ETV Bharat / business

దలాల్ స్ట్రీట్​పై కరోనా పంజా- సెన్సెక్స్​ 1448 పాయింట్లు పతనం

author img

By

Published : Feb 28, 2020, 3:43 PM IST

Updated : Mar 2, 2020, 8:57 PM IST

కరోనా భయాలతో నేడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్​, నిఫ్టీ.. రెండో అత్యధిక స్థాయి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్​ 1,448, నిఫ్టీ 431.55 పాయింట్లు పతనమయ్యాయి.

stock market
స్టాక్ మార్కెట్

వారాంతపు సెషన్​లో స్టాక్​ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. ఐదు నెలల కనిష్ఠానికి సూచీలు జారుకున్నాయి. కరోనా వైరస్​ ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది.

2015 ఆగస్టు 24 తర్వాత ఆ స్థాయిలో నేడు మార్కెట్లు నష్టపోయాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 1,448 పాయింట్లు కోల్పోయి 38, 297 పాయింట్లకు చేరుకుంది. 431.55 పాయింట్లు నష్టపోయిన జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ.. 11,202 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జీడీపీ ప్రభావమూ..

ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలకు తోడు నేడు విడుదల కానున్న 2019-20 మూడో త్రైమాసికం జీడీపీ గణాంకాలపై ప్రతికూల అంచనాలు.. మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి.

రూ.5 లక్షల కోట్లు ఆవిరి..

భారీ నష్టాలతో బీఎస్​ఈ మదుపరుల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరైంది.

టాటా స్టీల్ 8 శాతానికిపైగా నష్టపోయింది. బజాజ్​ ఫినాన్స్, టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా నష్టపోయాయి. దాదాపు అన్ని కంపెనీలు నష్టాల్లోనే ఉన్నాయి.

విమానయానం, ఆటో షేర్లు కుదేలు..

కరోనా నేపథ్యంలో విమానయాన సంస్థలకు ప్రతికూల రేటింగ్​ (నెగెటివ్)ను కొనసాగిస్తున్నట్లు 'ఇక్రా' ప్రకటించింది. ఈ కారణంగా విమానయాన సంస్థల షేర్లు దాదాపు 10 శాతం మేర నష్టాల్లోకి జారుకున్నాయి.

స్టాక్​ మార్కెట్లలో వాహన రంగ షేర్లు కుదేలయ్యాయి. కరోనా ప్రభావంతో సరఫరా వ్యవస్థ నిలిచిపోవటం వల్ల ఆటో షేర్లు 9 శాతం పడిపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

కరోనా దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు 4 శాతం మేర పడిపోయాయి. ఆసియాలో షాంఘై 3.71 శాతం, జపాన్​ 3.67 శాతం, హాంకాంగ్​ 2.42 శాతం, దక్షిణ కొరియా 3.30 శాతం పతనమయ్యాయి.

Last Updated :Mar 2, 2020, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.