ETV Bharat / city

'ఇక నుంచి ఆ వ్యాఖ్యలు కనిపించవు'.. ఏపీ హైకోర్టులో ట్విట్టర్ అఫిడవిట్

author img

By

Published : Feb 7, 2022, 6:49 PM IST

social media posts against judges case: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసుపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇక నుంచి జడ్జిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కనిపించవని ట్విట్టర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసు విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.

social media posts against judges
social media posts against judges

social media posts against judges case: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న ట్విట్టర్.. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జడ్జిలపై వ్యాఖ్యలు ఇక నుంచి కనిపించవని ట్విట్టర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అఫిడవిట్‌లో పూర్తి వివరాలు తెలిపామని కోర్టుకు తెలిపారు. అఫిడవిట్‌లో చెప్పినవి నిజమో కాదో చూడాలని న్యాయస్థానం.. సీబీఐని ఆదేశించింది. మెమో దాఖలు చేయాలని ఇరుపక్షాల న్యాయవాదులకు స్పష్టం చేసింది. కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

చర్యలపై హైకోర్టు ఆదేశాలు..

గత విచారణ సందర్భంగా సామాజిక మాధ్యమాల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తొలగించే వ్యవహారంలో సామాజిక మాధ్యమ సంస్థలు న్యాయస్థానంతో దోబూచులాడుతున్నాయని ఆక్షేపించింది. అభ్యంతరకర యూఆర్ఎల్ లను(యూనిఫాం రిసోర్స్ లొకేటర్) తొలగించాలని సీబీఐ కోరితే 36 గంటల్లో ఎందుకు తొలగించలేదని ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాద్యమ కంపెనీలపై మండిపడింది.

గతంలో తాము ఇచ్చిన ఆదేశాలకు వక్రభాష్యం చెబుతున్నాయని, సరైన స్పూర్తితో అమలు చేయడం లేదని ఆక్షేపించింది. ఫలానా పోస్టులు తొలగించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జన రల్(ఆర్బీ) లేదా కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐ కోరితే తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది. కొన్ని యూఆర్ఎల్స్ ను తొలగించలేదని సీబీఐ, తొలగించామని సామాజిక మాధ్యమ సంస్థలు చెబుతున్న నేపథ్యంలో.. ఇరువురిలో ఎవరైనా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.

కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఎన్ని యూఆర్ఎల్లను తొలగించాలని కోరారో ఆ వివరాలను సామాజిక మాధ్యమాలకు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఎన్ని తొలగించారు..? మిగిలినవి తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ వేయాలని ట్విటర్, యూట్యూబ్, ఫేస్​బుక్​లను ఆదేశించింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.