ETV Bharat / city

అప్పుల మీదే నెట్టుకొస్తున్న ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం!

author img

By

Published : Aug 14, 2020, 12:42 PM IST

ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు నెలవారీ చేబదుళ్లపైనే ఆధారపడి సాగుతున్నాయి. గత 4 నెలల్లో ఏపీ సర్కార్​ ఏకంగా మూణ్నెళ్లు ఆర్​బీఐ వద్దకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్(డబ్ల్యూఎంఏ) కోసం వెళ్లింది. ఒక్క ఏప్రిల్ మినహా మార్చి నుంచి జూన్ వరకు ప్రతినెలా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు చాలా రాష్ట్రాలు ఆర్​బీఐ వద్దకు ఆచితూచి వెళ్తుంటే... రుణం కోసం అన్ని సదుపాయాలనూ ఉపయోగించుకున్న అతి కొన్ని రాష్ట్రాల్లో జాబితాలో ఏపీ కూడా చేరిపోయింది.

అప్పుల మీదే నెట్టుకొస్తున్న ఏపీ ప్రభుత్వం!
అప్పుల మీదే నెట్టుకొస్తున్న ఏపీ ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెలవారీ చేబదుళ్ల మీదే ఆధారపడి బండి లాగిస్తోంది. గత నాలుగు నెలల్లో మూడు నెలల పాటు రిజర్వు బ్యాంకు దగ్గర వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ (డబ్ల్యుఎంఏ)కు వెళ్లినట్లు తాజాగా విడుదలైన బులెటిన్‌ వెల్లడించింది. మార్చి నుంచి జూన్‌ వరకు (ఏప్రిల్‌ మినహా) ప్రతినెలా ఇదే పరిస్థితి. బడ్జెట్‌ పద్దులను చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెలా బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు సేకరిస్తాయి. ఆ పరిమితి పూర్తయ్యాక ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి రిజర్వు బ్యాంకు నుంచి స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్‌), వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ (డబ్ల్యుఎంఏ), ఓవర్‌డ్రాఫ్ట్‌ (ఓడీ) ద్వారా చేబదుళ్ల కింద డబ్బు తీసుకొని రోజువారీ ఖర్చులకు సర్దుబాటు చేసుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక అస్థిరతకు అద్దం పట్టే కొలమానాలివి. చాలా రాష్ట్రాలు ఇందులో ఒకటో, రెండో సౌకర్యాలనే ఉపయోగించుకుంటాయి. మూడింటినీ వినియోగించుకునే రాష్ట్రాలు కొన్నే ఉంటాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్‌, కేరళ ముందున్నాయి.

మూడునెలల్లో 14వేల కోట్ల రుణం

ఆర్‌బీఐ బులెటిన్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.14వేల కోట్ల స్థూల, రూ.11,667 కోట్ల నికర రుణం సేకరించింది. రుణ సేకరణ ఇలాగే ఉంటే సంవత్సరాంతానికి ఇది రూ.56 వేల కోట్లకు చేరే అవకాశం కనిపిస్తోంది. అంతకుముందు 2018-19లో రూ.30,200 కోట్లు, 2019-20లో రూ.42,915 కోట్లు సేకరించింది.


వడ్డీల భారం...

తొలుత రాష్ట్ర ప్రభుత్వాలు తమ పెట్టుబడులను పూచీకత్తుగా పెట్టి ఎస్‌డీఎఫ్‌ కింద రుణం తీసుకోవచ్చు. దీనిపై రెపోరేట్‌కు 1% తక్కువగా వడ్డీ చెల్లించాలి. తర్వాత వేస్‌ అండ్‌ మీన్స్‌ సౌకర్యంలో చేబదులు తీసుకోవచ్చు. ఇలా ఎన్ని రోజులు తీసుకుంటే అన్ని రోజులకు రెపోరేట్‌ కంటే 1% అదనంగా వడ్డీ కట్టాలి. ఈ రెండూ ఉపయోగించుకున్న తర్వాత కూడా ఆర్థిక అవసరాలు తీరని రాష్ట్రాలు ఓడీకి వెళ్తాయి. ప్రతినెలా 14 పనిదినాలపాటు ప్రభుత్వాలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. తన ఖాతాలో నిధులు లేకపోయినా ఆర్‌బీఐ ఖాతా నుంచి ఉపయోగించుకోవచ్చు. 14 రోజులకు మించి ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్తే ఆర్‌బీఐ, దాని అనుబంధ సంస్థలు ఆ రాష్ట్రానికి చేయాల్సిన చెల్లింపులను ఆపేస్తాయి.

ఆర్థిక క్రమశిక్షణ తప్పితే ఇబ్బందే..

రాష్ట్రం తీసుకొనే ఓడీ వరుసగా అయిదు రోజులు ఆ నెలలో తీసుకున్న వేస్‌ అండ్‌ మీన్స్‌ కంటే ఎక్కువ కాకూడదు. తొలిసారి ఆ హెచ్చరిక మార్క్‌ దాటితే ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి దాన్ని వేస్‌ అండ్‌ మీన్స్‌ సమాన స్థాయికి తీసుకురావాలని సూచిస్తుంది. రెండోసారి ఆ పరిస్థితి ఎదురైతే ఆ రాష్ట్రానికి 14 రోజుల వరకు వచ్చే వెసులుబాటును రద్దు చేస్తుంది. ఏ రాష్ట్రానికీ 3 నెలల్లో 36 రోజులకు మించి ఓడీ ఉపయోగించుకునే అవకాశం ఉండదు. ఆ పరిధి దాటితే చెల్లింపులు ఆపేస్తారు. ఓడీ కింద తీసుకున్న మొత్తం వేస్‌ అండ్‌ మీన్స్‌కు సమానంగా ఉంటే దానిపై రెపోరేటు కంటే 2% అధికంగా వడ్డీ వసూలు చేస్తారు. ఒకవేళ వేస్‌ అండ్‌ మీన్స్‌ కంటే ఎక్కువైతే రెపోరేట్‌పై అదనంగా 5% వడ్డీ వసూలు చేస్తారు.

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్‌ఆర్‌బీఎం కింద తీసుకున్న రుణాలు, వాటి వడ్డీ చెల్లింపులకే ఆదాయంలో చాలావరకు పోతుంది. అప్పుడు ప్రతినెలా ఎస్‌డీఎఫ్‌, వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్తే వాటిపై వడ్డీలకు మరింత చెల్లించాలి. దేశంలోని 29 రాష్ట్రాలకుగాను మార్చిలో ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మణిపుర్‌ మాత్రమే మూడు సౌకర్యాలనూ ఉపయోగించుకున్నాయి. 19 రాష్ట్రాలు వాటి జోలికే పోలేదు. ఏప్రిల్‌ ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబట్టి నాలుగు రాష్ట్రాలే దీనిపై ఆధారపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ సహా మిగిలిన 25 రాష్ట్రాలు వాటి జోలికి పోలేదు. మేలో ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌డీఎఫ్‌, డబ్ల్యుఎంఏలను ఉపయోగించుకుంది. ఆ నెలలో కేరళ తప్ప మిగిలిన రాష్ట్రాలేవీ ఓడీ వైపు వెళ్లలేదు. జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌, కేరళ మాత్రమే మూడు రుణాలకు వెళ్లాయి.

ఇదీ చదవండి: కోర్టుపై కుట్ర కోణం ఉన్నట్లు తెలుస్తోంది: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.