ETV Bharat / business

కరోనాతో బంగారానికి డిమాండ్ డౌన్- కానీ...

author img

By

Published : Oct 29, 2020, 1:57 PM IST

కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో పసిడికి ఇటు దేశీయంగా, అటు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ భారీగా తగ్గింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) ప్రకారం 2020 మూడో త్రైమాసికంలో దేశీయంగా పసిడి డిమాండ్ 30 శాతం పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 19 శాతం క్షీణించింది. 2019 తర్వాత ఈ స్థాయిలో పసిడి డిమాండ్ తగ్గటం ఇదే ప్రథమం.

COVID-19 hits India's gold-buying sentiment
దేశంలో భారీగా తగ్గిన బంగారం డిమాండ్

దేశంలో పసిడి డిమాండ్ భారీగా తగ్గింది. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 30 శాతం తగ్గి 86.6 టన్నులకు పరిమితమైందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలో వెల్లడించింది. కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు, రికార్డు స్థాయికి చేరిన ధరలు ఇందుకు కారణంగా తెలిపింది.

2019 మూడో త్రైమాసికంలో దేశీయ పసిడి డిమాండ్ 123.9 టన్నులుగా నమోదవ్వటం గమనార్హం.

కరెన్సీ విలువ పరంగా చూస్తే దేశీయ పసిడి డిమాండ్ 2020 క్యూ3లో 4 శాతం తగ్గి.. రూ.39,510 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో ఇది రూ.41,300 కోట్లుగా ఉండటం గమనార్హం.

దేశీయంగా బంగారు నగలకు డిమాండ్ 2020 క్యూ3లో ఏకంగా 48 శాతం తగ్గి 52.8 టన్నులకు (రూ.24,100కు సమానం) పడిపోయింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ డిమాండ్ 101.6 టన్నులుగా(రూ.33,850 కోట్లకు సమానం) ఉంది.

ప్రపంచవ్యాప్తంగానూ తగ్గిన డిమాండ్..

ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం డిమాండ్ ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 19 శాతం తగ్గి.. 892.3 టన్నులకు పరిమితమైందని డబ్ల్యూజీసీ పేర్కొంది. 2019 మూడో త్రైమాసికంలో పసిడి డిమాండ్ 1,100.2 టన్నులుగా ఉంది.

2009 తర్వాత ప్రపంచ పసిడి డిమాండ్ ఈ స్థాయిలో తగ్గటం ఇదే ప్రథమమని డబ్ల్యూజీసీ పేర్కొంది. కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల్లో ఈ స్థాయిలో డిమాండ్ పడిపోయినట్లు వివరించింది.

ఈ ఏడాది మూడో త్రైమాసికంలో డిమాండ్ తగ్గినప్పటికీ.. పసిడిపై పెట్టుడుల్లో మాత్రం గణనీయమైన వృద్ధి నమోదైనట్లు నివేదిక తెలిపింది.

పెట్టుబడుల్లో డిమాండ్ వృద్ధి ఇలా

మొత్తం పెట్టుబడుల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా 2020 క్యూ3లో 21 శాతం పెరిగి 494.6 టన్నులుగా నమోదైంది. మదుపరులు 222.1 టన్నుల గోల్డ్ బార్​లు, కాయిన్లు కొనుగోలు చేశారు. 272.5 టన్నుల పసిడిని ఈటీఎఫ్​(ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్) రూపంలో కొన్నారు.

2019 క్యూ3లో బంగారంపై పెట్టుబడుల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా 408.1 టన్నులుగా నమోదైంది. అందులో149.4 టన్నులు బార్లు, కాయిన్ల రూపంలో కొనుగోలు చేయగా.. 258.7 టన్నులు ఈటీఎఫ్​ల రూపంలో కొన్నారు మదుపరులు.

భారత్​లోనూ పసిడిపై పెట్టుబడుల డిమాండ్ 2020 క్యూ3లో 52 శాతం పెరిగి 33.8 టన్నులకు (రూ.15,410 కోట్లు) పెరిగాయి. 2019 ఇదే సమయంలో 22.3 టన్నులుగా(రూ.7,450 కోట్లు) ఉన్నాయి.

2020 మూడో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల డిమాండ్ 29 శాతం తగ్గి.. 333 టన్నులకు పడిపోయింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ డిమాండ్ 468.1 టన్నులుగా ఉంది. అయితే గత ఏడాది మూడో త్రైమాసికం నుంచే పసిడి డిమాండ్ తగ్గుతున్న విషయాన్ని నివేదిక గుర్తు చేసింది.

"ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ 19 ప్రభావం ఇంకా ఉంది. చాలా మార్కెట్లలో భౌతిక దూరం, లాక్​డౌన్​తో కుదేలైన ఆర్థిక వ్యవస్థ, జీవనకాల గరిష్ఠానికి చేరిన బంగారం ధరలు. ఇవన్నీ ఆభరణాల కొనుగోలుదారులకు భారంగా మారాయి."

- లూయిస్ స్ట్రీట్, డబ్ల్యూజీసీ మార్కెట్ ఇంటెలిజెన్స్

మరిన్ని..

  • ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు గోల్డ్ ఈటీఎఫ్​ల హోల్డింగ్స్ రికార్డు స్థాయిలో 1,003.3 టన్నులకు పెరిగాయి.
  • టెక్నాలజీ రంగంలో పసిడి డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే 2020 క్యూ3లో 6 శాతం తగ్గి..76.7 టన్నులుగా నమోదైంది.
  • ఎలక్ట్రానిక్ రంగంలో పసిడి 2020 మూడో త్రైమాసికంలో డిమాండ్ స్వల్పంగా 6 శాతం తగ్గి..62.7 టన్నులుగా నమోదైంది.
  • పసిడి సరఫరా పరంగా చూస్తే.. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 3 శాతం క్షీణతతో 1,265.6 టన్నులుగా నమోదైంది. 2019 ఇదే సమయంలో ఇది 1,223.6 టన్నులుగా ఉంది.
  • పునరుత్పాదక బంగారం సరఫరా మాత్రం 6 శాతం పెరిగింది.

ఇదీ చూడండి:వడ్డీపై వడ్డీ మాఫీ.. ఎంత ఊరట?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.