Bandi Sanjay on Fee Reimbursement: రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, ఉపకార వేతనాలు చెల్లించకపోవడంతో ప్రభుత్వం దాదాపు 3 వేల కోట్లు బకాయిపడినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయన్నారు.
సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించకపోవడంతో బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసినా కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ కోర్సులకు ఫీజులు ఎంత ఉంటే అంత ప్రభుత్వమే చెల్లించేదని గుర్తు చేశారు. తెరాస ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయంబర్స్ మెంట్ పథకానికి తూట్లు పొడిచిందని మండిపడ్డారు.
ఆ జీవోను సవరించాలి
10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే ఫీజులు పూర్తిగా మంజూరు చేస్తూ ఆ పై ర్యాంకు వచ్చిన వారికి 35 వేలు మాత్రమే చెల్లిస్తోందని బండి సంజయ్ తెలిపారు. దీంతో మిగిలిన ఫీజు కట్టలేక విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయంబర్స్ మెంట్, ఉపకార వేతనాలను తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ప్రభుత్వంలో మాదిరిగానే ఇంజినీరింగ్, మెడిసిన్, ఐఐటీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారికి పూర్తిగా ఫీజులు చెల్లించేలా జీవో నం.18ను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చదవండి : కేసీఆర్కు సంజయ్ లేఖ.. ఎరువులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్
కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు