ETV Bharat / business

'కరోనా రక్కసి' పోయినా 'ధరల భూతం' వదలదా?

author img

By

Published : Apr 6, 2020, 8:13 AM IST

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్.. ఆర్థిక వ్యవస్థలను సంక్షోభంలో కూరుకుపోయేలా చేస్తోంది. ద్రవ్యోల్బణం హెచ్చుమీరుతోంది. వైరస్ కట్టడి చేయడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వీటికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. మరి కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందా? అంటే.. అదీ అనుమానంగానే ఉంది.

Coronavirus: Will inflation make a comeback after the crisis ends?
కరోనా ద్రవ్యోల్బణం

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కకావికలం చేస్తోంది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవిస్తోంది. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థిక వ్యవస్థపైనా పెను ప్రభావం చూపుతోంది. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అంచున ఊగిసలాడుతోంది.

ఓవైపు ప్రజలు ఉద్యోగాలకు వెళ్లకపోవడం వల్ల సప్లై చైన్​కు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఫలితంగా ఉత్పాదకత దెబ్బతింటోంది. కరోనా ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తున్నాయి. వారి నిర్ణయాల కారణంగా స్వల్పకాలంలోనే లక్షలాది మంది జీవితాలు మారిపోయాయి. ఈ ప్రభావం భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ధరలు తగ్గవు!

కార్మికుల కొరత, ఉత్పత్తి తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి కలిగిస్తుంటే.. సామాజిక దూరం పేరిట పెద్ద కార్యక్రమాల రద్దు, పర్యటకం, వ్యాపారాలు, రెస్టారెంట్లు, షాపింగ్ సెంటర్లను మూసేయడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ రెండు కారణాల వల్ల నిరుద్యోగం రేటు వేగంగా పెరుగుతోంది. ఇది అతిపెద్ద ఆర్థిక మాంద్యానికి దారితీసే అవకాశం ఉంది. అయితే ఆర్థిక మాంద్యం సమయంలో సంభవించినట్లు.. డిమాండ్, సప్లై రెండూ తగ్గడం ద్వారా.. ధరలు తగ్గుతాయని ఆశించడానికి వీల్లేదు.

మరోవైపు కొవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం చూపించకుండా ప్రభుత్వాలు భారీగా వ్యయాలు చేస్తున్నాయి. 19, 20 శతాబ్దాల్లో రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత జరిగినట్లే ఈసారీ ప్రభుత్వ రంగ వ్యయాలు గణనీయంగా పెరుగుతాయి. వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత ప్రభుత్వ వ్యయాలు మళ్లీ అదుపులోకి వచ్చేస్తాయి.

ద్రవ్యోల్బణ భయాలు ఎక్కడి నుంచి ముంచుకొస్తున్నాయి? వైరస్ కట్టడికి తీసుకున్న తక్షణ చర్యల ఫలితంగా డిమాండ్, సప్లై ఒక్కసారిగా కుదేలైంది. సప్లై, డిమాండ్ హెచ్చుతగ్గులు అన్ని రంగాల్లో ఒకే స్థాయిలో లేకపోవడం వల్ల ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ద్రవ్యోల్బణ పెరుగుదలను గణించడం దాదాపు అసాధ్యమే.

రెండు యుద్ధాలు

ప్రభుత్వం కొవిడ్-19తో పాటు ఆర్థిక లోటుపైనా యుద్ధం చేస్తోంది. ఆర్థిక రంగాన్ని మూసేయడమే ఈ యుద్ధం ఫలితంగా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ సైనిక యుద్ధాలతో పోలిస్తే ఈ సమయంలో ద్రవ్యోల్బణ భయాలు తక్కువే అని చెప్పుకోవచ్చు. సప్లై, డిమాండ్​లో అసమానతలు యుద్ధ సమయంతో పోలిస్తే ప్రస్తుతం వేరుగా ఉంటాయి. యుద్ధ సమయాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉత్పత్తులు కొనుగోళ్లు చేస్తుంది. ఫలితంగా యుద్ధానికి సంబంధం లేని వస్తువుల సరఫరాను అధిగమించడం వల్ల అధిక ద్రవ్యోల్బణం నమోదవుతుంది. అయితే భవిష్యత్తులో ఈ వైరస్ ప్రభావం ఏమేరకు ఉంటుందన్న విషయంపైనే ఇప్పుడు అనిశ్చితి నెలకొంది.

వడ్డీ రేట్లు తగ్గిస్తే!

ఒకవేళ వైరస్​ను విజయవంతంగా నియంత్రించగలిగినా ఆర్థిక సంక్షోభం నుంచి వెంటనే బయటపడటం అనుమానమే. ఇప్పటికే వైరస్ సోకిన వారితో పాటు సంక్షోభం వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారు తిరిగి ఉద్యోగం సంపాదించుకోలేకపోతే ఉత్పత్తికి అవరోధాలు ఏర్పడతాయి. వైరస్ భయాలు తగ్గిన తర్వాత ప్రజలు బయట తిరగడం, వ్యాపారాలు పునఃప్రారంభించడం వల్ల డిమాండ్ కాస్త పెరిగే అవకాశం ఉంది. వ్యాపార సంస్థలు, వినియోగదారులు తక్కువ వడ్డీకే రుణాలు తీసుకునేందుకు మొగ్గుచూపుతారు. అంతిమంగా ఉత్పత్తి మందగమనం, ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అసమానతల కారణంగా స్తబ్దత('స్టాగ్ ఫ్లేషన్'-నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అత్యున్నత స్థాయిలో ఉండే స్థితి) ఏర్పడుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.