ETV Bharat / business

పాన్-ఆధార్ లింక్​ గడువు పొడిగింపు.. ఎప్పటివరకు అంటే..

author img

By

Published : Mar 28, 2023, 3:19 PM IST

Updated : Mar 28, 2023, 4:45 PM IST

పాన్​ కార్డు, ఆధార్ కార్డు అనుసంధాన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. చివరి సారిగా పెంచిన గడువు మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. 2023 జూన్​ 30లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపింది.

Pan Aadhar link decline extended
Pan Aadhar link decline extended

పాన్ కార్డుతో ఆధార్ నంబర్ లింక్ చేసుకునేందుకు గడువును మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. గతంలో 2023 మార్చి 31గా ఉన్న గడువును 2023 జూన్​ 30 వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జులై 1వ తేదీలోగా తమ ఆధార్​ను పాన్​తో లింక్​ చేయని వారి పాన్​కార్డ్​ పనిచేయదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 51 కోట్లకు పైగా పాన్‌కార్డ్​లు ఆధార్‌తో అనుసంధానమైనట్లు తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాన్ కార్డ్​ను ఆధార్​తో లింక్​ చేయని వారికి మరో మూడు నెలల గడువు లభించింది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆధార్ నంబర్‌ను 2023 మార్చి 31లోగా పాన్ కార్డుకు లింక్ చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. ప్రస్తుతం ఈ పాన్​- ఆధార్​ లింక్​ గడువును 2023 జూన్ 30 వరకు పొడిగించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఆధార్ నంబర్​ను లింక్ చేయని పాన్ కార్డులు ఇక పనిచేయవని హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. పాన్ కార్డ్ పనిచేయకపోతే పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అలాంటి పాన్ కార్డ్ హోల్డర్స్​కు సంబంధించి.. గతంలో ఏవైనా రీఫండ్స్ రావాల్సి ఉంటే వాటిని చెల్లించరని తెలిపింది సీబీడీటీ. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం టీడీఎస్, టీసీఎస్​ను ఎక్కువగా వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. రూ.1,000 జరిమానా చెల్లించి పాన్, ఆధార్ లింక్ చేస్తే 30 రోజుల్లో పాన్ కార్డ్ యాక్టివ్ అవుతుందని సీబీడీటీ తెలిపింది.

పాన్‌- ఆధార్‌కు 2020 మార్చి 31ను తొలుత గడువుగా పేర్కొన్నారు. తర్వాత దాన్ని 2020 జూన్‌ 30కి, ఆ తర్వాత 2021 మార్చి 31కి, అనంతరం పలు దఫాలుగా గడువును పొడిగిస్తూ వచ్చిన కేంద్రం.. ఈ ఏడాది జూన్‌ 30లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటి వరకూ పాన్​-ఆధార్​ లింక్​ చేయని వారు రూ.1000 చెల్లించి.. ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అయితే పాన్​ కార్డును ఆధార్​ నంబర్​తో ఎలా లింక్​ చేయాలో తెలుసుకుందామా..!

  • ముందుగా onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • NON-TDS/TCS ఆప్షన్​లో CHALLAN NO./ITNS 280 పైన క్లిక్ చేసి Proceed పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత కంపెనీలకు అయితే కార్పొరేట్ ట్యాక్స్, వ్యక్తిగతంగా అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ అనే ఆప్షన్​ను సెలెక్ట్ చేయాలి.
  • Type of Payment ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత పాన్ కార్డ్ వివరాలు సెలెక్ట్ చేయాలి.
  • అసెస్‌మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసి అడ్రస్ పూర్తి చేయాలి.
  • ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేయాలి.

మీరు పేమెంట్ పూర్తి చేసిన 4 నుంచి 5 రోజుల​ తర్వాత ఆదాయపు పన్ను శాఖ రికార్డ్స్‌లో మీ వివరాలు అప్‌డేట్ అవుతాయి. ఆ తర్వాత ఈ-ఫైలింగ్ పోర్టల్‌ ఓపెన్ చేసి అందులో పాన్​ కార్డును ఆధార్​తో లింక్ చేయాలి.

  • దీనికోసం ముందుగా www.incometax.gov.in వెబ్​సైట్​ ఓపెన్​ చేయాలి.
  • వెబ్​సైట్ ఓపెన్​ అయ్యాక.. హోమ్ పేజీలో Link Aadhaar పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి.. Validate పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీరు చేసిన పేమెంట్ వివరాలు వెరిఫై అయినట్టు చూపిస్తుంది.
  • ఆ తర్వాత Continue పైన క్లిక్ చేయాలి.
  • ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు ఎంటర్ చేయాలి.
  • పేరు ఎంటర్​ చేశాక మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.
  • మీ ఫోన్​కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి Validate చేస్తే.. మీ పాన్ కార్డ్​కు, ఆధార్ నంబర్ లింక్ అవుతుంది.

పైన తెలిపిన విధంగా.. మీరు మీ పాన్​ కార్డ్​ను ఆధార్ నంబర్​తో లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పాన్​-ఆధార్ లింక్​ చేశారో లేదో గుర్తులేకపోతే.. ఇదే పోర్టల్​లో 'లింక్​ ఆధార్​ స్టేటస్'పై క్లిక్​ చేసి తెలుసుకోవచ్చు.

Last Updated :Mar 28, 2023, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.