Bride: పెళ్లయిన అరగంటకే పెళ్లిపిల్ల మాయం.. అసలేమైందంటే..?

author img

By

Published : Sep 18, 2021, 8:30 PM IST

Updated : Sep 18, 2021, 10:57 PM IST

bride

వివాహమైన అరగంటకే వధువు మాయమైంది. అదేంటనుకుంటున్నారా..? నిజమేనండి. ఈ ఘటన హైదరాబాద్​లోని పాతబస్తీలో చోటుచేసుకుంది. పెళ్లి కాగానే.. బ్యూటీ పార్లర్​కు వెళ్లొస్తానని పట్టుబట్టిన ఆ పెళ్లికూతురు మళ్లీ కనిపించలేదు. అసలు ఆ అమ్మాయి ఎటు వెళ్లిందంటే..?

పెళ్లయిన అరగంటకే పెళ్లిపిల్ల మాయం.. అసలేమైందంటే..?

పెళ్లయిన అరగంటకే వధువు మాయమైంది. కారు పార్కింగ్​ చేసేలోపే అదృశ్యమై.. అందరినీ కంగుతినేలా చేసింది. అసలు ఆ అమ్మాయి ఎలా మాయమైంది... ఎటు వెళ్లిందంటే.. ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...

హైదరాబాద్​లోని మైలార్​దేవ్​పల్లి ఠాణా పరిధిలో ఉండే సమ్రీన్(19)కు.. బెంగళూరుకు చెందిన మహ్మద్ ఇలియాస్(22)తో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం(సెప్టెంబర్​ 17) రాత్రి సమయంలో పెళ్లి ముహూర్తం. నిఖా కోసం ఇరువైపుల కుటుంబాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అనుకున్నట్టుగానే.. బాలాపూర్ ఠాణా పరిధిలో నబీల్​ కాలనీలోని ఓ ఇంట్లో... కుటుంబసభ్యుల సమక్షంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం నిఖా జరిగింది. అబ్బాయి తరఫువాళ్లు ఒప్పుకున్నట్టుగానే పెట్టుపోతలు కూడా అమ్మాయికి అప్పజెప్పారు. దాదాపు రూ.2 లక్షల విలువచేసే నగలను అమ్మాయి మెడలో వేశారు. పెళ్లికూతురుకు ఇచ్చే మెహర్​ రూ.50 వేలను వరుడే స్వయంగా అమ్మాయికి అందజేశాడు. ఈ తంతు అంతా.. కుటుంబసభ్యుల సమక్షంలో ఎంతో కోలాహలంగా సాగింది.

బ్యూటీపార్లర్​కు వెళ్లొస్తానని..

పెళ్లి తంతు ముగిసింది. అందరూ ఆనందంలో ఉన్నారు. బంధువులంతా విందులో మునిగిపోయారు. అదే సమయంలో వధువు.. పక్కనే ఉన్న బ్యూటీ పార్లర్​కు వెళ్లొస్తానని తన బంధువులతో చెప్పింది. ఈ సమయంలో బయటకు వెళ్లకూడదని పెద్దలు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. కచ్చితంగా వెళ్తానని పట్టుబట్టింది. తనను నిఖా చేసుకున్న భర్తను కూడా బతిమిలాడింది. ఎంత చెప్పినా వినేటట్టు లేదని గ్రహించిన కుటుంబసభ్యులు.. తొందరగా వెళ్లి రావాలని కారులో పంపించారు. కొంత దూరం వెళ్లాక ఇదే బ్యూటీపార్లర్​ అని చెప్పగా.. కారు ఆపారు. వెంటనే పెళ్లికూతురు ఓ ఇంటిలోకి వెళ్లింది. తోడుగా వచ్చిన వాళ్లు కారులోనే ఉన్నారు. పార్కింగ్​ చేశాక దిగుదామని ఆగారు. కారు పక్కనే పార్క్​ చేసి వచ్చి చూస్తే.. అమ్మాయి మాయం. అదేంటీ... ఇప్పుడే ఇక్కడ దిగింది.. ఇక్కడే ఉండాలి కదా... ఇంతలోనే ఎలా మాయమైంది.. ఎటు వెళ్లిపోయిందని.. వాళ్లు తలలు పట్టుకున్నారు. ఆ పరిసర ప్రాంతం అంతా వెతికినా.. లాభం లేకపోయింది.

ప్రియునితోనే వెళ్లిపోయుంటుందా..

ఇదే విషయం ఇంట్లో ఉన్న వాళ్లకు చెప్పగానే... అందరూ కంగుతిన్నారు. నిఖా జరిగిన అరగంటకే పెళ్లి కూతురు ఇలా చేయటమేంటని.. పెళ్లికొడుకుతో పాటు బంధువులంతా లబోదిబోమన్నారు. కుటుంబసభ్యులు అంతా వెతికి ఆరా తీయగా.. అసలు విషయం వెలుగు చూసింది. డబ్బు, నగలు పట్టుకుని... పెళ్లి కూతురు తన ప్రియునితో కలిసి పరారైందని తెలిసింది. విషయం తెలియగానే కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు ఎవరు..? ఎటు వెళ్లారు...? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టి.. గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated :Sep 18, 2021, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.