తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దుబ్బాక, జీహెచ్ఎంసీలో తెరాసను ఓడించి చెంప చెల్లుమనిపించారని... భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా కూకట్పల్లిలో భాజపా కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రామచందర్ రావును గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేంద్రంపై యుద్ధం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు నోరు మెదపడం లేదని విమర్శించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కేసీఆర్, కేటీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న లక్షా 90 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం లేదని ఆరోపించారు. విద్య, వైద్య రంగాలను కుదేలు చేసిన తెరాస ప్రభుత్వం... పీఆర్సీతో ఉద్యోగులను మోసం చేసిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచందర్ రావు, నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, వివేక్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జీవిత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సాగు చట్టాలపై పవార్ ట్వీట్లకు తోమర్ కౌంటర్