ఇళ్లలో అధిక లోడుకు అభివృద్ధి రుసుం వసూలు.. ఎంతంటే?

author img

By

Published : May 9, 2022, 10:00 AM IST

Power load difficulties

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,900 కోట్ల అంతర్గత ఆదాయం సమకూర్చుకోవాలనే ఆదేశాల నేపథ్యంలో అభివృద్ధి ఛార్జీలపై విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు దృష్టి సారించాయి. ఈ మేరకు ప్రతి మీటరునూ తనిఖీ చేసి.. కనెక్షన్‌ తీసుకున్న సమయంలో తెలిపిన లోడు ప్రకారమే ఆ ఇంటిలో కరెంటు వాడుతున్నారా? అనేది పరిశీలించి బిల్లులు వేయాలని తాజాగా ఆదేశాలు జారీచేశాయి. అధికంగా వాడుతున్నట్లు తేలితే సదరు వినియోగదారులకు నోటీసులిచ్చి అదనంగా ‘అభివృద్ధి ఛార్జీ’ వసూలు చేయాలని సూచించాయి.

ఏ ఇంటిలో ఎంత లోడుతో కరెంటు వాడుతున్నారనే అంశంపై విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు జల్లెడ పడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,900 కోట్ల అంతర్గత ఆదాయం సమకూర్చుకోవాలనే ఆదేశాల నేపథ్యంలో అభివృద్ధి ఛార్జీలపై దృష్టి సారించాయి. ఈ మేరకు ప్రతి మీటరునూ తనిఖీ చేసి.. కనెక్షన్‌ తీసుకున్న సమయంలో తెలిపిన లోడు ప్రకారమే ఆ ఇంటిలో కరెంటు వాడుతున్నారా? ఎక్కువ వాడుతున్నారా? అనేది పరిశీలించి బిల్లులు వేయాలని డిస్కంలు కిందిస్థాయి ఉద్యోగులకు తాజాగా ఆదేశాలు జారీచేశాయి. అధికంగా వాడుతున్నట్లు తేలితే సదరు వినియోగదారులకు నోటీసులిచ్చి అదనంగా ‘అభివృద్ధి ఛార్జీ’ వసూలు చేయాలని సూచించాయి. అదనపు లోడుతో అధిక కరెంటు వాడుతున్నట్లు తేలితే ఒక్కో కిలోవాట్‌కు రూ.1200 (జీఎస్టీ అదనం) అభివృద్ధి ఛార్జీ వసూలు చేయాలని తెలిపాయి. ఇలా ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో దాదాపు 3 లక్షల కనెక్షన్లపై అదనంగా లోడు ఉన్నట్లు గుర్తించి రూ.120 కోట్ల దాకా వసూలు చేయాలని విద్యుత్‌ అధికారులు నిర్ణయించారు. అలాగే హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ డిస్కం పరిధిలో 5 లక్షల కనెక్షన్లకు పైగా అధిక లోడుతో కరెంటు వాడుతున్నట్లు గుర్తించి అదనపు అభివృద్ధి ఛార్జీ చెల్లించాలని నోటీసులిస్తున్నారు.

ఏమిటీ లోడు భారం... ప్రతి ఇల్లు లేదా సంస్థకు కరెంటు కనెక్షన్‌ ఇచ్చేటప్పుడు ఎంత లోడు కావాలనేది దరఖాస్తులో అడుగుతారు. సాధారణంగా సింగిల్‌ఫేజ్‌ కనెక్షన్‌ను 3 కిలోవాట్ల లోడుతో ఇస్తారు. గ్రామాల్లో అయితే 0.5 కిలోవాట్‌ లోడు కనెక్షన్లు సైతం వేల సంఖ్యలో ఉన్నాయి. కానీ, ఇటీవల ఇళ్లలో ఏసీలు, గీజర్లు, వాషింగ్‌ మిషన్ల వంటి వాటి వినియోగం పెరగడం వల్ల లోడు 3 నుంచి 10 కిలోవాట్ల వరకూ పెరుగుతోంది. ఈ లోడు సరిగా నమోదు కాకపోతే డిస్కంలు సరఫరా చేస్తున్న కరెంటుకు, వాస్తవ వినియోగానికి మధ్య వ్యత్యాసం వచ్చి ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లపై అధికలోడు పడి కాలిపోయి సరఫరా నిలిచిపోతోంది. సరఫరా ఎందుకు నిలిచిపోయిందని తనిఖీలు చేస్తే ఆయా ప్రాంతాల్లో అధిక లోడుతో ఇళ్లలో కరెంటు వాడుకుంటున్నట్లు తేలుతోంది. కరెంటుతో నడిచే ఉపకరణాలు ఏమేం ఉన్నాయనేది వినియోగదారులు పరీక్షించుకుని వాటి ఆధారంగా లోడు పెంచాలని స్థానిక విద్యుత్‌ ఏఈకి దరఖాస్తు చేస్తే ఈ సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.

పెరిగిన కనీస ఛార్జీ... మరోవైపు కరెంటు ఛార్జీలు పెంచడంతో వినియోగదారులకు బిల్లులు అధికంగా వస్తున్నాయి. త్రీఫేజ్‌ కరెంటు కనెక్షన్‌ కలిగిన ఒక ఇంటికి ఏప్రిల్‌ మొత్తం ఒక్క యూనిట్‌ కరెంటు వాడుకోకున్నా రూ.224 బిల్లును దక్షిణ తెలంగాణ డిస్కం తాజాగా జారీచేసింది. ఇదే కనెక్షన్‌కు గత నెల వరకూ కనీస ఛార్జీ కింద రూ.185 బిల్లు రాగా ఇప్పుడు రూ.224కి పెరిగింది. ఇలా రాష్ట్రంలో ప్రతి నెలా ఏమాత్రం కరెంటు వాడుకోకుండా కనీస ఛార్జీ కట్టే కనెక్షన్లు 50 వేలకు పైగా ఉంటున్నాయి.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన ఓ వినియోగదారుడి బిల్లు

ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన ఓ వినియోగదారుడు వాడకం తక్కువగా ఉంటుందని గతంలో ఇంటికి 1.76 కిలోవాట్‌ లోడ్‌తో కనెక్షన్‌ తీసుకున్నాడు. ప్రస్తుతం 2.98 కిలోవాట్‌ లోడ్‌ నమోదైందని అభివృద్ధి ఛార్జీ కింద రూ.2,124, సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.200 వసూలుచేస్తున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ఇలా ప్రతి కనెక్షన్‌ పరిశీలించి లోడ్‌ అధికంగా ఉంటే అభివృద్ధి ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:Private Debt Scheam: రుణవిముక్తికి నోచుకునేవారేరి.. నిరాదారణకు గురైన పథకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.