ETV Bharat / city

ప్రజా రవాణాపై కరోనా ప్రభావం.. వైరస్​కు బలవుతున్న ఉద్యోగులు

author img

By

Published : May 3, 2021, 2:48 PM IST

telangana rtc, telangana rtc is in loss, corona effect on telangana rtc
టీఎస్​ఆర్టీసీపై కరోనా ప్రభావం, తెలంగాణ ఆర్టీసీపై కరోనా ప్రభావం, తెలంగాణ వార్తలు

కరోనా ప్రభావం రవాణా రంగంపై పడింది. రెండో దశ కొవిడ్ కోరలు చాస్తున్నందున ప్రజారవాణాలో ప్రయాణించడానికి ప్రజలు జంకుతున్నారు. రైల్వే, ఆర్టీసీలు.. పలు రైళ్లను, బస్సులను ప్రయాణికులు లేని కారణంగా రద్దు చేస్తున్నాయి. మరో పక్క ఆర్టీసీ సిబ్బందిలో చాలా మంది కరోనా బారినపడుతున్నారు. రెండో విడతలో ఇప్పటికే 500ల పైచిలుకు మందికి వైరస్ సోకింది. వందల సంఖ్యలో సిబ్బంది మహమ్మారికి బలైపోయారు.

కరోనా ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. ప్రజలెవరూ ప్రజారవాణా వినియోగించకపోవడం వల్ల చాలావరకు రైళ్లు, బస్సులను అధికారులు రద్దు చేస్తున్నారు. ద.మ.రైల్వే పరిధిలో 23 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. పాక్షికంగా హెచ్.ఎస్.నాందేడ్ -తాండూర్, తాండూర్-హెచ్.ఎస్ నాందేడ్​, ఔరంగాబాద్ -హెచ్.ఎస్.నాందేడ్, ఆదిలాబాద్-హెచ్.ఎస్.నాందేడ్, వికారాబాద్ -గుంటూరు, సికింద్రాబాద్-యశ్వంత్ పూర్, తిరుపతి-మన్నర్ గుడి, రేపల్లే-కాచిగూడ, గుంటూరు -కాచిగూడ, సికింద్రాబాద్-సాయినగర్ షిర్డి, తిరుపతి-చెన్నై సెంట్రల్, సికింద్రాబాద్-విశాఖపట్టణం, ఔరంగాబాద్ -రేణిగుంట, పర్బనీ -హెచ్.ఎస్ నాందేడ్ రూట్లలో ఈనెల 31 వరకు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఆర్టీసీపైనా కరోనా ప్రభావం

ఆర్టీసీపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపెడుతోంది. సిటీ బస్సుల్లో, జిల్లాలకు వెళ్లే బస్సుల్లో ప్రజలు పెద్దగా ప్రయాణించడం లేదు. చాలా ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికులు లేకపోవడంతో రద్దవుతున్నాయని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఆర్టీసీలో సుమారు 25నుంచి 30శాతం బస్సులు రద్దయినట్లు తెలిపారు. కరోనా కష్ట కాలంలో రవాణా సౌకర్యం అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నా ప్రయాణికులు లేకపోవడం వల్ల రద్దు చేయక తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు.

వాటికీ గిరాకీ లేదు

ఆటోలు, క్యాబ్​లలో కూడా పెద్దగా ప్రజలు ప్రయాణించడం లేదు. రాత్రి ఎలాగూ కర్ఫ్యూ ఉంటుంది. భాగ్యనగరంలో 2.20 లక్షల వరకు ఆటోలు, సుమారు 80వేల వరకు క్యాబ్​లు ఉన్నాయి. రాత్రి కర్య్ఫూ వల్ల, రెండో దశ కరోనా ఉద్ధృతి వల్ల ప్రస్తుతం వీటికి కూడా గిరాకీ లేకుండా పోయింది.

200 మంది మృతి

రెండో దశ ఉద్ధృతిలో జనవరి నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు దాదాపు 850 మంది ఆర్టీసీ సిబ్బందికి కరోనా సోకింది. సెకండ్ వేవ్ కొవిడ్​తో దాదాపు 200 మంది ఆర్టీసీ సిబ్బంది మృతి చెందారు.

రైల్వే ఉద్యోగుల కోసం

దక్షిణ మధ్య రైల్వేకు ప్రత్యేకంగా ఆస్పత్రి ఉంది. లాలాగూడలో ఉన్న ఈ రైల్వే కేంద్ర ఆస్పత్రిలో సంబంధిత ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన సిబ్బందితో పాటు వారి కుటుంబీకులకు వైద్యం లభిస్తోంది. రోగుల అవసరాల మేరకు ఇక్కడ వైద్య సేవలను ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నారు. కరోనా కష్టకాలంలో 60 పడకలతో ప్రత్యేకంగా వార్డును సిద్దం చేసి వైద్యులను కూడా నియమించారు. ప్రస్తుతం రైల్వే ఉద్యోగులు..వారి కుటుంబసభ్యుల్లో ఎవరికైనా కరోనా సోకితే అక్కడే వైద్యం అందిస్తున్నారు.

ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు

రాష్ట్రంలో అతి పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ అయిన టీఎస్ఆర్టీసీలో 47వేల మంది ఉద్యోగులు వివిధ విధులను నిర్వర్తిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20వేలకు పైగా పనిచేస్తున్నారు. సంస్థ తరపున వైద్య సేవలు పొందాలంటే తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికే వీళ్లంతా వెళ్లాల్సి ఉంటుంది. డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం ప్రజల మధ్యన తిరుగుతున్నందున.. కనీసం తార్నాక ఆసుపత్రిలో 100 పడకలు సిద్దం చేసి ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కార్మిక నేతలు పేర్కొంటున్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ నిర్ధారణ పరీక్షలు చేపట్టడంలేదని తెలిపారు. కనీసం ఐసోలేషన్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినా...యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.