ETV Bharat / business

వరదల్లో పాడైన వాహనాలకు బీమా వర్తిస్తుందా?

author img

By

Published : Jul 23, 2022, 12:30 PM IST

కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక వాహనాలు వరద నీటిలో చిక్కుకొని పాడయ్యాయి. ఫలితంగా ఇప్పుడవి పనిచేయక సర్వీసింగ్​ సెంటర్లకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ.. అక్కడికి వెళ్తే ఎంత ఖర్చవుతుందోననే భయం చాలా మందిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు బీమా వైపు చూస్తుంటారు. అయితే.. పాడైన వాహనాలకు బీమా వర్తిస్తుందా? ఏయే పాలసీలు ఎలాంటి కవరేజీ అందిస్తాయనే విషయాలు మీకోసం..

damaged vehicles on floods
వాహనాలకు బీమా

తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు వేల సంఖ్యలో కాలనీలు జలమయ్యాయి. ఇంటి ముందు పార్క్ చేసిన చాలా కార్లు నీటిమునిగాయి. ఇంకొన్ని బురదలో చిక్కుకున్నాయి. అయితే నీళ్లు తగ్గాక వాహనాలను సర్వీస్ సెంటర్లకు తీసుకెళ్తున్నారు యజమానాలు. వీటి రిపేరుకు భారీగా డబ్బు వెచ్చించాల్సి వస్తోందని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ వాహనాలకు బీమా వర్తిస్తుందా? లేదా? అనేది వాహనాదారుల మదిని తొలుస్తున్న ప్రశ్న. ఒకవేళ బీమా వర్తిస్తే ఏ మేరకు ఉపశమనం కలుగుతుంది? అసలు కారు మామూలు రీతికి వస్తుందా అనేది ఇప్పుడు వాటి యజమానులను వేధిస్తోన్న ప్రశ్నలు.

సాధారణంగానే వాహనాలకు సంబంధించి చిన్న చిన్న రిపేర్లకు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం వరదల వల్ల కార్లలో చాలా భాగాలు పాడైపోయే ఆస్కారం ఉంది. వరదలు ప్రారంభమైనప్పటి నుంచి సర్వీస్ సెంటర్లకు.. నీటిలో మునిగిన వాహనాలే ఎక్కువగా వస్తున్నాయి. 95 శాతానికి పైగా వాహనాలు వరదల్లో మునిగినవి లేక వరదల వల్ల దెబ్బతిన్నవే ఉంటున్నాయని సర్వీస్ సెంటర్ల ప్రతినిధులు చెబుతున్నారు. వీటికి సంబంధించి రిపేరు, సర్వీసింగ్​కు కూడా చాలా సమయం పడుతోంది. ఒకేసారి భారీగా వాహనాలు సర్వీస్ సెంటర్ల వద్ద క్యూ కట్టడం వల్ల ఇలా జరుగుతోందని వారు చెబుతున్నారు. వాహనం నీటిలో మునిగిన తీరు ఆధారంగా కొన్ని వర్గీకరణలు చేశారు సర్వీస్ సెంటర్ల నిర్వాహకులు.

వర్గీకరణలు ఇలా..: మొత్తం నీటిలో మునిగిన వాహనాన్ని సీ కేటగిరీగా, సీట్ స్థాయి వరకు మునిగిన వాహనాన్ని బీ కేటగిరీగా, కార్పెట్ వరకు మునిగిన వాహనాన్ని ఏ కేటగిరీగా విభజిస్తున్నారు. ఎక్కువగా సీ కేటగిరీ వాహనాలే సర్వీస్ సెంటర్లకు చేరుతున్నాయి. బీమా సంస్థలను సంప్రదించి, క్లెయిమ్​ను పరిగణనలోకి తీసుకొని రిపేర్, సర్వీసింగ్ పూర్తి చేయటానికి సమయం పడుతోంది. ఏ కేటగిరీ వాహానం 3 నుంచి 5 రోజులు, బీ కేటగిరీ వాహనాలకు దాదాపు 3 వారాలు, సీ కేటరిగీ వాహనాలకు ఇంకా ఎక్కువ సమయం పడుతున్నట్లు సర్వీస్ సెంటర్ల ప్రతినిధులు చెబుతున్నారు.

బీమాల్లో రకాలెన్ని..?: వాహనాల్లో చిన్న చిన్న రిపేర్లకే చాలా ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు వరదల వల్ల వాహనాల్లో ఎలాంటి డ్యామేజీ జరిగింది? ఎంత వరకు ఖర్చువుతుంది? బీమా క్లెయిమ్ అవుతుందా? లేదా? అన్నది వాహనదారులను కలవరపెడుతోంది. వాహనదారులు తీసుకున్న బీమాను బట్టి క్లెయిమ్ అవుతోందని వాహన బీమా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వాహనానికి సంబంధించి బీమాలో పలు రకాలుంటాయి.

మొదటికి థర్ట్ పార్టీ. ఈ బీమాలో వాహన డ్యామేజీకి సంబంధించి ఎలాంటి బీమా ఉండదు. ఇది కేవలం వాహనం వల్ల ఇతరులకు, ఇతర వాహనాలకు కలిగిన డ్యామేజీకి మాత్రమే వర్తిస్తుంది. బీమా రెగ్యులేటరీ ప్రకారం రోడ్డుపై తిరిగే ఏ వాహనానికైనా థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. దీనితో దాదాపు అన్ని వాహనాలపై థర్డ్ పార్టీ బీమా ఉంటుంది.

రెండో రకం కాంప్రహెన్సివ్ బీమా. ఇందులో థర్డ్ పార్టీతో పాటు వాహన డ్యామేజీ నష్టానికి సంబంధించి బీమా ఉంటుంది. వాహన వయస్సు పెరుగుతున్న కొద్ది దాని విలువ క్షీణిస్తుంది. తగ్గిన విలువ ఆధారంగా కాంప్రహెన్సివ్ బీమాలో కవరేజీ ఉంటుంది. జీరో డిప్ అనేది మరో పాలసీ. ఇందులో వాహన భాగాలపై విలువ తగ్గింపును పరిగణనలోకి తీసుకోకుండా వంద శాతం విడిభాగాల విలువకు కవరేజీ ఉంటుంది. కాంప్రహెన్సివ్, జీరో డిప్​లో ఇంజిన్‌కు బీమా ఉండదు.

చట్టపరంగా తప్పనిసరైన థర్డ్ పార్టీ బీమాతోనే కొంత మంది వాహనాలను నడిపిస్తుంటారు. వీరి వాహనాలు వరద నీటిలో మునిగిపోయినట్లైతే.. సొంత ఖర్చుతో వాటిని రిపేరు చేయించుకోవాల్సిందే. సాధారణంగా చాలా మంది వాహనాలపై కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకుంటారు. కొంత కాలంగా జీరో డిప్ పాలసీలు తీసుకోవటం ప్రారంభమైనప్పటికీ.. రోడ్లపై ఉన్న వాహనాల్లో తక్కువ వాహనాలకు మాత్రమే జీరో డిప్ పాలసీలు ఉండే అవకాశం ఉన్నట్లు వాహన ప్రతినిధులు చెబుతున్నారు.

ఇంజిన్​ ఖర్చు వారిదే..: కాంప్రహెన్సివ్ బీమా ఉన్న వారి వాహనం వరదల్లో పాడైతే.. కేవలం విడి భాగాలపై 20 నుంచి 40 శాతం తక్కువ మొత్తం క్లెయిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. జీరో డిప్ ఉన్న వాహనాలకు విడిభాగాలపై పూర్తిగా బీమా వస్తుంది. ఇంజిన్ ప్రొటెక్షన్ ఉన్న వారికి ఇంజిన్​కు సంబంధించి కూడా రిపేరు ఖర్చులను బీమా సంస్థలే భరిస్తాయి.

వాహనం పార్క్ చేసి ఉంచినప్పుడు ఇంజిన్​లోకి నీరు ప్రవేశించదని సర్వీస్ సెంటర్ల వాళ్లు చెబుతున్నారు. ఒకవేళ దాన్ని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లైతే ఇంజిన్​లోకి నీరు చేరుతుందని, దాని వల్ల ఇంజిన్ డ్యామేజీ అవుతుందని వారు అంటున్నారు. సాధారణంగా ఇంజిన్​కు సంబంధించి రిపేరు ఖర్చులు భారీగా ఉంటాయి. బురదలో కూరుకుపోయినా, వరద నీటిలో చిక్కుకున్నా.. బయటకు తీసిన వెంటనే వాహనాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేయకూడదు. వీలైనంత త్వరగా వాహనాన్ని సర్వీస్ సెంటర్​కు తీసుకెళ్లాలి. అక్కడ బీమా క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పాలసీకి అనుగుణంగా బీమా కంపెనీలు క్లెయిమ్ అందిస్తాయి. ఇంజిన్ ప్రొటెక్షన్ ఉన్న వారికి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇంజిన్ డ్యామేజీకి సంబంధించి బీమా క్లెయిమ్ అవుతుంది. కాంప్రహెన్సివ్ బీమా, జీరో డిప్ ఉన్న వారు వాహనాన్ని స్టార్ట్​ చేయకుండానే సర్వీస్ సెంటర్​కు తీసుకెళ్లినట్లైతే ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చు.

ఇవీ చదవండి: 'రూపాయి బలంగానే ఉంది.. ఇతర దేశాల కరెన్సీల కంటే మనదే బెటర్​'

'ఇక పొడిగించేది లేదు.. అదే డెడ్​లైన్'.. ఐటీఆర్‌ గడువుపై కేంద్రం క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.