ETV Bharat / business

భారత్, చైనా ఉద్రిక్తతలతో కుప్పకూలిన మార్కెట్లు

author img

By

Published : Aug 31, 2020, 3:41 PM IST

stocks
స్టాక్ మార్కెట్లు

ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్​ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. భారత్​, చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయన్న వార్తలతో మదుపరులు ఉలిక్కిపడ్డారు. సెన్సెక్స్ 839 పాయింట్లు, నిఫ్టీ 305 పాయింట్లు పతనమయ్యాయి.

భారత్​- చైనా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణ వాతావరణంతో స్టాక్​ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో వచ్చిన లాభాలన్నీ ఆవిరైపోయాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 839 పాయింట్లు పడిపోయి 38,628 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 305 పాయింట్లు కోల్పోయి 11,342 పాయింట్లకు చేరింది.

లాభ నష్టాల్లో..

ఓఎన్​జీసీ, టీసీఎస్ మినహా అన్ని కంపెనీల సూచీలు నష్టపోయాయి. ఎస్​బీఐ, సన్​ఫార్మా, బజాజ్​ ఫైన్​సర్వ్​, బజాజ్ ఫైనాన్స్, కొటక్​ బ్యాంక్​ షేర్లు 5 శాతం మేర పడిపోయాయి.

భారత్​, చైనా ఉద్రిక్తతలతో పాటు గతవారం వచ్చిన లాభాలను సొమ్ము చేసుకునేందుకు మదుపరులు మొగ్గు చూపటమూ మార్కెట్లపై ప్రభావం చూపింది.

రూపాయి మారకం విలువ కూడా 21 పైసలు పడిపోయి డాలర్​తో పోలిస్తే 73.60కి చేరింది.

పాంగాంగ్​లో ఉద్రిక్తతలు..

ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ పాంగాంగ్‌ సరస్సు వద్ద గల వాస్తవాధీన రేఖ వెంట సైనిక కార్యకలాపాల్ని మళ్లీ ప్రారంభించింది. తద్వారా భారత సైన్యాన్ని రెచ్చగొట్టేందుకు యత్నించిందని సైనిక వర్గాలు తెలిపాయి. చైనా కుట్రలను ముందుగానే పసిగట్టిన మన బలగాలు వారి దుశ్చర్యలను దీటుగా తిప్పికొట్టినట్లు వెల్లడించాయి. ఆగస్టు 29-30 మధ్యరాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలిపాయి.

ఇదీ చూడండి: హద్దు మీరిన చైనా- గట్టిగా బదులిచ్చిన భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.