ETV Bharat / business

ఏసీలు, ఎల్​ఈడీల ఉత్పత్తి.. ఇక పూర్తిగా దేశీయంగానే!

author img

By

Published : Sep 17, 2021, 7:49 PM IST

దేశీయంగా పూర్తి స్థాయిలో ఏసీలు, ఎల్​ఈడీల విడి భాగాల ఉత్పత్తికి.. 52 కంపెనీలు రూ.5,800 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల రంగానికి(White Goods PLI Scheme) కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వినియోగించుకుని ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయి.

ACs manufacturing in India rise soon
ఏసీల ఉత్పత్తికి జోరు

ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ రంగం బలోపేతం కోసం ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి(పీఎల్​ఐ).. భారీ స్పందన లభించింది. ఈ పథకం ద్వారా ప్రోత్సాహకాలను వినియోగించుకుని.. వివిధ ఉత్పత్తుల తయారీకి 52 కంపెనీలు ముందుకొచ్చాయి. ఆయా కంపెనీలన్నీ రూ.5,800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి.

ఏసీలు, ఎల్​ఈడీ బల్బుల విడిభాగాల దేశీయ ఉత్పత్తికి గానూ ఈ 52 కంపెనీలు.. ఈ మొత్తం పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఈ జాబితాలో ప్రపంచ స్థాయి దిగ్గజాలతో పాటు.. పలు దేశీయ సంస్థలు కూడా ఉన్నాయి.

ప్రముఖ కంపెనీలు..

డైకిన్, పానసోనిక్​, హిటాచీ, మెట్​ట్యూబ్​, నైడెక్​, ఓల్టాస్​, బ్లాస్టర్​, హావెల్స్​, అంబేర్​, ఈపాక్, టీవీఎస్​ ల్యూకస్​, డిక్షన్​, ఆర్​ కే లైటింగ్​, యూనీ గ్లోబస్​, రాధికా ఆప్టో, సిస్కా వంటి కంపెనీలు ఇందులో ప్రముఖంగా ఉన్నాయి.

ఈ కంపెనీలన్నీ రానున్న ఐదేళ్లలో రూ.2.71 లక్షల కోట్ల విలువైన విడిభాగాలను ఉత్పత్తి చేయొచ్చని అధికారిక అంచనా.

ఏ రంగంలో ఎన్ని కంపెనీలు?

మొత్తం మీద 31 కంపెనీలు ఏసీల విడిభాగాల ఉత్పత్తి కోసం.. రూ.5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తమ దరఖాస్తులో పేర్కొన్నాయి. ఎల్​ఈడీ బల్బుల విడిభాగాల ఉత్పత్తి కోసం 21 కంపెనీలు రూ.871 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి.

ఉత్పత్తులు ఇవే..

ఏసీలకు సంబంధించి కాపర్ ట్యూబ్స్​, డిస్​ప్లే యూనిట్స్​, బీఎల్​డీసీ మోటార్స్​ వంటి వాటిని ఉత్పత్తి చేసేందుకు ఆయా కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి.

ఎల్​ఈడీ బల్బుల విషయానికొస్తే.. ఎల్​ఈడీ డ్రైవ్స్​, ఎల్​ఈడీ ఇంజిన్స్​, ఎల్​ఈడీ లైట్ మేనేజ్​మెంట్ సిస్టమ్,​ పీసీబీ వంటి కాంపొనెంట్లు ప్రముఖంగా ఉన్నాయి.

పీఎల్​ఐ పథకం గురించి..

ఎలక్ట్రానిక్​ విడిభాగాల ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.6,238 కోట్లతో ఈ ఏడాది ఏప్రిల్​లో పీఎల్​ఐ పథకాన్ని ప్రకటించింది కేంద్రం. ఈ పథకం కింద ప్రోత్సహకాలు పొందాలనుకునే కంపెనీలు ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించేందుకు సెప్టెంబర్​ 15ను తుది గడువుగా నిర్ణయించింది. ఇటీవల ఈ గడువు ముగిసిన నేపథ్యంలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. ఆయా కంపెనీల దరఖాస్తులను పరిశీలించి.. రెండు నెలల్లోపు తుది నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.

వాటికి మాత్రమే ప్రోత్సాహకాలు..!

'దేశీయంగా ఏ విడిభాగాల ఉత్పత్తి తగినంతగా లేదో వాటిని తయారు చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీలను ఈ పథకం కింద ఎంపిక చేయనున్నా'మని అధికారిక వర్గాలు గతంలోనే వెల్లడించాయి. పూర్తిగా తయారైన ఉత్పత్తులకు ఈ పథకం వర్తించదని కూడా స్పష్టం చేశాయి.

ఈ పథకం కింద ఎంపికైన కంపెనీలకు.. అమ్మకాల్లో ఐదేళ్ల వరకు 4 శాతం నుంచి 6 శాతం వరకు ప్రోత్సహాకాలు ఇవ్వనుంది కేంద్రం. ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి ఈ రంగంలో ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పథకం అమలుతో ఉత్పత్తి ప్రారంభమైతే.. ఈ రంగంలో రానున్న రెండేళ్లలో దేశీయ ఉత్పత్తి విలువ ప్రస్తుతం ఉన్న 15-20 శాతం నుంచి 75-80 శాతానికి పెరగొచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది.

ఇదీ చదవండి: ర్యాంకుల కోసం చైనా అక్రమాలు- వరల్డ్ బ్యాంక్ సంచలన నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.