ETV Bharat / business

భారత వృద్ధి రేటును 7.5 శాతానికి తగ్గించిన ప్రపంచ బ్యాంక్‌

author img

By

Published : Jun 8, 2022, 5:11 AM IST

World Bank India GDP: భారత వృద్ధి రేటు అంచనాలను 7.5శాతానికి తగ్గించింది ప్రపంచ బ్యాంకు. 2023-24లో వృద్ధిరేటు మరింత నెమ్మదించి 7.1 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 2021-22లో జీడీపీ వృద్ధి 8.7 శాతంగా నమోదవ్వడం గమనార్హం.

World Bank reduced India's GDP forecast to 7.5 percent
భారత వృద్ధి రేటును 7.5 శాతానికి తగ్గించిన ప్రపంచ బ్యాంక్‌

India's GDP forecast: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు మరోమారు తగ్గించింది. 8.7 శాతం వృద్ధిరేటు లభిస్తుందని ఈ ఏడాది జనవరిలో అంచనా వేసిన ప్రపంచబ్యాంక్‌, దానిని 8 శాతానికి సవరిస్తున్నట్లు ఏప్రిల్‌లో పేర్కొంది. వృద్ధిరేటు అంచనాలను 7.5 శాతానికి పరిమితం చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంటే జనవరి నాటి తొలి అంచనాలతో పోలిస్తే వృద్ధిరేటు అంచనాలను 1.2 శాతం మేర ప్రపంచ బ్యాంక్‌ తగ్గించినట్లయ్యింది. 2023-24లో వృద్ధిరేటు మరింత నెమ్మదించి 7.1 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 2021-22లో జీడీపీ వృద్ధి 8.7 శాతంగా నమోదవ్వడం గమనార్హం.

ఆటంకాలు: కొవిడ్‌ పరిణామాల నుంచి కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు అధిక ద్రవ్యోల్బణం, సరఫరా అవరోధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవరోధాలు ఏర్పడొచ్చని ప్రపంచ బ్యాంక్‌ వివరించింది. 2022 ప్రథమార్ధంలో కొవిడ్‌ కేసుల విస్తృతి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ద్రవ్యోల్బణం పెరగడం ఇబ్బంది పెట్టింది. తక్కువ వేతనాలు లభించే ఉద్యోగాలే అధికంగా లభిస్తున్నాయి.

సానుకూలతలు: ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడులు పుంజుకోవడం, వ్యాపార పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు-సంస్కరణలు వంటివి వృద్ధికి కొంత మేర ఉపకరిస్తాయని వివరించింది. మౌలిక వసతులపై ప్రభుత్వం అధికంగా దృష్టి పెట్టడం, పనిచేయని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం కలిసి వస్తుందని పేర్కొంది.
ప్రపంచ వృద్ధీ అంతంతే: ప్రపంచ వృద్ధిరేటు కూడా ఈ సంవత్సరం 2.9 శాతానికి తగ్గే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. 2021లో నమోదైన 5.7 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ప్రపంచ వృద్ధి 4.1 శాతంగా నమోదుకావచ్చని ఈ ఏడాది జనవరిలో ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేయడం గమనార్హం.

రెపో రేటు 0.25- 0.5% పెంపు!
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా రెపోరేటును 25-50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం లక్షిత స్థాయి కంటే అధికంగా ఉంటున్నందున ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. నేడు ఉదయం 10 గంటలకు ద్రవ్యపరపతి కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించనున్నారు. నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది.

ఇదీ చదవండి: సామాన్యుడా.. వడ్డీల మోతకు సిద్ధమవ్వు! ఈఎంఐలు మరింత భారం!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.