కొవిడ్ తర్వాత ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సర్వసాధారణమైపోయింది. దాదాపు అన్ని రంగాలు వర్క్ ఫ్రం హోంను అందిపుచ్చుకున్నాయి. అయితే దీని వల్ల మహిళా ఉద్యోగులు.. అటు అఫీస్ విధులు, ఇటు ఇంటి పనులు రెండింటినీ సమతుల్యం చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రముఖ జాబ్ పోర్టల్ సైకీ మార్కెట్ నెట్వర్క్ నిర్వహించిన సర్వేలో తేలింది.
మొత్తం 2,500 మంది మహిళా ఉద్యోగులపై ఈ సర్వే జరిగింది. ఐటీ, ఫినాన్స్, మీడియా, హెల్త్కేర్, ఎంటర్టైన్మెంట్, మానవ వనరులు, విద్య సహా వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు.
సర్వేలోని ముఖ్యాంశాలు..
- పురుషులతో పోలిస్తే వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేయడంలో సవాళ్లు ఎదుర్కొన్నట్లు 61 శాతం మంది వివరించారు.
- ఇంటి బాధ్యతల కారణంగా వర్క్ ఫ్రం హోం తమకు కష్టంగా మారినట్లు 85 శాతం మంది తెలిపారు.
- 81 శాతం మంది వృత్తిపరమైన పని, వ్యక్తిగత జీవితాన్ని విభజించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు.
- అవకాశముంటే భవిష్యత్లోనూ వర్క్ ఫ్రం హోంకు సిద్ధంగా ఉన్నట్లు 21 శాతం మంది పేర్కొన్నారు. 24 శాతం మంది వర్క్ ఫ్రం హోంలో తమకంటూ కొంత సమయం వెచ్చించుకోగలిగామని తెలిపారు.
- 48 శాతం మంది వర్క్ ప్లేస్ ఎంచుకునే సదుపాయం ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
- కరోనా సమయంలో తమ సంస్థలు చాలా సహకరించినట్లు 36 శాతం మంది తెలిపారు. 27 శాతం మంది మాత్రం తమ సంస్థ నుంచి ఎలాంటి సహకారం అందలేదని చెప్పుకొచ్చారు.
- ఇంటి వద్ద పనులు ఉన్నందువల్ల 65 శాతం మంది పని సమయాలు తగ్గించడం లేదా పని వేళల్లో వెసులుబాటు ఉంటే బాగుంటుందనుకున్నారు.
- మానసిక, వ్యక్తిగత శ్రేయస్సుకోసం తమ కంపెనీలు ప్రోత్సాహకాన్ని ఇచ్చాయని 12 శాతం మంది తెలిపారు.
ఇదీ చదవండి:చదువుల ఖర్చులు తట్టుకునేలా.. సిద్ధంగా ఉండాల్సిందే!