ETV Bharat / city

ఏఎంఆర్‌డీఏ కార్యాలయం ముట్టడికి అమరావతి రైతుల యత్నం

author img

By

Published : Aug 26, 2020, 2:24 PM IST

amaravathi formars-breaking
ఏఎంఆర్‌డీఏ కార్యాలయ ముట్టడికి అమరావతి రైతుల యత్నం

అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు కౌలు కోసం ఆందోళనకు దిగారు. విజయవాడలోని అమరావతి మహానగర ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. వారిని.. అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్‌కు తరలించారు.

ఏఎంఆర్‌డీఏ కార్యాలయ ముట్టడికి అమరావతి రైతుల యత్నం

అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు కౌలు కోసం ఆందోళనకు దిగారు. విజయవాడలోని అమరావతి మహానగర ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం చెల్లించాల్సిన వార్షిక కౌలు మొత్తం విడుదలలో తీవ్ర జాప్యం చేయడంపై నిరసన తెలిపారు. రాజధాని గ్రామాల నుంచి అమరావతి పరిరక్షణ సమితి రైతు ఐకాస ఆధ్వర్యంలో సమితి ప్రతినిధులు, రైతులు ఏఎంఆర్​డీఏ కార్యాలయం వద్దకు వస్తుండగా కొందరిని మార్గమధ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మరికొందరిని కార్యాలయం లోపలికి ప్రవేశించకుండా నిలువరించారు. ఆటోల్లోనూ, ఇతర వాహనాల్లో పోలీస్​ స్టేషన్లకు తీసుకెళ్లారు. తాము ఏఎంఆర్​డీఏ కమిషనర్‌ను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు వచ్చినా.. తమను అసలు కార్యాలయం లోపలికి వెళ్లనీయకుండా బలవంతంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని రైతులు ఆరోపించారు. మహిళలను కూడా దౌర్జన్యంగా వాహనాలు ఎక్కించారు. ఈ సమయంలో కొందరు మహిళలకు గాయాలయ్యాయి.

ఏపీ ప్రభుత్వం మాట తప్పింది...

ఏపీ ప్రభుత్వం మాట తప్పిందని... తమకు కౌలు డబ్బులు ఇస్తామని చెప్పి మూడు నెలలు గడుస్తున్నా మాట నిలబెట్టుకోక పోవడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కౌలు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. కృష్ణానది కరకట్ట, మంగళగిరి మీదుగా విజయవాడకు వచ్చే మార్గాల్లో రాజధాని ప్రాంత రైతుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై రైతులు, మహిళలు అసంతృప్తి చెందారు. కౌలు చెల్లించాలని శాంతియుతంగా నిరసన తెలియజేేయటానికి వచ్చిన తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి- దౌర్జన్యంగా స్టేషన్‌లకు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. కొందరికి త్రీటౌన్‌... మరికొందరిని సూర్యారావుపేట స్టేషన్‌కు పంపారు. పోలీసు స్టేషన్ల వద్ద కూడా మహిళలు, రైతులు తమకు ఏపీప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందంటూ నినాదాలు చేశారు.

ముందస్తు అరెస్టులు...

రైతుల ముట్టడి కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు ఏఎంఆర్​డీఏ కార్యాలయానికి వచ్చిన సీపీఎం ఏపీ కార్యదర్శి మధు, సీపీఎం విజయవాడ నగర కార్యదర్శి బాబూరావు, కాంగ్రెస్‌ నాయకురాలు సుంకరి పద్మశ్రీ తదితరులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

పోలీసుల తీరుని నిరసిస్తూ భిక్షాటన

పోలీసుల తీరును నిరసిస్తూ వెంకటపాలెం చెక్​పోస్టు వద్ద రైతులు భిక్షాటన చేశారు. సకాలంలో కౌలు డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పారు. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో తామంతా రోడ్డున పడ్డామని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కౌలు చెక్కులను విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

ఇవీచూడండి: ఆగని ఉద్ధృతి : రాష్ట్రంలో కొత్తగా 3,018 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.