ETV Bharat / city

Chandrababu On Political Journey : 'సాధించాలనే తపన తగ్గలేదు'

author img

By

Published : Feb 26, 2022, 10:12 AM IST

Chandrababu On Political Journey : పని చేయాలి.. సాధించాలనే తపన నాలో ఇంకా తగ్గలేదన్నారు చంద్రబాబు. తన 44 ఏళ్ల రాజకీయ జీవితంలోని గత స్మృతులను.. పార్టీ నేతల సమక్షంలో గుర్తు చేసుకున్నారు. ఒక సందర్బంలో రాజకీయాలు మానేసి.. వ్యాపారం వైపు వెళ్లాలనుకున్నానని.. కానీ అప్పటి పరిస్థితుల ప్రభావంతో రాజకీయాల్లోనే ఉండాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఆర్‌, వాజ్‌పేయీ లాంటి మహా నేతలతో కలిసి పనిచేశానన్న బాబు.. "వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు నా మాటకు ఎంతో విలువిచ్చేవారు.. బాబు చెబితే అది కరెక్ట్‌ అనేవారు" అని వెల్లడించారు.

Chandrababu Political Journey
Chandrababu Political Journey

Chandrababu On Political Journey : తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గత స్మృతులను నెమరవేసుకున్నారు. 44 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 25న చంద్రబాబు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు..తన ప్రత్యర్ధి కొంగర పట్టాభిరామ చౌదరిపై గెలుపొందారు. ప్రజాప్రతినిధిగా 44 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితంలో ముఖ్యమైన సందర్భం ఏది అని పార్టీ నేతలు చంద్రబాబును ప్రశ్నించగా..అలా అని ప్రత్యేకంగా ఏదీ చెప్పలేను. పని చేయాలి..సాధించాలనే తపన మాత్రం ఇప్పటికీ తగ్గలేదని ఆయన సమాధానమిచ్చారు. పలువురు నేతలు అధినేత ప్రస్థానంపై పాత విషయాలు గుర్తు చేయగా..తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంపై చంద్రబాబు మాట్లాడారు.

Chandrababu About his Political Journey : ‘నాడు విశ్వవిద్యాలయ విద్యార్థులుగా గ్రామాలకు వెళితే ఎంతో ఆదరణ ఉండేది. నేను యూనివర్సిటీ లీడర్‌గా ఎదిగి తర్వాత అసెంబ్లీకి పోటీ చేశా. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నాకు మంత్రి పదవి కావాలని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని అడిగితే.. ఏంటి ఇంత దూకుడుగా ఉన్నావ్‌.. తొలిసారి ఎమ్మెల్యేవి..అప్పుడే మంత్రి పదవి కావాలా అని ప్రశ్నించారు. ఆ తర్వాత అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా అవకాశం వచ్చింది. ఓ సందర్భంలో పూర్తిగా వ్యాపారం వైపు వెళ్లాలనే ఆలోచన కూడా చేశా. అయితే అప్పటి పరిస్థితుల కారణంగా రాజకీయాల్లోనే కొనసాగా. నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ని కలిశా. అప్పుడు ఆయన ఓ షూటింగ్‌లో వరుడు వేషంతో ఉన్నారు’ అని నేతలకు వివరించారు.

బాబు చెబితే అది కరెక్టే అని వాజ్‌పేయీ అనేవారు..

1984లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టిన సమయంలో చాలా కీలకంగా వ్యవహరించిన విషయాన్ని నేతలు ప్రస్తావించగా..‘నా రాజకీయ ప్రయాణంలో ఎంతో మంది నేతలతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. ఎన్టీఆర్‌, వాజ్‌పేయీ లాంటి మహా నేతలతో కలిసి పనిచేశా. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు నా మాటకు ఎంతో విలువిచ్చేవారు. బాబు చెబితే అది కరెక్ట్‌ అనేవారు’ అని వెల్లడించారు. మీరు సీఎంగా ఉన్న సమయంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానాన్ని తీసుకొస్తే విమర్శలు చేశారని..ఇప్పుడు అంతటా ఇదే విధానం అవసరమొచ్చిందని నేతలు ఆయనకు గుర్తు చేశారు. చంద్రబాబుతో ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, వర్ల రామయ్య, పయ్యావుల కేశవ్‌, జనార్ధన్‌, పట్టాభి, తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.