ETV Bharat / city

విద్యుత్తు బిల్లుల 'ఆన్​లైన్​' వడ్డన నుంచి ఇలా తప్పించుకోండి!

author img

By

Published : Jun 18, 2020, 11:24 AM IST

current bills
current bills

ఇప్పటికే ఎక్కువ విద్యుత్‌ బిల్లులు వచ్చాయని అనుకుంటున్న వినియోగదారులపై ఆన్‌లైన్ ఛార్జీలతో అదనపు భారం పడుతోంది. లాక్‌డౌన్ కారణంగా చాలా మంది బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నారు. వీటిపై కన్వియన్స్‌ ఛార్జీలు పడుతున్నాయి. ఆన్‌లైన్‌ ఛార్జీలను తొలగించాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారమే ఛార్జీలు వసూలు చేస్తున్నారని, అదనంగా చెల్లించడం ఎందుకని భావించేవారు ఛార్జీలు లేని పేమెంట్‌ మోడ్‌ను ఎంపిక చేసుకోవాలని విద్యుత్తు అధికారులు సూచిస్తున్నారు.

విద్యుత్తు బిల్లులు అధికంగా వచ్చాయని వినియోగదారులు ఓ పక్క గగ్గోలు పెడుతుంటే.. మరోపక్క ఆన్‌లైన్‌ ఛార్జీలు వారిపై మరింత భారం మోపుతున్నాయి. లాక్‌డౌన్‌ నుంచే చాలామంది తమ బిల్లులను ఆన్‌లైన్లో చెల్లిస్తున్నారు. అయితే వీటిపై వసూలు చేస్తున్న సౌలభ్య రుసుం(కన్వియన్స్‌ ఛార్జీ)లను చూసి కంగుతింటున్నారు. ప్రస్తుతం అధిక బిల్లులతో ప్రతి ఒక్కరూ ఎంత చెల్లిస్తున్నామనే విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అదనంగా జేబు నుంచి చెల్లించేది ఎంత అనే లెక్కలు వేస్తున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఆన్‌లైన్‌ లావాదేవీలపై రుసుములు లేవని చెబుతున్నా.. సౌలభ్య రుసుములు మాత్రం తప్పడం లేదు.

ఉదాహరణ ఇలా..

ఉప్పల్‌కు చెందిన వినియోగదారుడికి మూడు నెలలకు కలిపి ఇచ్చిన బిల్లు రూ.1,644 ఆన్‌లైన్లో చెల్లించారు. బ్యాంకు ఖాతా నుంచి రూ.1658.79 కట్‌ అయ్యాయి. దాదాపుగా రూ.15 సౌలభ్య రుసుముగా మినహాయించారు. మరో వినియోగదారుడు రూ.685 చెల్లిస్తే రూ.691.16 ఖాతా నుంచి డెబిట్‌ అయ్యాయి. రూ.6 వరకు సౌలభ్య రుసుం చెల్లించారు. బిల్లు మొత్తాన్ని బట్టి క్రెడిట్‌ కార్డు అయితే 0.80 శాతం+ జీఎస్‌టీ, డెబిట్‌ కార్డుకు 0.90 శాతం+ జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ అయితే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రతి లావాదేవీపై 2.35 శాతం+ జీఎస్‌టీ వేస్తున్నారు. బిల్లులు పెరిగేకొద్దీ సౌలభ్య రుసుంలు పెరుగుతున్నాయి. వేలల్లో బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులు రూ.200 వరకు ఇలా చెల్లించిన దాఖలాలు ఉన్నాయి.

రూ.832 కోట్ల డిమాండ్‌..

బిల్లుల జారీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. చెల్లింపుల గడువు తేదీలు ఒక్కోటి దగ్గర పడుతున్నాయి. బిల్లు ఇచ్చిన తేదీ నుంచి 14 రోజుల వరకు చెల్లింపునకు వెలుసుబాటు ఉంటుంది. ఈనెల 3న బిల్లుల జారీ మొదలైంది. వీరి చెల్లింపు గడువు 16వ తేదీ. ఈ తేదీ లోపు కడితే అపరాధ రుసుం ఉండదు. గడువు దాటిన తర్వాత కూడా కట్టొచ్చు. కానీ మరుసటి నెలలో అపరాధ రుసుం రూ.25 అదనపు ఛార్జీల రూపంలో వసూలు చేస్తారు. ఈ నెలలో ఎల్‌టీ విద్యుత్తు బిల్లుల డిమాండ్‌ రూ.832 కోట్లుగా ఉంది.

కొన్నింట్లోనే..

ప్రస్తుతం బిల్లులు చెల్లించేందుకు ఆన్‌లైన్లో వేర్వేరు పేమెంట్‌ మోడ్స్‌ను డిస్కం అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్లో బిల్లు చెల్లించేందుకు టీవాలెట్‌, టీఏ వాలెట్‌, బిల్‌ డెస్క్‌, బిల్‌ జంక్షన్‌, పేటీఎం, ఫోన్‌పే, మీసేవ ఆన్‌లైన్‌, టీ-యాప్‌ ఫొలియోలో చెల్లించే సదుపాయం ఉంది. కొన్నింటిలో సౌలభ్య రుసుం వసూలు చేస్తుండగా.. మరికొన్నింటిలో ఎలాంటి రుసుం లేదు. వేర్వేరు యాప్స్‌లోని యూపీఐ ద్వారా చెల్లిస్తే రుసుములు లేవు. రూపే కార్డుతో చెల్లిస్తే ఛార్జీలు లేకపోవడం కొంత ఊరట. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారమే ఛార్జీలు వసూలు చేస్తున్నారని, అదనంగా చెల్లించడం ఎందుకని భావించేవారు ఛార్జీలు లేని పేమెంట్‌ మోడ్‌ను ఎంపిక చేసుకోవాలని విద్యుత్తు అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సందేహానికి ప్రధాని స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.