబంధించిన దస్త్రంపై సీఎం మంగళవారం సంతకం చేసినట్లు తెలిసింది. దాదాపు 3,500 నియామకాలు చేపడతామని అప్పట్లో సీఎం ప్రకటించారు. ఈ బోర్డును ఏర్పాటు చేయాలంటే ఆయా విశ్వవిద్యాలయాల చట్టాల్లో సవరణ చేయాలి. అసెంబ్లీ సమావేశాలు ఇప్పట్లో లేనందున ఖాళీల భర్తీని త్వరగా చేపట్టాలంటే వర్సిటీ చట్టాల సవరణపై ఆర్డినెన్స్‌ తీసుకురావాలి. ఆచార్యుల కోసం వర్సిటీలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి.

పదిహేనేళ్లుగా వంట కార్మికులకు రూ.వెయ్యే.. పదిహేనేళ్లుగా మధ్యాహ్న భోజనం వండి పెట్టే మహిళా కార్మికులకు నెలకు ఇస్తున్న రూ.వెయ్యి గౌరవ వేతనాన్ని రూ.3 వేలకు పెంచుతామని మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నది ఇప్పటివరకు వెల్లడించలేదు. ఉత్తర్వులు రాలేదు. తమకు గిట్టుబాటు కావడం లేదని కార్మికులు గత విద్యా సంవత్సరం పలు జిల్లాల్లో వంటను బంద్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయం కోసం 52 వేల మంది ఎదురుచూస్తున్నారు. ఇక ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు, భాషా పండితుల పోస్టుల ఉన్నతీకరణ తదితర ఎన్నో హామీలు అమలుకాలేదు.

ఫీ‘జులుం’ ఆగలేదు.. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులను నియంత్రిస్తామని గత కొన్నేళ్లుగా చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇందుకోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని జనవరి 17న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. విధి విధానాల రూపకల్పనకు ఏకంగా 12 మంది మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఆ కమిటీ మార్చి 2న సమావేశమైంది. ప్రతి సంవత్సరం 10 శాతానికి మించి రుసుములు పెంచడానికి వీల్లేదని నిర్ణయించిన కమిటీ ఆయా సిఫార్సులను సీఎం ఆమోదానికి పంపింది. చట్టం తీసుకురావాలంటే బడ్జెట్‌ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలి. అందుకు అంతా సిద్ధమైనా ఎందుకో బిల్లు ప్రవేశపెట్టలేదు. ఆర్డినెన్స్‌ ఇప్పించడమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో గవర్నర్‌తో ఆర్డినెన్స్‌ ఇప్పిస్తారా? అన్నది సందేహమే. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పలు పాఠశాలలు 15 నుంచి 20 శాతానికిపైగా ఫీజులను పెంచాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.