ETV Bharat / business

'సినిమాల్లో ఆర్​ఆర్​ఆర్.. బిజినెస్​లో భారత్​.. రికార్డులే రికార్డులు!'

author img

By

Published : Apr 3, 2022, 7:05 PM IST

India exports 2022: ఆర్​ఆర్​ఆర్​ సినిమాలాగే భారత ఆర్థిక వ్యవస్థ రికార్డులు బద్దలు కొడుతుందన్నారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్​ గోయల్​. 2021-22 ఆర్థిక ఏడాదిలో భారత ఎగుమతులు 418 బిలియన్​ డాలర్లకు చేరిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలోనే ఈస్థాయిలో ఎగుమతులు ఎప్పుడూ జరగలేదన్నారు.

India exports 2022
పీయూష్​ గోయల్​, ఎగుమతులు

India exports 2022: రాజమౌళి దర్శకత్వంలో రామ్​చరణ్​, ఎన్టీఆర్​ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆర్​ఆర్​ఆర్​ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఆ సినిమాలాగే భారత ఆర్థిక వ్యవస్థ రికార్డులపై రికార్డులు బద్దలు కొడుతుందన్నారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్​ గోయల్​. ఆర్​ఆర్​ఆర్​ సినిమా కలెక్షన్లతో భారత ఎగుమతులను పోల్చారు. 2021-22 ఆర్థిక ఏడాదిలో భారత ఎగుమతులు 418 బిలియన్​ డాలర్లు దాటాయని, అది గతేడాదితో పోలిస్తే 5 శాతం అధికమని పేర్కొన్నారు. కొవిడ్​-19 ప్రతికూలతలు ఉన్నా భారత్​ మెరుగైన పనితీరును కనబరిచిందని కొనియాడారు. దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన గోయల్​ ఆర్​ఆర్​ఆర్​ చిత్రం రూ.750 కోట్లు వసూలు చేయటంపై ప్రశంసించారు.

"దేశ చరిత్రలో తొలిసారి 418 బిలియన్​ డాలర్లకుపైగా ఎగుమతులు జరిగాయి. కొవిడ్​ ఉన్నప్పటికీ లక్ష్యానికి 5 శాతం అధికంగా సాధించాం. ఒక్క మార్చిలోనే 40 బిలియన్​ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆర్​ఆర్​ఆర్​ చిత్రం రూ.750 కోట్లు వసూళ్లతో దేశంలోనే అతిపెద్ద సినిమాగా నిలిచినట్లు తెలిసింది. అదే విధంగా భారత ఆర్థిక వ్యవస్థ సైతం రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుందని భావిస్తున్నా."

- పీయూష్​ గోయల్​, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి.

ఇటీవల భారత సరకుల ఎగుమతుల్లో భారీగా వృద్ధి కనిపించింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్​ను విస్తరించుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవలే యూఏఈ, ఆస్ట్రేలియాతో కీలక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది భారత్​. ఇజ్రాయెల్​, ఐరోపా సమాఖ్య, బ్రిటన్​తో చర్చలు కొనసాగుతున్నాయి. 2022 చివరి నాటికి పలు ఒప్పందాలు పూర్తవుతాయని కొద్ది రోజుల క్రితం పీయూష్​ గోయల్​ పేర్కొన్నారు. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్, రత్నాలు, ఆభరణాలు, రసాయనాలు, ఔషధాలను భారత్​ ఎక్కువగా ఎగుమతి చేసింది. భారత్​ ఎగుమతుల్లో ఎక్కువ భాగం అమెరికా, అరబ్ ఎమిరేట్స్, చైనా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్​కు చేరాయి.

ఆత్మనిర్భర్​లో కీలక మైలురాయి: భారత దేశ సరకుల ఎగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 418 బిలియన్​ డాలర్లకు చేరటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆత్మనిర్భర్​ భారత్​ ప్రయాణంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత సరకుల ఎగుమతులు ఏప్రిల్​ 2021-ఫిబ్రవరి 2022లో 374.05 బిలియన్​ డాలర్లుగా ఉన్నాయి. ఏప్రిల్​2020-ఫిబ్రవరి 2021లోని 256.55 బిలియన్​ డాలర్లతో పోలిస్తే 45.80 శాతం అధికం. అలాగే ఏప్రిల్​ 2019-ఫిబ్రవరి 2020లోని 291.87 బిలియన్​ డాలర్లతో పోలిస్తే 28.16 శాతం అధికం.

భారత వృద్ధి రేటు 7.4 శాతం: 2022-23 ఆర్థిక ఏడాదిలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ. రష్యా-ఉక్రెయిన్​ సంక్షోభంతో ధరల పెరుగుదల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల పునరుద్ధరణకు అతిపెద్ద సవాలుగా పేర్కొంటూ ఎకనామిక్​ ఔట్​లుక్​ సర్వేను విడుదల చేసింది. 2022 రెండో అర్ధభాగంలో కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచనుందని అంచనా వేసింది. ఈ ఆర్థిక ఏడాది చివరి నాటికి రెపో రేటు 50-75 బేసిస్​ పాయింట్లు పెంచే వీలుందని పేర్కొంది. ఏప్రిల్​లో జరిగే సమీక్షా సమావేశంలో రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ ఆర్థిక పునరుద్ధరణకు మద్దతుగా నిలవనుందని తెలిపింది.

ఇదీ చూడండి: 'ఆ ఒప్పందంతో.. ఏడేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.